నాటి సభాపర్వంలో మయసభలో దుర్యోధనుడి వంటి విలన్ బక్రా ఐతే.. నేటి నాగరిక సమాజ మయసభలో అమాయకులే బక్రాలు. ఇది వ్యవస్థీకృత నేరాల మయసభ. ఆశకు హద్దుండకుంటే ఏం జరుగుతుంది..? రోజురోజుకూ మారుతున్న సాంకేతికతను హ్యాకర్స్, నేరగాళ్లు ఎలా ఉపయోగించుకుంటారో తెలీకుండా.. యాప్ లో కాలేస్తే ఏం జరుగుతుంది..? ఇదిగో ఈ కథ చెబుతుంది. అలాంటి మాస్టర్ మైండ్ ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ లో పట్టుబడ్డాడు. సినిమాలను తలదన్నే క్రైమ్ స్టోరీ ఇతగాడిది.
సోషల్ మీడియా ఇప్పుడెన్నింటికో వేదిక. మోబైల్ చేతుల్లో ఉంటే ఫింగర్ టిప్స్ పై సమాచార, సాంకేతిక వ్యవస్థతో ఆటలాడుకోవచ్చు. అయితే, ఆ ఆటకూ పరమితులుంటాయి. కానీ, ఆ పరిమితులు తెలిసి అంతకంటే అపరిమితమైన జ్ఞానంతో ఆడేటోళ్లే హ్యాకర్స్. అలాంటి హ్యాకర్ అనురాగ్ అరవింద్ శ్రీవాస్తవ గురించే ఈ నేర పరిచయం.
ఐపీవోలు, స్టాక్ ట్రేడింగ్ పథకాల పేరిట దేశవ్యాప్తంగా వేలాదిమందిని పెట్టుబడిదారులుగా మార్చి ఏకంగా 2 వేల 934 కోట్ల రూపాయల మోసానికి తెగబడింది ఓ నేరముఠా. అందులో కీలకమైనవాడే ఈ అరవింద్ శ్రీవాస్తవ.

జస్ట్ 36 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ ఇతడు. ఇతణ్ని పట్టుకునేందుకు నెలల తరబడి నిఘా కొనసాగింది. గుఢచర్య వ్యవస్థ ఎంతో చురుకుగా పనిచేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులకైతే నిద్ర లేని రాత్రులను మిగిల్చాడు. అయితే, ఎట్టకేలకు పోలీసుల ప్రయత్నం చివరకు ఫలించి మహారాష్ట్ర నాగపూర్ లో మూడురోజుల క్రితం ఆగస్ట్ 2న అరెస్టయ్యాడు ఈ సాంకేతిక నేరగాడు. శ్రీవాస్తవపై లక్నో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో భారతీయ న్యాయ సంహిత, సమాచార సాంకేతిక చట్టం (ఐటీ యాక్ట్) కింద కేసులు నమోదయ్యాయి.
ఇందులో ఉత్తర ప్రదేశ్ టాస్క్ ఫోర్స్ అధికారులది కీలకపాత్ర.
శ్రీవాస్తవ నేతృత్వంలోని ముఠా ఏం చేసేది..?
సోషల్ మీడియానే ఈ నేరగాళ్ల సంపాదనకు వేదిక. వాట్సప్ ద్వారా ఉచితంగా స్టాక్ మార్కెట్ విశ్లేషణలు, ఐపీఓ పెట్టుబడులపై మార్గదర్శకత్వం అందిస్తామంటూ ప్రకటనలిస్తూ అమాయక పెట్టుబడిదారులకు గాలం వేసేవాడు శ్రీవాస్తవ.
ఆసక్తి చూపినవారిని VIP9-6 ACI Exlusive Guidance Grouo అనే వాట్సప్ గ్రూపులో చేర్చుకునేవాడు. అందులో ఆన్లైన్ ట్రేడింగ్ సెషన్స్ నిర్వహిస్తూ భారీ లాభాలు వచ్చినట్టు చూపించే స్క్రీన్ షాట్స్ తో గ్రూప్ సభ్యులను మోసం చేసేవాడు. తద్వార మరో యాప్ ACI Century అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహించేవాడు. ఆ యాప్ లో నకిలీ లాభాలు చూపించి… అమాయకులైన గ్రూప్ సభ్యులతో పెట్టుబడులు పెట్టించేవాడు. అయితే, ఆ పెట్టుబడులు శ్రీవాస్తవ అండ్ క్రైమ్ కంపెనీకే వెళ్తుండేవేగానీ… ఏ ఐపీవోలోగానీ, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లోగానీ అసలు పెట్టనేలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.
పెట్టుబడిదారుల నుంచి ముందుగా సైబర్ క్రైమ్ ముఠా నియంత్రణలో ఉన్న పలు బ్యాంక్ ఖాతాలకు డబ్బు బదిలీ చేయించేవారు. యాప్ లో మాత్రం భారీ లాభాలు వచ్చినట్టు చూపించేవారు. అలా పెట్టుబడి పెట్టిన లక్నోకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విస్తృతమైన దర్యాప్తు చేస్తే ఈ సైబర్ క్రైమ్ లో చేదు నిజాలు బట్టబయలయ్యాయి.
సైబర్ మోసాలతో వచ్చిన డబ్బు నిర్వహణ కోసం శ్రీవాస్తవ… 2022లో వినోద్ కుమార్ రాథోడ్, వివేక్ కుమార్ సింగ్, శివానికా, నదీమ్ షేక్, సుధీర్, సంచిత్, ముఖేష్ అనే మరికొందరితో చేతులు కలిపి ఒక గేమింగ్ వ్యాపారాన్ని ఆరంభించాడు. సైబర్ క్రైమ్స్ రూపంలో బురిడీ కొట్టించిన డబ్బు నిర్వహణకు, అనుమానాస్పదంగా ఉండకుండా ఆర్థిక లావాదేవీల ఉపయోగానికి ఈ యాప్ ఆరంభించి ఉండవచ్చన్ని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సందేహం.
నాగపూర్ లో పట్టుబడ్డ శ్రీవాస్తవ దగ్గర 3 కోట్ల 17 లక్షల నగదు, రెండున్నర కోట్ల విలువైన సంతకం చేయని చెక్కులు, ఓ ల్యాప్ టాప్, ఐఫోన్, ఎస్యూవీ కారు, మూడు కంపెనీలకు సంబంధించిన రబ్బర్ స్టాంప్స్, 139 కార్పోరేట్ కంపెనీలకు సంబంధించిన పత్రాలు, ఆరు ఖాళీ చెక్ బుక్కులు, ఓ రెండు సిమ్ కార్డ్స్ ఇలా ఎన్నో లభ్యమయ్యాయి.
అత్యధిక ఫిర్యాదులందుకున్న ముఠాగా కూడా ఈ శ్రీవాస్తవ గ్యాంగ్ పేరుకెక్కింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం 3 వేల 87 ఫిర్యాదులు ఈ ముఠా సైబర్ ఆగడాలపై నమోదయ్యాయి. ఈ నేరగాళ్లు బురిడీ కొట్టించి వెనుకేసుకున్న మొత్తం సొమ్ము 2 వేల 934 కోట్ల భారీ మొత్తంగా పోలీసుల అంచనా. మోసాలకు పాల్పడిన నిధులుగా అనుమానిస్తున్న సుమారు 2 కోట్ల రూపాయలతో ఉన్న బ్యాంక్ ఖాతాలనూ స్తంభింపజేశారు.
పోలీస్ రికార్డుల ప్రకారం ఒక్క శ్రీవాస్తవపైనే కేవలం లక్నోలోనే 11 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. అదనంగా అండమార్ నికోబార్ దీవులతో పాటు.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కేసులున్నట్టు తేలింది. ట్రాన్సిట్ రిమాండ్ పై లక్నోకు తరలించిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపర్చా కోర్ట్ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ప్రస్తుతం స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, ఆర్థిక పత్రాలను విశ్లేషిస్తున్నారు. ఈ అంతరాష్ట్ర ముఠాలని ఇతర సభ్యులకై వేట కొనసాగుతోంది. నకిలీ ఐపీఓ మోసాల్లో డబ్బు ప్రవాహం ఏవిధంగా సాగిందో గుర్తించండ కోసం దర్యాప్తు జరుగుతోంది.



