Vidyasagar polla… ✍🏻
మహిషాసుర దినోత్సవం!
నా పేరు సుష్మా అసుర్ ! నేను ఉత్తర పీఠ భూమి (జార్ఖండ్) లో నివసిస్తున్నాను. చదువు పేరుతో చాలా కష్టమైన భాష నేర్పించారు. ఇప్పటికి నేను ఇంటర్ దాటాను . అసుర సంతతి రాక్షస సమాజమని నా పాఠ్య పుస్తకాల్లో చదివాను.నిజానికి మేము ఎవరినీ దోచుకోలేదు. హత్యలు, దౌర్జన్యాలు చెయ్యలేదు. కానీ, మా నుండి అన్నీ లాక్కున్నారు. టాటా మా ఆవిష్కరణలను లాక్కున్నాడు. బిర్లా మా భూమిని లాక్కున్నాడు. మీ దేవుళ్ళు మా రాజ్యాన్ని, చరిత్రను లాక్కున్నారు.నేనిపుడు నా అసుర చరిత్రను యదార్ధంగా రాసే పనిలో ఉన్నాను. నవరాత్రుల పేరుతో మహిషాసురుడిని చంపటం గురించి మీ అందరికీ తెలుసు. కానీ చాలా మందికి అసురుడి” అసుర”సమాజం గురించి తెలీదు. అడవుల్లో ఉండే ఈ అసుర సమాజం ఇప్పటికీ బతికే ఉందని మీరంతా గుర్తుంచుకోవాలి. ఇనుమును కరిగించే సాంప్రదాయ వృత్తిని వదిలేసి, వ్యవసాయం పై జీవిస్తున్నాము . పరిశోధకులు, సాహిత్యకారులు మాపై దృష్టి పెట్టాక చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసురుల చరిత్ర, కళలు వెలుగుచూశాయి.

ఒక సర్వే ప్రకారం అసుర జనాభా ఎనిమిది వేలు మాత్రమే!
భైంసాసురుడిగా ప్రసిద్ధి చెందిన మహిషాసురుడు ప్రజాదరణ పొందిన శక్తివంతమైన రాజు అని, అసుర పాటలు, ఇతిహాసాలు, ఆచారాలు చెపుతున్నాయి. అతన్ని ఓడించటం దేవతల వల్ల కాలేదు. ఒక స్త్రీని పావుగా వాడుకుని నిస్సిగ్గుగా అతన్ని చంపారు. బ్రాహ్మణులు అసురుల చరిత్రను తారుమారు చేశారు. కుట్ర చేసి అబద్ధాలని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా ప్రచారం చేశారు. మా అసుర్ సమాజంలో దీపావళి రోజున భైంసాసురుని పూజిస్తాము.” హిందువులు నవరాత్రి వేడుకలు జరుపుతున్నప్పుడు, అసుర సమాజం మహిషాసురుడి మరణాన్ని తల్చుకుని దుఃఖిస్తుంది “అని మా నాన్న ఖహ్మిలా అసుర్ చెప్పారు.
ప్రధాన స్రవంతిగా పిలవబడే హిందూ సంస్కృతి బాణసంచాల శబ్దంలో మునిగిపోయిన రోజున, మా ఇళ్లలో వేరే ఆచారం నిర్వహిస్తాము. నా మామ చామరా అసుర్ కు భైంసాసురుని ఆరాధన గురించి వివరణాత్మక జ్ఞానం ఉంది. ఆయన గ్రామ పూజారిగా కూడా పనిచేశాడు. దీపావళిగా చెప్పుకునే అమావాస్య రోజు ఉదయం మూగ జీవాలకు స్నానం చేయించి, ఔషధ గుణాలు కలిగిన ఏరిండి చెట్టు ఆకుల్ని అలంకరిస్తాము . రాత్రి పూట, నూనె గుణం కలిగిన కుజారి, కరంజ్ పండ్ల నుండి నూనె తీసి మట్టి దీపంలో పోస్తాము . అందులో మినపప్పును కూడా వేస్తాము. అసుర్ పురుషులు ఈ నూనెని నాభి, ఛాతీ, చెవులకు పూసుకుంటారు. ఈ రోజు పశువులకు కూడా ప్రత్యేకమైన రోజు. వాటి కొమ్ములకు కూడా నూనె పూయటం ఆచారం. నియంత్రణలో లేని పశువులపై నూనె చల్లటం శుభంగా భావిస్తాము. ఈ సందర్భంగా అసుర మంత్రాన్ని పాటిస్తాము .”పూర్ఖా కేచ చబా గోసేయ జామా శక్తి తారా ఆలే కే బంచవ్ లేమా హేత్రా జీవిడ్ చెల్మే దేవ్ “అంటే”ఈ ఔషధం మనల్ని, మన పూర్వీకుల్ని నాశనం చేసే అన్ని శక్తుల నుండి రక్షించాలి “అని అర్థం.
అసురులు తినే హాడియాను మహిళలే తయారు చేస్తారు. పిల్లలకు ఔషధ గుణాల వేర్లు, దుంపలు ఇస్తారు. మధ్యాన్నం పూజలో పాల్గొనే పెద్దలు కోడిని బలి ఇస్తారు. పెద్దలు, పిల్లలకు ఆ కోడి రక్తంతో బోట్లు పెడతారు. పశువులకు ధాన్యం, హాదియా పెడతారు. అవి తినగా మిగిలిన వాటిని అసురులే సంతోషంగా తింటారు. ఇది మూగ జీవాల పట్ల వాళ్ళకున్న ప్రేమను తెలియజేస్తుంది.
భారతీయులకు ఎక్కడ ప్రాణహాని జరిగినా మీరంతా తల్లడిల్లి పోతారు. కానీ మా మరణాలు మిమ్మల్ని కదిలించవు. మా జాతి అంతరిస్తున్నా మీరు చలించరు!
మా బతుకంతా పాట్నా, రాంచీ రాయ్ పూర్, రూర్కెలా, బన్స్వారాలలోనే మగ్గిపోతుంది. మా బాధలు ఎవరికీ పట్టవు.
మీ ప్రసిద్ధ పురాణాలు, కథలు, గ్రంథాల్లో వేలసార్లు చంపబడి, అవమానించబడిన రాక్షసుడి కుమార్తెను నేను.
ఏదేమైనా, హత్యల్ని పండుగలా జరుపుకోవటం నాగరిక సంస్కృతి అనిపించుకోదు. నవరాత్రులు, దుర్గా పండుగలు జాతి వివక్షతకు ప్రతీకలు. ఇది జాతికి అవమానం. ఇది అసుర కుమార్తె విన్నపం!
ఇట్లు
సుష్మా అసుర్
జార్జ్ ఎక్కా వాల్ నుండి.



