Mani Bhushan.. ✍🏻
ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా తమిళనాడు పీఠం TVK అధినేత విజయ్దే. ఎవరికీ సందేహం లేదు.
కాకపోతే, ఫలితాలు వెలువడ్డాక ఈ నాలుగయిదు రోజుల నుంచీ విజయ్ ప్రవర్తిస్తున్న తీరు సందేహాస్పదంగా ఉంది.
పొద్దునొకసారి, సాయంత్రమొకసారి గవర్నర్ దగ్గరకెళ్లి శాలువా కప్పేసి, లిస్ట్ చేతిలో పెడుతున్నారు. గవర్నర్ ‘ఇలా కాదు, కుదరదు’ అంటున్నారు.

ఈ మొత్తం డ్రామాలో… ‘నేను రెడీగా ఉన్నానుగానీ, గవర్నర్ కాలడ్డం పెడుతున్నార’ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది.
విజయ్ సినీ జీవితంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, బయ్యర్లతో మినిమం గ్యారంటీ (ఎంజి), టేబుల్ ప్రాఫిట్ల గురించి మాటాడి ఉంటారు. రాజకీయాల్లో అవసరమైతే ‘బొంత పురుగునైనా ముద్దాడాలి’ అన్న సంగతి తెలీక, ఎవరి గుమ్మం తొక్కలేదు. రాజకీయ బేరసారాలు జరపలేదు.
.
తమిళనాడులో ఏర్పడ్డ త్రిశంకు ఫలితాల్లో… ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అర్లేకర్ తీసుకునే నిర్ణయం చరిత్రలో నిలబడిపోవడం ఖాయం. సర్వామోద నిర్ణయం తీసుకోకపోతే ఏ.పి. మాజీ గవర్నర్ రాంలాల్ వలె అపకీర్తి మూటగట్టుకుంటారు.
ఈ విషయం తెలుసు కాబట్టే, గవర్నర్ అర్లేకర్ నిష్కళంక నిర్ణయం (flawless decision) కోసం వెయిట్ చేస్తున్నారు. కానివ్వండి, తొందరేముంది. ఎలాగూ శని ఆదివారాల్లో అష్టమి నవమి తిథులు. సోమవారంనాడు దశమి మంచి రోజు.
.
ఇక, ముందుగా ఏర్పడాల్సింది తమిళనాడు శాసనసభ.
ఫలితాలు వెలువడ్డాక, ఎన్నికైన సభ్యుల జాబితాలు పంపించి, ‘నోటిఫికేషన్ గడువు పూర్తయిందని, ఎక్కడికక్కడ నూతన సభలు ఏర్పాటుకు ఆటంకం లేదని’ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం (ఆరో తేదీ)నాడే ఆయా రాష్ట్రాల గవర్నర్లకు తెలియపరిచింది.
అంబేద్కర్ మహాశయుడు తాను రూపొందించిన రాజ్యాంగంలో ప్రజా ప్రాతినిధ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆర్టికల్ 188 ప్రకారం ఎన్నికైన ప్రతి ఒక్కరూ ప్రమాణం చేసి, శాసన సభ్వత్వాన్ని పొందాల్సిందే. ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం ఏర్పడకపోయినా సరే, ప్రొటెం స్పీకర్ ద్వారా ప్రమాణం చేయించవచ్చు.
తొలి అసెంబ్లీ ఏర్పడేనాటికి ప్రభుత్వం ఏర్పడాలన్న నిబంధన లేదు. అదొక సంప్రదాయం. ముందుగా అధిక స్థానాల లెజిస్టేచర్ పార్టీ తమ నాయకుడిని (ముఖ్యమంత్రిని) ఎన్నుకోవడం, ఆయన సూచన మేరకు కేబినెట్ నిర్ణయం కావడం… గవర్నర్ అందరితో ప్రమాణం చేయించడం పరిపాటి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. అలాగని, సభను ఆపకూడదు.



