మనిషి కుక్కను కరిస్తే వార్తగానీ.. కుక్క మనిషిని కరిస్తే వార్తేంటీ…? ఆ మధ్య కొందరు మన నాయకుల నోళ్లల్లోంచి మీడియాపై అక్కసు వెళ్లగక్కే యత్నంలో వచ్చిన మాటలివి. కానీ, కొన్ని నోళ్లు ఏది మాట్లాడితే అదే జరుగుతుందో, ఏమోగానీ.. అంతకన్నా ఓ డేంజర్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.
అదే బీహార్ లో ఓ పాము ఓ వ్యక్తిని కాటేస్తే… తిరిగి ఆ మనిషి ఆ పామును రెండు సార్లు కొరికిపారేశాడు.

తనకెక్కిన విషం తిరిగి పాములోకి వెళ్లిపోతుందనే మూఢనమ్మకమో, ఏమోగానీ.. ఈ సంఘటన ఇప్పుడందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
సంతోష్ లోహార్ అనే 35 ఏళ్ల రైల్వే ఉద్యోగి రాజౌలీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పట్టాలు వేసే పనిలో ఉన్నాడు. గత మంగళవారం రాత్రి తన పని ముగించుకుని అక్కడే పడుకునేందుకు ఉపక్రమిస్తుండగా… సంతోష్ పాముకాటుకు గురయ్యాడు. ఇక అంతకుముందు ఎవరు చెప్పారో, ఏం చెప్పారోగానీ… పాముకాటుకు గురైన వెంటనే సంతోష్ దాన్ని దొరకబుచ్చుకుని రెండుసార్లు తన నోటితో కొరికిపారేశాడు. దాంతో పాము స్పాట్ డెత్ అయింది.
అయితే, తనకు ఎవరో చెప్పిన విషయాన్ని నమ్మిన మూఢనమ్మకంతోనే సంతోష్ బతికి బట్టకట్టలేదు. సకాలంలో వైద్యం అందడంతో సంతోష్ బతికిపోయాడు. లోహర్ సహచరులు పక్కనే ఉండటం వల్ల అది చూసి వెంటనే రాజౌలీ డివిజన్ ఆసుపత్రికి తరలించారు. సతీష్ చంద్ర సిన్హా అనే వైద్యుడు అతడికి పూర్తిస్థాయి చికిత్సనందాక.. తిరిగి తెల్లవారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయాడు సంతోష్. లోహర్ చికిత్సకు బాగా స్పందించాడని, అందుకే తొందరగా కోలకున్నాడని చెప్పారు డాక్టర్ సిన్హా. అయితే, సంతోష్ ను కాటు వేసిన పామేంటో కనీసం కర్చిన తనకు కూడా తెలియకపోగా.. దాన్నెవ్వరూ గుర్తించలేకపోయారు.
మనదేశంలో ఏటా 50 వేల మంది పాము కాటుకు గురవుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరణాలకు కారణమైన పాములను కూడా ఇప్పటికే గుర్తించగా.. వాటిలో నాల్గు విషపూరిత పాములున్నాయి. వాటిలో కామన్ క్రైట్, ఇండియన్ కోబ్రా, రస్సెల్స్ వైపర్, సా-స్కేల్డ్ వైపర్ వంటి పాములతోనే 90 శాతం ప్రాణాలు పోయే అవకాశముందంటున్నారు ఎన్విరాన్ మెంట్ తో పాటు.. విషసర్పాలపై పరిశోధనలు చేసేవారు.
అయితే, పాముల సంగతలా ఉంటే.. విషపూరితమైన పాములు కూడా ఏమీ చేయలేని పున్నమినాగు చిరంజీవి క్యారెక్టర్ తరహాలో సంతోష్ లోహార్ ఏకంగా పామును తాను తిరిగి కర్చిన ఓ పెద్ద సాహసంతో చర్చకైతే తెరలేపి వార్తల్లో వ్యక్తయ్యాడు.



