ఎవ్వరి జీవితం వాళ్లకే సరిపోతలేదు.. ఇంకొకరి గురించి పట్టించుకుని, ఇంకాస్త మాట్లాడితే పోరాటం చేసే రోజులా ఇవి..? కానీ, ఆ 24 ఏళ్ల ఇంజనీర్ యువతి మాత్రం అడవుల పరిరక్షణ, సమానత్వం, న్యాయం, గిరిజన హక్కుల కోసం విలక్షణంగా పోరాటం చేస్తుంది. అందుకు తన ర్యాప్ ను ఆయుధంగా మల్చకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ యువతి కథేంటి..?
మహారాష్ట్రలోని ఓ కుగ్రామం నుంచి జి. మహి ఇంజనీరింగ్ చదివింది. కానీ, ఇప్పుడామె ఇంజనీరై చక్కగా ఏ ఉద్యోగమో చేసుకుని పెళ్లి చేసుకుని అందరిలా స్టీరియోటైప్ జీవితం వైపు పయనిస్తే మనం మాట్లాడుకునేవాళ్లం కాదు. అందుకు భిన్నంగా ఆలోచించారు ఈమె. తన చదువు పూర్తి చేసిన మహి.. ఇన్ఫోసిస్ లో ఇంజనీర్ గా పనిచేస్తూనే.. ర్యాప్ సింగర్ అవతారమెత్తింది. తాను ర్యాప్ సింగర్ గా స్టేజ్ షోస్ చేసేది.. ఏవో నాల్గు రాళ్లు సంపాదించుకునేందుకూ కాదు! తన ర్యాప్ తో… హక్కులు కోల్పోతున్నవారి రాత మారుద్దామని… అడవుల నరికివేతను ఆపేద్దామని.. ఇంజనీర్ మహి కాస్తా ర్యాప్ గాయకురాలిగా రూపాంతరం చెందింది.

మహి. జి పూర్తి పేరు మధుర ఘనే. మహారాష్ట్రలోని మహదేవ్ కోలి గిరిజిన గ్రామానికి చెందిన యువతి. కష్టపడి చదివి ఇంజనీర్ అయింది. ఇంజనీర్ నుంచి ఇప్పుడు ర్యాపర్ అవతారమెత్తింది. కీర్తి కోసం ఆమె ర్యాపర్ గా మారలేదు… తమ గిరిజన గ్రామీణ జీవితాల్లో కష్టాలు, సమస్యలను, అడవుల్లో జరుగుతున్న విధ్వంసాన్ని… తాను కళ్లతో చూస్తున్న సత్యాన్ని ప్రపంచం ముందు పర్చేందుకు ఆమె పాటనెంచుకుంది.
లయ, ప్రాస మించి ఆమె సంగీతం ఇప్పుడు వివిధ వేదికలపై ఆకట్టుకుంటుంది. పాటే ప్రతిఘటనై.. పవర్ సెంటర్స్ ను సవాల్ చేస్తున్న పేరు మహి. జి. అంతేకాదు, ఇవాళ భారతీయ సమాజంలో ఇప్పుడిప్పుడే చర్చల్లోకొస్తున్న… విదేశాల్లో ఇప్పటికే ఆమోదముద్ర వేసుకున్న LGBTQ సమాజం తరపునా ఆమె ఇప్పుడు గొంతెత్తుతోంది. అలాగే, పర్యావరణ కాలుష్యాన్నీ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాలు పట్టించుకోకుండా బుల్డోజ్ చేసే సమస్యలను వెలుగులోకి తెచ్చే తన పాట.. ఇప్పుడో చర్చ. తన సమాజం కోసం ఆమె పాట ఇప్పుడు ఓ గంభీరమైన గొంతై ఎగిసిపడుతోంది… నిజాలను నిర్భయంగా పాడి వినిపిస్తోంది.
తమ స్వగ్రామమైన కలాన్ లోనే ఆమె పాటలను చిన్ననాటి నుంచే వింటూ ప్రాక్టీస్ చేసేది. ఇంజనీరింగ్ ఆమె వృత్తి అయితే… ర్యాప్ సంగీతం ఆమెకు ఓ లక్ష్యాన్ని చూపించింది. జంగిల్ చా రాజా నే ఆమె మొదటి ఆల్బమ్… తన గిరిజన ప్రజల గొంతుకైంది. గిరిజనానికీ, అడవులకూ మధ్యనున్న అవినాభావ బంధాన్ని ఎలుగెత్తి చాటింది. ఆ రెండింటికీ ముప్పుగా మారిన విధ్వంసంపై పదునైన విమర్శగా సంచలనం సృష్టించింది.
మహి. జి. ఎందుకు ప్రత్యేకమంటే… మూస ధోరణులను బ్రేక్ చేసే ఒక తెగువ ఆమె ర్యాప్ పాటలో కనిపిస్తుంది. ఆమె పాడిన హక్ సే హిజ్దా హున్ అనే పాట ట్రాన్స్ జెండర్స్ హక్కుల గీతమై ఇప్పుడు దేశమంతటా వినిపిస్తోంది. హమ్ సఫర్ ట్రస్ట్ తో కలిసి ఆమె ఈ పాట రూపొందించింది. బాప్ మానస్ డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ కు తన ఈ పాటతో నివాళులర్పించిన మహి ర్యాప్ సాంగ్ భారత్ అంతా ప్రతిధ్వనించింది. ఆమె ప్రతీ ట్రాక్ లోనూ ఏదో ఒక లక్ష్యంతో రికార్డ్ చేయడం భవిష్యత్ భారతంపై ఆమె విజన్ కు నిదర్శనం. మొత్తంగా ర్యాప్ మ్యూజిక్ తో మైక్రోఫోన్, మెగాఫోన్ ఉపయోగించి… మార్పు కోసం యత్నిస్తున్న యువతిగా మహి ఇప్పుడు వార్తల్లోకెక్కారు.
ఏదో నాల్గు స్టూడియోస్ లో ర్యాప్ సాంగ్స్ రికార్డ్ చేసి… ఎవరో ప్రైవేట్ వ్యక్తులతో కలిసి నాల్గు వీడియో షూట్స్ చేసి.. మరికొన్న ఆల్బమ్స్ ను యూట్యూబ్ లోనో, ఆడియో రూపంలోనో విడుదల చేసి వదిలేసేరకమైతే మహి గురించి మాట్లాడుకునేవాళ్లం కాదిక్కడ. కానీ, ఆమె ఖ్యాతిని ప్రముఖ సంస్థలు కూడా గుర్తిస్తున్నాయి. గ్రీన్ పీస్ ఇండియా వంటి సంస్థలతో ఇప్పుడు మహి భాగస్వామ్యమైంది. ఒక మారుమూల కుగ్రామం నుంచి ఎలుగెత్తిన గొంతు.. ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతోంది. హీట్ వేవ్స్, మారుతున్న వాతావరణ పరిస్థితులు, భూతాపం, వాటి పర్యవసానాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు, రోజూవారీ వేతన కార్మికుల సమస్యలు.. ఇలా కష్టజీవులు, శ్రమజీవుల ఇతివృత్తాలే మహి ర్యాప్ పాటలు.
భారత్ వంటి దేశంలో ర్యాప్ సంగీతాన్ని నిర్వచించి కేవలం పాటను వినోదంగానే కాకుండా… విలువలను గుర్తెరిగాలా మార్చి… సమాజం కోసం పాటైన ఇంజనీర్ మహి. జి.. ఉరఫ్ మధుర ఘనే.



