ఆపరేషన్ సిందూర్ పై భిన్నాభిప్రాయాలను మనం చూశాం. విన్నాం. యుద్ధం మిగల్చబోయేదేంటనే శాంతి కాముకులనూ చూశాం. అంతదాకా వచ్చాక ఇక వెనుకడుగు వేసే ప్రసక్తే లేదనే తెగింపునూ చూశాం. అలాగే, ఉన్నపళంగా ట్రంప్ ప్రకటన తర్వాత యుద్ధాన్ని ఆపేయడం పట్ల అప్పటివరకు వ్యతిరేకించినవారు హేళన చేయడమూ చూశాం. యుద్ధమే అల్టిమేట్ కాదు.. పాక్ తో పాటు, ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో చూపాం అనేవాళ్లనూ చూశాం. ఏదేమైనా.. శత్రువు మనమీద దాడికి తెగబడ్డప్పుడు మెజారిటీ సమాజం మాత్రం ఏకతాటిపైకి వచ్చింది. రావడమే కాదు.. సరిహద్దు గ్రామాల్లో మన ఆర్మీకి వారివంతు తోడ్పాటునందించింది. అందులో ఇప్పుడో బుల్లోడి కథ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పిల్లోడేం చేశాడు..?

భారత్ – పాక్ మధ్య యుద్ధమంటే సాధారణంగా పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కశ్మీర్ వంటి సరిహద్దు ప్రాంతాలన్నీ అప్రమత్తం కావల్సిన అవసరముంటుంది. పెహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ ఉగ్రస్థావరాలపై చేసిన దాడుల్లో భాగంగా ఈ రాష్ట్రాల్లోని ఆయా సరిహద్దు గ్రామాలన్నింటినీ అప్రమత్తం చేశారు. ఆ క్రమంలో పంజాబ్ లో ఓ పదేళ్ల బాలుడు మన ఆర్మీని తెగ ఆకట్టుకున్నాడు. నేను సైతం అంటూ పాక్ దళాలతో యుద్ధం చేస్తున్నవారికి ఆ పదేళ్ల బుడ్డోడు సైనికులు మాటల్లో చెప్పలేనంత సాయం చేశాడు.
అతగాడి పేరేంటి.. ఊరేంటి..?
పేరు.. శ్రావణ్ సింగ్. ఊరు.. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని తారావాలీ గ్రామం. పదేళ్ల శ్రావణ్ సింగ్ జస్ట్ నాల్గో తరగతి చదువుతున్నాడు. తన తారావాలీ గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అక్కడ మన సైనికులు శత్రువులను అటాక్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అదిగో అక్కడే శ్రావణ్ సింగ్ నేను సైతమంటూ యుద్ధరంగంలోకి దూకాడు. అంటే ఏదో తుపాకులు, మిస్సైల్స్ పట్టుకుని కాదు.. కానీ, అవి పట్టుకుని శత్రువుల వైపు దూసుకెళ్తున్న మన సైనికులకు సాయమందించడానికి. అలా టీ, కాఫీ, వాటర్, ఎండాకాలం కావడంతో లస్సీ వంటివెన్నో తీసుకొచ్చి ఇస్తూ సైనికులకు సపర్యలు చేశాడు.
దాంతో ఇండియన్ ఆర్మీ శ్రావణ్ సింగ్ ను ఘనంగా సన్మానించింది. 7వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్ శ్రావణ్ సింగ్ ను సత్కరించాడు. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. పెద్దయ్యాక తానూ సైనికుణ్ని కావాలని శ్రావణ్ సింగ్ చెప్పడం ఆర్మీ అధికారులను కూడా ఆశ్చర్యపర్చింది. నేను పెద్దయ్యాక ఫౌజీ అవుతానంటూ ఆ బుడతడు చెప్పిన మాటలు అంతవరకూ అలుపెరుగని పోరాటం చేసిన సైనికుల్లో ఒక స్ఫూర్తి నింపేగాధ.
శ్రావణ్ సింగ్ సాయాన్నిభారత ఆర్మీ మాజీ అధికారైన మేజర్ మదన్ కుమార్ Xలో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తన ఇంట్లోంచి పాలు, నీరు, టీ, కాఫీలు, లస్సీ వంటివి తీసుకొచ్చి అమృత్ సర్ సరిహద్దుల్లో సైన్యానికి సాయం చేసిన శ్రావణ్ సింగ్ ను ఇండియన్ ఆర్మీ సత్కరించడాన్ని పోస్ట్ చేయగా.. నెటిజన్స్ నుంచి శ్రావణ్ సింగ్ కు పెద్దఎత్తున అప్లాజ్ లభించాయి.
శ్రావణ్ తల్లిదండ్రులు తన బిడ్డను చూసి గర్వపడుతున్నట్టు చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ తో భారత సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయినా, అక్కడి పౌరసమాజం ఆర్మీకి అండగా నిల్చింది. అందులో శ్రావణ్ సింగ్ వంటివారెందరో ఉండగా.. పదేళ్ల బుడ్డోడిలో కనిపించిన రేషం, దేశం కోసం సైనికులు పడుతున్న తపన పట్ల తన కన్సర్న్ వారికి సాయమందించేందుకు స్ఫూర్తి రగిలించింది. ఆ స్ఫూర్తి కనబర్చిన పదేళ్ల శ్రావణ్ సింగ్ ను సన్మానించి ఆ స్ఫూర్తి ఇంకెందరికో ప్రేరణ అయ్యేలా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ మాజీ అధికారులతో పాటు, ప్రస్తుత అధికారగణం కూడా శ్రావణ్ సింగ్ స్టోరీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు శ్రావణ్ సింగ్ ఓ ట్రెండింగ్ బ్రేవ్ బాయ్ గా వార్తల్లోకెక్కాడు.



