ఇప్పుడంటే అత్యంత ధనవంతులుగా ఇండియాలో గుజరాతీల హవా కనిపిస్తుండొచ్చునేమోగానీ… ఒకనాడు ఈ మొత్తం భూగ్రహం మీదే మన హైదరాబాదీనే.. అందరికన్నా ధనవంతుడన్న విషయం మీకు తెలుసా..?
ఆయనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ ఏడవ నిజాం. ఆయన ఆస్తి మొత్తం 200 బిలియన్ డాలర్లు.. అంటే, సుమారు ఇండియన్ కరెన్సీలో 17 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. అందుకే, ఆనాడే టైం మ్యాగజీన్ లో మీర్ ఉస్మాన్ ఖాన్ ఫీచర్ ఫోటోతో ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ గా ఆర్టికల్ ప్రచురితమైంది. నాటి ప్రపంచ కుబేరుల్లో ఇండియన్స్ కు స్థానమే దక్కడమే గగనగండమనే పరిస్థితుల్లో… ఉస్మాన్ అలీఖాన్ ఏకంగా ప్రపంచ నంబర్ వన్ ధనవంతుడిగా గుర్తింపు పొందడంతో.. ఆయన్ను ఎక్సాల్టెడ్ హైనెస్ అంటే ఉతృష్ఠమైన అవార్డుతో నాటి బ్రిటీష్ ప్రభుత్వంతో గౌరవించబడ్డ మొట్టమొదటి భారతీయ పాలకుడిగా కూడా ఆయన నిల్చిపోయాడు.

1948లో హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి ముందు వరకూ కూడా.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగాడు. 1911లో తన తండ్రి మరణించిన తర్వాత.. ఆయన సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్న ఉస్మాన్ అలీ… 1948 వరకు దాదాపు 37 సంవత్సరాలు హైదరాబాద్ను పరిపాలించారు. పలు నివేదికల ప్రకారం ఆయన ఆస్తులు పెరిగాయే తప్ప తరగలేదు. ఆయన హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని భారత యూనియన్ లో కలిపేవరకూ కూడా ఆయన ఆస్తుల నికర విలువ.. ఇవాళ్టి ఎలాన్ మస్క్ నికర విలువకు దగ్గరగా ఉండేది. అలా ఆయన రాచరిక సింహాసనం దిగేనాటికి 17 లక్షల 47 వేల కోట్ల రూపాయలు అంటే యూఎస్ డాలర్స్ లో 230 బిలియన్ డాలర్స్ నికర ఆస్తులను కల్గి ఉన్నారు.
ఆయన సంపదలో అధికశాతం ఆభరణాలుండేవి. అలా వంద మిలియన్ డాలర్ల విలువ చేసే బంగారం, 400 మిలియన్ డాలర్ల విలువ చేసే ఇతర వెండి, ముత్యాలు, రత్నాల వంటి ఆభరాణాలుండేవి. ఎంతో విలువైన 185 క్యారెట్ల జాకబ్ డైమండ్ నిజాం దగ్గర మాత్రమే ఉండేది. ప్రస్తుతం దాని విలువ దాదాపు 1 వెయ్యి కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని ఓ అంచనా. 1995లో అప్పటి భారత ప్రభుత్వం నిజాం ట్రస్ట్ నుండి 1 కోటి 30 లక్షల రూపాయలకు ఓ వజ్రాన్ని కొనుగోలు చేయగా.. అదిప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంది. ఆయన ఇతర ఆస్తుల్లో రోల్స్ రాయిస్ కార్లను ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మిలియన్లకు వజ్రాన్ని కొనుగోలు చేసింది మరియు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఆయన ఇతర ఆస్తులలో రోల్స్ రాయిస్ కార్ల అద్భుతమైన సేకరణతో పాటు.. గోల్కొండ వజ్రపు గనుల కథ కనివినీ ఎరుగని రీతిలో ఉండేదంటారు.
ఇవాళంటే మేమంటే మేం హైదరాబాద్ ను అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకునేవారు.. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలోనూ ప్రాంతీయతలను రెచ్చగొట్టేవారు.. తమ రాజకీయాలకు అనువుగా మాటలతూటాలు పేల్చేవారు కనిపిస్తుండొచ్చునేమోగానీ.. అసలు హైదరాబాద్ అభివృద్ధి ప్రధాత నిజామేనంటే అతిశయోక్తేమాత్రం కాదు. ఒక హైకోర్టైనా, సెంట్రల్ లైబ్రరీ అయినా, అసెంబ్లీ హాలైనా, స్టేట్ మ్యూజియమైనా ఇవన్నీ నిజాం అభివృద్ధి చేసినవే. అంతెందుకు ఇవాళంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూసిన మన కళ్లు చెదిరిపోతున్నాయేమోగానీ.. ఆనాడే హైదరాబాద్ లో విమానశ్రయానికి రూపకల్పన చేసినవాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.
అయితే, నిజాం ఎంత ధనవంతుడో.. అంత పిసినారి అనే పేరునూ సంపాదించుకున్నారు. ఒక అనామకుడిలా కొత్త బట్టలు ధరించకపోవడం.. సుమారు 35 ఏళ్ల పాటు చిరిగిన పాగానే ధరించడం, నలిగిన కాటన్ ఫైజామాలనే తొడగడం, బెడ్రూమ్ లో చిరిగిన చెత్త కాగితాల నడుమే భోజనం చేసే అలవాట్లు, సాదాసీదా ప్లేట్లలో భోజనం చేసే విధానం ఇవన్నీ ఆయనెంత పిసినారో పట్టిచూపించేవంటారు. ఈ భూగ్రహం మీదే అత్యంత ధనవంతుడై ఉండీ.. అలాంటి జీవనాన్ని గడపిన విషయాల్ని ల్యూక్ హార్డింగ్ అనే బ్రిటీష్ జర్నలిస్ట్ 2001లో గార్డియన్ కు రాసిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన 80 ఏళ్ల వయస్సులో 1967లో కన్నుమూశారు.



