ఆయన్ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్… ఆర్కిటెక్ట్ ఆఫ్ మాడర్న్ క్రికెట్ గా కొనియాడింది. క్రికెట్ కు టీవిలో ఉండబోయే క్రేజ్, భవిష్యత్తును ముందే ఊహించిన ఆధునిక క్రికెట్ శిల్పిగా స్మరించుకుంది.
మొన్న ఆదివారం రోజన జనవరి 24వ తేదీ, 2026న ఇంద్రజిత్ సింగ్ బింద్రా న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆయనకు ఘనమైన శ్రద్ధాంజలి ఘటించింది. బీసీసీఐకి ఎందరో అధ్యక్షులుగా వస్తూ, పోతూ ఉన్నా… కేవలం మాజీ అధ్యక్షుడి హోదాలోనే కాకుండా.. క్రికెట్ పై ఉన్న వలసవాదపు సంకెళ్లను తెంచేసిన దూరదృష్టి గల్గిన నాయకుడిగా బింద్రాను బీసీసీఐ ఆకాశానికెత్తింది.

1987 వరల్డ్ కప్ ను భారత్ లో నిర్వహించడంలో కీలక పాత్రధారుడు బింద్రా!
జగన్మోహన్ దాల్మియాతో కలిసి బింద్రా 1987 రిలయన్స్ వరల్డ్ కప్ ను భారత్ లో నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. బీసీసీఐకి పాలనాపరమైన నాయకుడిగా వ్యవహరించడం వరకే బింద్రా బాధ్యత తీసుకోలేదు… 1987 వరల్డ్ కప్ ను భారత్ లో నిర్వహించేలా చేసి.. భౌగోళిక, రాజకీయ మార్పుకు సంకేతాన్నందించారు. 1987 వరల్డ్ కప్ తర్వాతే భారత క్రికెట్ ముఖచిత్రం మరింత ఆత్మవిశ్వాసంగా మారింది. ఇంగ్లాండ్, ఆస్ట్లేలియా వంటి దేశాలతో పోలిస్తే… భారత్ కూడా శక్తివంతంగా తయారు కావడంలో ఆయన కృషి ఉపయోగపడింది.
శాటిలైట్ టీవీలో క్రికెట్ ప్రసారాల్లోనూ బింద్రాది దూరదృష్టి!
ఇవాళ మనం ఎల్ఈడీల్లో ఎంజాయ్ చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటివాటిని ముందే ఊహించిన ఒక సృజనశీలి బింద్రా. ఇవాళ జరుగుతున్న బిలియన్ డాలర్ల ఐపీఎల్ ప్రసారాల ఒప్పందాలకు ఎంతో ముందే.. ప్రసార హక్కుల్లో వచ్చే అపార లాభాల్నీ అంచనా వేసిన యుక్తి బింద్రాది. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఏమంటారంటే.. క్రికెట్ ను ఆర్థికంగా నిలకడగా ఉంచుతూనే… గ్లోబల్ లెవల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించే స్థాయికి భారత క్రికెట్ ను చేర్చేందుకు బింద్రా సంస్కరణలెంతో ఉపాయోగపడ్డాయి.
మొహాలీలో స్టేడియానికి బింద్రా పేరు!
అభిమానులకు ఆయనలో కనిపించే గొప్ప వారసత్వం… పంజాబ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలే. అందుకే 2015లో ఆయన గౌరవార్థం మొహాలీ స్టేడియానికి ఐఎస్ బింద్రా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంగా పేరు మార్చారు. మొహాలీ స్టేడియం ఇప్పుడు ఆయన క్రికెట్ కు చేసిన 36 ఏళ్ల సేవలకు సజీవ స్మారక చిహ్నంగా నిలుస్తోంది.
ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మాన్హాస్ నుంచి కార్యదర్శి దేవజిత్ సైకియా వరకూ అందరి భావనా ఒక్కటే. బింద్రా కేవలం ఆటను మాత్రమే నడిపించాలనుకోలేదు. ఆటగాళ్లనూ.. ఆటను ప్రేమించే అభిమానులనూ అలరించేదిగా క్రికెట్ ను తీర్చిదిద్దాడు. బింద్రా అంటే కేవలం పాలనా పగ్గాలు చెపట్టిన ఓ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే కాదు… ఇవాళ నిర్మితమైన ఒక పరిపూర్ణమైన భారత క్రికెట్ వ్యవస్థలో ఆయనది కీలకపాత్ర. అందుకే భారత క్రికెట్ పాలనలో ఒక దృఢ స్తంభాన్ని కోల్పోవడంపై బీసీసీఐ విచారం వ్యక్తం చేసింది.



