వ్యాఘ్ బక్రీ టీ… ఈ పేరెప్పుడైనా విని ఉన్నారా..?
ఇప్పుడంటే జెమినీ, చక్రగోల్డ్, రెడ్ లేబుల్, త్రీరోజెస్, తాజ్ మహల్ ఇలా ఛాయ్ పత్తా పేర్లు మనం వాడకాన్ని బట్టి మనందరి ఎరుకలో ఉండేవి. కానీ, అలాంటి ఓ పాప్యులర్ టీపొడే వ్యాఘ్ బక్రీ టీ. దీని వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది.
వ్యాఘ్ బక్రీ టీది దక్షిణాఫ్రికా నుంచి భారత్ వరకూ ఓ సుదీర్ఘ ప్రయాణం.

వ్యాఘ్ బక్రీ టీ పరిచయం!
భారతదేశ వ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తర భారతంలో లక్షలాది మంది ఆస్వాదించే ప్రసిద్ధ ఛాయ్ పత్తా బ్రాండ్. 134లో నర్సన్ దాస్ దేశాయ్ ఈ టీ పొడి తయారీకి మూలకారకుడు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి తన టీ వ్యాపారానికి గుజరాత్ ను కేంద్రంగా చేశారు. ఆరంభంలో దక్షిణాఫ్రికాలో 500 ఎకరాల్లో టీ తోటను సంపాదించి అక్కడే తన వ్యాపారాన్ని విస్తరించారు. కానీ, నాటి బ్రిటీష్ పాలనలో అణిచివేత, జాతి వివక్ష వంటి కారణాలతో ఆయన భారత్ కు తిరిగివచ్చారు.
గాంధీజీ ఆశయాలే ఆదర్శంగా!
నర్సన్ దాస్ దేశాయ్ కి మహాత్మాగాంధీ అంటే అమితమైన భక్తి. ఆయన్నే ఆదర్శంగా తీసుకునేవారు. దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరిగి వచ్చినప్పుడు ఆయన కొన్ని వస్తువులతో పాటే… నాడు బాపూజీ రాసిన ఓ లేఖను కూడా వెంటబెట్టుకుని వచ్చారు. 1915, ఫిబ్రవరి 12వ తేదీతో ఉన్న ఆ లేఖలో దేశాయ్ ప్రతిభను కొనియాడుతూ.. దక్షిణాఫ్రికాలో విజయవంతమైన టీ తోట యజమానిగా ప్రశంసిస్తూ రాసిన లేఖ అది. అలా సౌత్ ఆఫ్రికా నుంచి గుజరాత్ కు తిరిగి వచ్చిన నర్సన్ దాస్ దేశాయ్ కి… గుజరాత్ లో టీ వ్యాపారంలో ప్రవేశించడానికి గాంధీ లేఖ ఓ ధృవపత్రంలా, నేటి ఆధార్ కార్డులా ఉపయోగపడింది.

గుజరాత్ టీ డిపో స్థాపన!
భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత దేశాయ్ టీ వ్యాపారన్ని గుజరాత్ కేంద్రంగా ఆరంభించారు. 1915లో ఆయన గుజరాత్ టీ డిపో కంపెనీ పేరిట ఛాయ్ పత్తా ఉత్పత్తితో భారత్ లో నూతన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తిరిగి 1934లో దానికి వ్యాఘ్ బక్రీ టీ అని పేరు మార్చారు. క్రమంగా నర్సన్ దాస్ దేశాయ్ వ్యాఘ్ బక్రీ టీ దేశమంతటా విస్తరించి ప్రజాదరణ పొందింది.
ఆకట్టుకునే లోగో!
వ్యాఘ్ బక్రీ టీ లోగోనే ఆకట్టుకునేలా ఉంటుంది. వ్యాఘ్ అంటే గుజరాతీలో పులి అని అర్థం. వ్యాఘ్రం అని కూడా మనం పిలుస్తుంటాం. అలాగే బక్రీ అంటే మేక. పులి, మేక రెండూ కలిసి ఒకే కప్పులో టీ తాగుతున్నట్టుగా వాఘ్ బక్రీ టీ లోగోను డిజైన్ చేశారు. ఐక్యతకు, సామరస్యానికి ప్రతీకగా కూడా ఆ లోగో డిజైన్ ప్రతీకాత్మకంగా చేశారనీ చెబుతారు. పై తరగతి, దిగువ తరగతి అన్న భేదం లేకుండా ప్రజలంతా కలిసి టీ తాగుతూ ఐక్యంగా ఉండాలనే ఓ మెస్సేజ్ ఒరియెంటేషన్ ఆ లోగో డిజైన్ వెనుకుందట.
ప్రపంచవ్యాప్త విస్తరణ, వ్యాపారాభివృద్ధి!
వ్యాఘ్ బక్రీ టీ ఇప్పటికీ భారతదేశంలో 15 టీ లాంజులను నిర్వహిస్తోంది. అమెరికా, కెనడా, మధ్యప్రాచ్యం, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకూ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 2021 మార్చి నాటికి కంపెనీ మొత్తం అమ్మకాల్లో 5 శాతం ఎగుమతుల నుంచే వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి.
నర్సన్ దాస్ దేశాయ్ స్థాపించిన వ్యాఘ్ బక్రీ టీ సంస్థ టర్నోవర్ ప్రస్తుతం 15 వందల కోట్లు. 40 మిలియన్ కిలోలకు పైగా టీ పొడి ఆకులను పంపిణీ చేస్తోంది. రాజస్థాన్ నుంచి కర్నాటక, గోవా వరకూ దేశవ్యాప్తంగా వ్యాఘ్ బక్రీ టీ వినియోగించేవారి సంఖ్యా అధికమే. సుమారు 5 వేల మందికి ఉపాధి కల్పిస్తూ భారతదేశంలో ప్రముఖ టీ బ్రాండుగా నిల్చింది ఈ టీ పొడి.



