కొత్త ఆవిష్కరణలవైపు యువత అడుగులు వేయాలి… సంప్రదాయ, సనాతనాల్లో సమాజానికి ఉపయోగపడేది మాత్రమే గ్రహించి.. మిగిలిన మౌఢ్యాలను త్యజించాలి… ప్రయోగాత్మక వైఖరితో సాహసంగా ఒక ముందడుగు వేయాలి.. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యాలైతాయి.. కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి.. అద్భుతాలు జరుగుతాయి… ఆ పని చేశాడు కాబట్టే ఈరోజు స్కైరూట్ పవన్ కుమార్ చందన గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది.
35 ఏళ్ల పవన్ కుమర్ చందన ఓ హైద్రాబాదీ. స్కైరూట్ ఏరోస్పేస్ వంటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ తో ఇప్పుడు ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

కేవలం 51 మార్కులతో లెక్కలు పెద్దగా రాని పాస్ మార్కుల ఓ సాధారణ విద్యార్థి భవిష్యత్… ఎవరూ ఊహించలేని, కనీసం ఎవరి ఊహలకు కూడా అందని సంక్లిష్టమైన ఆర్బిటల్ మెకానిక్స్ లెక్కలను శాసించే స్థాయికి చేరుతుందని మాత్రం ఎవరూహిస్తారు..? కానీ, ఊహకందని ఆ విషయాన్ని పవన్ కుమార్ చందన ఊహించాడు.. ఊహించుకున్నదాన్ని నిజం చేశాడు.. తన కలను సాకారం చేసుకున్నాడు.. ఇవాళ అంతర్జాతీయ స్పేస్ టెక్ స్టార్టప్ గా తన స్కైరూట్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాడు.
ఏంటీ మిషన్ ఆగమన్..?
శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ -1 నింగిలోకి దూసుకెళ్లిన క్షణం… భారత్ లో కూడా ప్రపంచంతో పోటీపడే ఆవిష్కర్తలున్నారనే సందేశాన్ని పంపాడు పవన్ కుమార్ చందన. ఇక ప్రయోగమూ విజయవంతం కావడంతో అంతరిక్షంలో ఇప్పటివరకూ అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్, న్యూజిలాండ్ కు చెందిన రాకెట్ ల్యాబ్ వంటి ఏవో కొన్ని అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలకు మాత్రమే పరిమితమైన క్లబ్బులో ఇప్పుడు భారత్ పేరునూ సగర్వంగా చేర్చాడు.
గణితంలో వీక్ స్టూడెంట్ నుంచి… అగణితంగా మారిన పట్టుదల!
పవన్ కుమార్ చందన 90ల కిడ్. హైదరాబాదీ అయిన ఇతగాడు పాస్ మార్కులతో బయటపడే విద్యార్థి. కానీ, తండ్రి ప్రోత్సాహంతో గట్టిగా చదివాడు. ఐఐటీ ఖరగ్ పూర్ కు సెలెక్టయ్యాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇవాళ ఎందరో నడిచే ఐటీ దారిలో పయనించకుండా… ఇస్రో వైపు అడుగులేసి.. 2012లో సైంటిస్టుగా చేరాడు. జీఎస్ఎల్వీ ఎంకే 3 ప్రాజెక్టులో కీలక పాత్రధారిగా మారాడు.
ప్రైవేట్ స్పేస్ కంపెనీ పెట్టాలన్నదే లక్ష్యంగా అడుగులు!
ఇస్రోలో ఉన్నప్పుడే ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్థాపించాలనే ఆలోచనలు తీవ్రంగా ఉండేవి. కానీ, భారతదేశంలో చట్టబద్ధంగా ఆ ఫెసిలిటీ లేకపోవడంతో చాలాకాలం తన ఆశలు అడియాసలే అయ్యాయి. అయినా పట్టు వదల్లేదు. మింత్రా వ్యవస్థాపకుడైన ముఖేష్ బన్సాల్ కు పవన్ పంపిన ఒక సందేశం పవన్ జీవితాన్నే మార్చేసింది. లింక్డ్ ఇన్ లో పంపిన ఆ సందేశంతో.. ఒకటిన్నర మిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చిపడింది. దాంతో మరో స్నేహితుడైన నాగ భరత్ డాకాతో కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ ను స్థాపించాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో స్కైరూట్ పేరు మార్మోగిపోతోంది. పవన్ కుమార్ చందన వ్యూహాలకు ఇన్వెస్టర్స్ ఫిదా అయిపోవడంతో.. ఇప్పుడు స్కైరూట్ విలువ 9 వేల 100 కోట్లకు పైబడి ఉండటమంటే మామూలు విజయం కాదిది. దీంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు స్కైరూట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంటర్నేషనల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్ లో స్కైరూట్ భారత్ తరపున ఒక గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలున్నట్టు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
విక్రమ్ 1 ప్రత్యేకతేంటసలు..?
ఘన, ద్రవ ఇంధన సాంకేతికతలతో రూపొందిన విక్రమ్ 1 ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్.. శాటిలైట్లను మోసుకెళ్తుంది. ప్రధాని మోడీ స్వదస్తూరితో రాసిన వందేమాతరం పోస్ట్ కార్డు నుంచి.. భారతీయ శాస్త్రవేత్తల సందేశాలు, మైక్రో ఆర్ట్ పేలోడ్ వంటివి అంతరిక్షంలోకి పట్టుకెళ్లింది.
ఓ యావరేజ్ కుర్రాళ్లు… బిలయన్ డాలర్ల కంపెనీలను సృష్టించి హీరోలైనవారెందరో. కానీ, పవన్ కుమర్ చందన శాస్త్ర, సాంకేతిక రంగంలో ఆ ఫీట్ సాధించడమే గొప్పగా చెప్పుకునే గొప్ప.



