భారతీయ రైల్వేకు 173 ఏళ్లు… మరి భారత్ లో మొట్టమొదటి రైలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎప్పుడు జరిగిందో తెలుసా..?
ఇండియన్ రైల్వేస్ ఈ మధ్యే తన 173వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. సరిగ్గా 1853, ఏప్రిల్ 16న దేశంలో… ప్రయాణీకుల రవాణా సౌకర్యార్థం మొట్టమొదటి రైలు ముంబై నుంచి థానే వరకు నడిచింది. అదే భారతీయ రైల్వే రంగంలో నేడు విప్లవాత్మక మార్పుల వరకూ బాటలు వేసింది.

ప్రయాణీకులతో కూడిన తొలి రైలు.. ముంబైలో ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ గా పిల్చుకుంటున్న నాటి బోర్ బందర్ స్టేషన్ నుంచి ఆరంభమైంది. నాటి ఆ రైలు ప్రయాణానికి సంబంధించిన పూర్తి నిర్వహణంతా కూడా.. గ్రేట్ ఇండియన్ పెనిన్సూలా రైల్వే ఆధ్వర్యంలో నడిచేది. 1900 సంవత్సరంలో జీఐపీఆర్.. ఇండియన్ మిడ్ ల్యాండ్ రైల్వేస్ తో విలీనమైంది.
భారతదేశంలో మొట్టమొదట రైల్వే ప్రయాణం ఆరంభమైన రోజున 1853, ఏప్రిల్ 16న పబ్లిక్ హాలిడే కూడా ప్రకటించారు. దాంతో బోర్ బందర్ స్టేషన్ రైలును ప్రత్యక్షంగా చూసేందుకు కిక్కిరిసిన జనంతో కిటకిటలాడింది.
బాంబే టూ థానే వరకు రైల్వే నిర్మాణం ఆలోచన మొట్టమొదట 1843లో బాంబే ప్రభుత్వ ప్రధాన ఇంజనీర్ గా పనిచేసిన జార్జ్ క్లార్క్ కు వచ్చింది.
మొదటి రైలు ప్రయాణంలో ఇంకొన్ని విశేషాలు!
సుమారు 400 మంది ప్రయాణీకులతో నాటి మొట్టమొదటి రైలు బాంబే టూ థానే వరకు వెళ్లింది.
మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బయల్దేరింది.
మొట్టమొదటి రైలులో 14 బోగీలుండేవి.
మూడు ఆవిరి ఇంజన్లు కలిసి రైలును లాగాయి.
ఆ ఆవిరి ఇంజన్ల పేర్లు సుల్తాన్, సింధ్, సాహిబ్.
ప్రయాణ ఆరంభానికి ముందు 21 గన్స్ తో సెల్యూట్ ఇచ్చి ఘనంగా ప్రారంభించారు.
ఆ రైలు సుమారు 35 కిలోమీటర్ల దూరాన్ని 57 నిమిషాల్లో పూర్తి చేసింది.
థానే బ్రిడ్జ్ కూ భారతీయ రైల్వేల చరిత్రలో ప్రత్యేక స్థానముంది. తొలి రైలు ముంబై నుంచి థానే మధ్య ప్రతిపాదించినప్పుడే ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్నీ చేపట్టి పూర్తి చేశారు.
దశలవారీగా భారతీయ రైల్వే పరిణామక్రమం!
కాలక్రమేణా భారతీయ రైల్వే గొప్ప మార్పులను చూసింది. ఆవిరి ఇంజన్ల నుంచి డీజిల్ లోకోమోటివ్స్ కు.. ఆ తర్వాత ఎలక్ట్రికల్ రైళ్ల వరకూ విప్లవాత్మక మార్పులతో దేశంలోనే సామాన్యుల అతి పెద్ద రవాణా వ్యవస్థంగా అవతరించింది. వందేభారత్ రైళ్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు మరింత పర్యావరణ అనుకూల రవాణా దిశగా అడుగులేస్తోంది. త్వరలోనే హైడ్రోజన్ ఆధారిత రైళ్లను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది ఇండియన్ రైల్వేస్. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు నడపాలన్న ప్రణాళికతో అడుగులేస్తోంది.
భారతీయ రైల్వే వ్యవస్థ దేశ అభివృద్ధిలో, ప్రజారవాణాలో కీలక పాత్ర పోషిస్తూనే.. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్స్ లో ఒకటిగా ఎదగడం విశేషం.



