భూమ్మీద చిట్టచివరి ప్రాంతంలో భారత జెండా పాతిన మహిళాద్వయం!
ఇద్దరు భారత నేవీ మహిళా అధికారులు అద్భుతమైన ఫీట్ సాధించారు. భూమిపైనే చిట్టచివరి ప్రాంతమైన మిస్టీరియస్ .. పాయింట్ నెమోను చుట్టిరావడమే వారు సాధించిన ఘనత. సముద్రంలో చివరి సరిహద్దు వరకు వెళ్లడమే తప్ప.. ఆ సరిహద్దు ఆవలికి వెళ్లి ఆ అంచుల్లోని మారుమూల ప్రాంతాలను చుట్టిరావడం పూర్తిగా సాహసోపేతమైన, ఓపికతో కూడిన చర్య. అలాంటి పూర్తిగా జనజీవనం కనిపించని, అంతరిక్ష శిథిలాలను మళ్లించే ఒక ఆఖరి ప్రదేశమే పాయింట్ నెమో. ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెసెల్ (INSV)తరిణిలో ఇద్దరు మహిళా అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టివచ్చి ఇప్పుడు ఈ కొత్త రికార్డ్ నెలకొల్పారు.

నావికా సాగర్ పరిక్రమ 2 ప్రాజెక్ట్ లో భాగంగా.. INSV తరిణి ప్రపంచంలోనే ఐసోలేటెడ్ గా ఉన్న పాయింట్ నెమో ప్రయాణాన్ని చేపట్టింది. లెఫ్టినెంట్ కమాండర్స్ కే. దిల్నా, ఏ. రూప పాయింట్ నెమోను దాటి ఈ ఘనత సాధించారు. ఇది అత్యంత సాహసోపేతమైన జర్నీగా భారత నావికాదళం ఇప్పుడీ మహిళా అధికారుల్ని కొనియాడుతోంది.
ఐఎన్ఎస్వీ తరిణిలో ఈ ప్రయాణాన్ని గోవా నుంచి అక్టోబర్ 2, 2024న ప్రారంభించిన ఈ ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్స్… డిసెంబర్ 22వరకు న్యూజిలాండ్ లోని లిట్టెల్టన్ పోర్టు వరకూ చేరుకున్నారు. తర్వాత దశలో లిట్టెల్టన్ నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫాక్లాండ్ దీవుల్లోని పోర్ట్ స్టాన్లీకి వారి ప్రయాణం ప్రారంభమైంది. ఇది 5 వేల 600 నాటికల్ మైల్స్ దూరంలో ఉండే అత్యంత పొడవైన ప్రయాణం.
పాయింట్ నెమో.. ఈ భూప్రపంచం నుంచే ఎలాంటి సంబంధం లేని ఓ ఒంటరి రహస్య ప్రాంతం!
పాయింట్ నెమో అంటే భూమి నుంచి అత్యంత సుదూర ప్రాంతంలో విసిరివేయబడ్డట్టుండే ఓ ఒంటరి ప్రాంతం. లాటిన్ భాషలో నెమో అంటే నో వన్ అని అర్థం. అంటే ఏ ఒక్కరు కూడా కనిపించని ఓ మిస్టీరియస్ ప్రదేశం. పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఈ ప్రాంతానికి చేరుకోవడమంటే అత్యంత ధైర్య, సాహసాలతో కూడిన ఓ అడ్వెంచర్. సమీప భూప్రాంతం నుంచి ఏకంగా 16 వందల మైళ్ల దూరంలో.. అంటే 2688 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చిట్టచివరి ప్రాంతం. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు అత్యంత సమీపంగా కనిపించే… న్యూజిలాండ్, అంటార్కిటికా మధ్య ఈ పాయింట్ నెమో దీవి ఉంది. దెబ్బతిన్న స్పేస్ క్రాఫ్ట్స్ ను వదిలేసే ఓ శ్మశానవాటికలా కూడా ఈ పాయింట్ నెమోను పిలుస్తుంటారు.
ఓషియానిక్ పోల్ ఆఫ్ ఇన్ యాక్సెసిబిలిటీ.. అంటే ఏ విధంగానూ చేరుకోలేని ఈ సముద్ర ధృవాన్ని 1992లో వోజ్ లూకేటెలా అనే కెనడియన్-రష్యన్ ఇంజనీర్ గుర్తించాడు. అప్పటి నుంచి స్కైలాబ్ తో సహా.. రష్యా అంతరిక్ష కేంద్రంతో పాటు, నాసా వంటి ప్రయోగకేంద్రాల నుంచి 260 అంతరిక్ష శిథిలాలను జనసాంద్రత ఉన్న ప్రాంతాలపై పడకుండా.. ఈ పాయింట్ నెమో వైపు మళ్లించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన స్పేస్ సేఫ్టీ ఆఫీసర్ హోల్గర్ క్రాగ్ .. జనావాసాల్లేని మహాసముద్ర తీరమైన పాయింట్ నెమో అంతరిక్ష శిథిలాలను మళ్లించడానికి సురక్షిత ప్రదేశమంటారు. అలాంటి ప్రదేశాన్ని చుట్టివచ్చి మహిళా అధికారులు దిల్సా, రూప ఇప్పుడు వార్తల్లో వ్యక్తులయ్యారు.



