ప్రతిపక్షం కీలకపాత్ర పోషించని చోట.. స్వపక్షంలో విపక్షమాయన. పక్కనే ఉంటూ ముక్కులో వెంట్రుకలు పీకడంలో దిట్ట. ఆయనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.

గతంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా బీజేపీ పెద్ద తలకాయలను ఒకింత డిఫెన్స్ లో పడేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కూడా ఆయన మాటల్లో మర్మం వెనుక మళ్లీ చర్చకు తెరలేపారు మోహన్ భగవత్.
ముందు జస్ట్ మనుషుల్లానే ప్రవర్తిస్తారు.. ఎదుగుతున్న కొద్దీ కొందరు తాము మానవులకంటే కొద్దిగా ఎక్కువనుకుంటారు. ఆ తర్వాత మరింతగా ఎదిగినప్పుుడు తమకు తాము దేవతలమని, ఆ తర్వాత తామే విశ్వరూపమనుకుంటారంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త డిస్కషన్ కు తెరలేపాయి.
ఈ మాటలు మోహన్ భగవత్ జనరలైజ్డ్ కామెంట్సా… లేక, ఎవర్నైనా ఉద్ధేశించి చేసిన స్వీపింగ్ కామెంట్సా అనేది చర్చకు తెరలేపింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ గా మోహన్ భగవత్ నిన్న జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లాలో వికాస్ భారతి అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పైగా ఆయన ఈ వ్యాఖ్యలతో పాటు.. ఆయన నోటి నుంచి వెలువడ్డ మరికొన్ని కామెంట్స్ కూడా కచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ బీజేపీలోని పెద్ద తలకాయలన్నింటినీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. దేశ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉన్నట్టు కొందరు భావిస్తున్నారన్నట్టుగా మోహన్ భగవత్ మాటలు కనిపించాయి. దేశ భవిష్యత్తుపై ఎప్పుడూ సందేహం లేదని… ఎందరో దేశ సంక్షేమం కోసమే పాటు పడుతున్నారని… అదే సంఘటితంగా దేశానికి మంచి ఫలితాలనిస్తుందంటూ ఆయన మాట్లాడిన మాటల్లో వెతికితే… ఎవరినుద్ధేశించి మాట్లాడారనేది కచ్చితంగా అర్థం చేసుకోవచ్చు.
వ్యక్తిగత కీర్తి కోసం కాకుండా.. దేశ సంక్షేమం కోసం చాలామంది పనిచేస్తున్నారంటూనే… వ్యక్తిగత ఖ్యాతి కోసం పాటుపడేవారిని ఏకిపడేశారు మోహన్ భగవత్. 33 కోట్ల మంది దేవతలను కొలుస్తున్న మనం.. 3 వేల 800 కంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నామని.. ఆహార అలవాట్లు కూడా ఎంతో భిన్నమని.. ఆరాధనల్లోనూ భిన్న పద్ధతులుంటాయని.. అయినా, భిన్నత్వంలో ఏకత్వం కనిపించే దేశం భారత్ ఒక్కటేనన్నారు ఆర్ఎస్ఎస్ అధినేత.
అంటే, మత ప్రతిపాదికన జరుగుతున్న వ్యవహారాలనూ.. ఆయన తన ప్రసంగంలో ఎక్కడా తప్పు పట్టకుండానే… మరోవైపు అదే ప్రతిపాదికగా పునాదులు వేయాలని చూస్తున్నవారికి గట్టి చురకలంటించారు. ప్రగతిశీలురనుకునే వారు ఎవరైనా.. తిరిగి దేశానికి ఎంతో కొంత తిరిగి ఇస్తారన్న మోహన్ భగవత్… గ్రంథాల్లో లేని సారాంశాన్ని కూడా ఆచరణాత్మకంగా ఈ దేశంలోని ప్రగతిశీలురు చేసి చూపించారన్నారు. ఇది తరతరాలుగా భారతదేశంలో ఇమిడి ఉన్న ఒక అద్భుతమైన స్వభావంగా పేర్కొన్న మోహన్ భగవత్ మాటల అస్త్రాలు… మళ్లీ ఎవరికి గురిపెట్టినట్టన్న చర్చతో పాటు.. ఎవరికి గురిపెట్టారో ప్రత్యేకంగా చెప్పాలా అని కొందరు మాట్లాడుకునే చర్చకూ తెరతీశారు.



