ఒకనాడు ఫ్రెంచ్ పాలకుల చేతుల్లో ఉన్న పాండిచ్చేరీ.. పుదుచ్చేరీగా ఎలా మారింది… దాన్ని ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు..? పాండిచ్చేరీ వ్యవస్థాపక దినోత్సవమైన ఈ జూలై 1న ఒకసారి ఆ కేంద్రపాలిత ప్రాంతం గురించి కాస్త చెప్పుకుందాం.

1963లో పుదుచ్చేరీని కేంద్రపాలిత ప్రాంతంగా అధికారికంగా ప్రకటించారు. జూలై 1 నాడు ఆ ఏర్పాటు జరిగింది కాబట్టే.. ప్రతీ ఏడు జూలై 1 పుదుచ్చేరీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంటారు.
సుమారు 300 ఏళ్ల పాటు ఫ్రెంచ్ పాలకుల చేతుల్లో ఉండేది పుదుచ్చేరీ తీర ప్రాంతం. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా పాండిచ్చేరీ, కారైకల్, మాహే, యానాం వంటి మరికొన్ని తీరప్రాంతాలు ఫ్రెంచ్ పాలకుల నియంత్రణలోనే ఉన్నాయి.
1954లో అధికార బదిలీతో పాండిచ్చేరీ పాలనా పగ్గాలు భారత్ చేతికి అందివచ్చాయి. 1962, ఆగస్ట్ 16వ తేదీన ఫ్రెంచ్ పార్లమెంట్ ఒప్పందాన్ని ఆమోదించడంతో పాండిచ్చేరీ అధికారికంగా భారత్ లో విలీనమైంది. 1963, జూలై 1న పాండిచ్చేరీని సొంత శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.
పాండిచ్చేరీ నైసర్గిక స్వరూపం ప్రత్యేకమైంది. పాండిచ్చేరీ, కారైకల్ ఇవి రెండూ కూడా భౌగోళికంగా తమిళనాడు తీరంలో ఉంటే.. యానాం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఉంది. ఇక మాహే కేరళ తీరప్రాంతంలో ఉంది. అయినప్పటికీ ఇవన్నీ పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంత పరిధిలోనే ఏకీకృత పరిపాలన కిందనే పర్యవేక్షించబడుతున్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో మనకు భారతీయతతో పాటు, నాటి ఫ్రెంచ్ పాలనా కాలం నాటి ఆనవాళ్లతో ఒక వైవిధ్యమైన వాతావరణం కనిపిస్తుంటుంది.
అసలు పాండిచ్చేరీ పుదుచ్చేరీగా ఎలా మారింది…?
పాండిచ్చేరీ అనే తమిళనాడు టెర్రిటరీలో ఉండటంతో… పుదు అంటే కొత్త అని… చెరి అంటే గ్రామమనే అర్థంతో పుదుచ్చేరీగా నామకరణం చేశారు. ఈ ప్రక్రియ 2006లో అధికారికంగా మార్పు జరిగింది.
1600ల చివరలో ఫ్రెంచ్ పాలకులు ఈ ప్రాంతాన్ని వలసరాజ్యంగా చేసుకున్నప్పుడు.. వారు పుదుచ్చేరీని పాండిచ్చేరిగా మార్చారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లు కూడా పాండిచ్చేరిగానే పిలవడంతో నేటి పుదుచ్చేరీ కాస్తా చాలాకాలం పాండిచ్చేరీగానే పిలువబడింది.
కానీ, స్వాతంత్ర్యం తర్వాత మళ్లీ భారత ప్రభుత్వం, స్థానిక నాయకత్వం.. ప్రాంతీయ గుర్తింపును కోరుకుంది. దాన్ని ప్రతిబింబించేలా మళ్లీ పాండిచ్చేరీ కాస్తా దాని సంప్రదాయ నామమైన పుదుచ్చేరీగా మారింది.
2006, అక్టోబర్ లో భారత పార్లమెంట్ పాండిచ్చేరీని అధికారికంగా పుదుచ్చేరీగా మారుస్తూ బిల్లును ఆమోదించింది.
పలస పాలకుల ఆలోచనలకు చరమగీతం పాడుతూ స్థానిక సాంస్కృతిక గుర్తింపును తిరిగి పొందుపర్చే క్రమంలో ఈ పేరు మార్పును ఓ ముందడుగుగా చెప్పుకుంటుంటారు.
అయితే, పుదుచ్చేరీలో ఇప్పటికీ తమిళం, మళయాళం, తెలుగు వంటి భాషలతో పాటు, ఫ్రెంచ్ భాషను అధికారిక భాషగా గుర్తిస్తారు. గతంలో ఉన్న పాండిచ్చేరీ సైన్ బోర్డ్స్ తమిళంతో పాటు, ఫ్రెంచ్ లోనూ కనిపిస్తాయి. ప్రతీ రోజూ వేలాది మంది తత్వజ్ఞానం కోసం వచ్చే అన్వేషకులతో, యాత్రీకులతో ఇక్కడి శ్రీ అరబిందో ఆశ్రమం ఆకర్షిస్తుంటుంది. ఇక్కడి ఫ్రెంచ్ క్వార్టర్స్ లోని వాస్తుశిల్పం వలస రాజ్యాల ప్రతిభతో ఆకట్టుకుంటుంది.
పుదుచ్చేరీని వరల్డ్ హెరిటేజ్ సిటీగా యునెనస్కో గుర్తించింది. అందుకే, ఇక్కడ పుదుచ్చేరీ పట్టణం మధ్యలో నూతనంగా నిర్మించిన బిల్డింగ్స్ కనిపించవు. కేవలం హెరిటేజ్ బిల్డింగ్స్ తో ఆధునిక ప్రపంచానికి భిన్నంగా అలరిస్తుంది పుదుచ్చేరీ. స్వతంత్ర భారతంలో చివరి వలస రాజ్యంగా పుదుచ్చేరీ పేరుంటుంది.
అన్నికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే.. ఇది భారతదేశంలో అత్యధిక అక్షరాస్యతా రేటును కల్గిన కేంద్రపాలిత ప్రాంతం కావడం మరో విశేషం. ఇక్కడ 85 శాతం కంటే ఎక్కువ జనాభా అక్షరాస్యులు. ఫ్రెంచ్ మూలాలతో ఆకట్టుకునే సిటీ పుదుచ్చేరీ. యూరోపియన్ శిల్పకళా వైభవంతో, ప్రశాంతమైన బీచులకు ఆలవాలంగా.. సినిమా షూటింగ్స్ కు నెలవుగా పుదుచ్చేరీ విశాలమైన తీరప్రాంతంతో ఒక్కసారైనా వెళ్లి చూసి రావల్సిన ఓ హాలిడే స్పాట్.



