చరిత్రలో రాజులు, నవాబులు అనుభవించిన విలాసాలెన్నో. వాటికి సంబంధించిన అద్భుతమైన, సొగసుల కథలూ ఇంకెన్నో. బంగారంతో అలంకరించిన రాజభవనాలు, వజ్రాలతో మెరిసే సింహాసనాలు, రాజసంతో కూడిన జీవనశైలి… ఇలా ఇవన్నీ మనం తరచూ విన్నవే. కానీ ఈ కథలన్నిటికంటే ప్రత్యేకంగా నిలిచిపోయిన కథ… రాంపూర్ నవాబ్ హమీద్ అలీ ఖాన్ది. విలాసవంతమైన జీవనానికే కొత్త నిర్వచనం చెప్పిన రాజతను.

19వ శతాబ్దం ఆరంభ కాలంలో రైలు కేవలం ఓ ప్రయాణ సాధనం మాత్రమే. పట్టణాలు, నగరాలను కలిపే ఓ బొగ్గు యంత్రం. కానీ, నవాబ్ హమీద్ అలీకి మాత్రం రైలు అంతకంటే ఎక్కువే. ఆయన ప్రతిష్ఠకు, రాజసానికి ప్రతీక. ప్రజలు రైల్వే ఫ్లాట్ ఫామ్స్ పై రైళ్ల కోసం ఎదురుచూస్తుంటే.. నవాబ్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉండేవట. తనెప్పుడైనా రైలులో ప్రయాణించాలనుకుంటే రైలు కోసం తాను ఎదురుచూడటమంటే నవాబుకు నచ్చేది కాదట. అందుకే, ఆ రైలే తన మహల్ గేట్ల దగ్గరకు వచ్చే ఏర్పాట్లు చేసుకున్నాడు హమీద్ అలీ. తన ఇంట్లోకే రైలు వచ్చేలా ఓ స్టేషన్ నే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసం ఆ కాలంలోనే 113 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు.
1925 బ్రిటీష్ రాజ్ కాలంలో దేశంలోని చాలామంది జనం థర్డ్ క్లాస్ బోగీల్లో ప్రయాణించేవారు. నవాబ్ హమీద్ అలీ మాత్రం బరోడా స్టేట్ రైల్ బిల్డర్స్ ను సంప్రదించి.. తనకోసం ఓ రైలునే తయారు చేయించుకున్నాడు. అంతేకాదు, తన ఇంటిదగ్గరే ఓ రైల్వే స్టేషనూ నిర్మించుకున్నాడు. అలా పుట్టిందే ది సెలూన్. ది సెలూన్ అని నామకరణం చేసిన రైలు నాల్గు బోగీలతో ఉండేది. అయితే ప్రతీ బోగీ కూడా ఓ కళాఖండంలా తీర్చిదిద్దారప్పుడు. మందమైన పర్షియన్ కార్పెట్లతో… రైలు కిందభాగమంతా అలంకరించగా.. రైలు పైకప్పుకు షాండ్లియర్స్ వేలాడుతూ ఒక రాజసౌధాన్ని తలపించేలా డిజైన్ చేశారట. చెక్కతో చెక్కిన ఫర్నీచర్ తో పాటు.. గదుల అలంకరణ ప్రత్యేకంగా చేపట్టారు. బంగారు పట్టు తెరలు గాలిలో మృదువుగా తేలుతుండేలా.. రాంపూర్ నవాబ్ హమీద్ అలీ రాజవైభవం నలుమూలలా ఎటు చూసినా మెరిసేలా చలన మార్గంలో ఉన్న రాజభవనంగా మార్చేశారట.
ఆరంభంలో అది కేవలం సౌకర్యం కోసమే అనుకున్నప్పటికీ… ఆ నవాబ్ హమీద్ అలీ వాడే రైలు ఒక గౌరవప్రతీకలా మారిపోయింది. రాజమహల్ లో ఉన్నప్పుడు నవాబ్ ఏ సౌకర్యాలు కల్గి ఉండేవారో.. అంతే సౌకర్యవంతమైన రాజసం రైలులో ఏర్పాటు చేసుకున్నాడతను.
ది సెలూన్ రాయల్ ట్రైన్ లో అన్నీ ఉండేవట.. ఓ పడకగది, ఓ భోజనశాల, ఓ వంటగది, ఓ ఎంటర్టైన్మెంట్ రూమ్.. వాట్ నాట్ అన్నట్టుగా అన్నీ రాజరిక సౌందర్యంతో అలంకరించబడటంతో ఆ రైలు నడుస్తున్న రాజమహల్ లా కనిపించేది. భద్రతా సిబ్బంది, సేవకుల కోసం ప్రత్యేక బోగీలు కూడా ఏర్పాటు చేయడంతో.. రాజుకు అవసరమైన సౌకర్యాలు, రాజసంతో పాటు.. ఆయనకు ఏ అవసరం పడ్డా రాజమహల్ లాగానే కో అంటే కోటి అన్నట్టుగా ఉరికివచ్చేవారు.
రాంపూర్ నవాబ్ రైలు వస్తుందంటే చాలు నాడు ఒక క్యూరియాసిటీ కనిపించేదంటారు. ఏ ఊరుకెళ్లినా అక్కడి ఊళ్లో జనాలు స్టేషన్ లో గుమ్మిగూడి ఆశ్చర్యంతో చూసేవారట. బంగారు బోగీలతో కదులుతున్న రాజమహల్ తమ ఊరికి వచ్చిన్పుడు చూసి తరించి నిశ్ఛేష్ఠులయ్యేవారట. అలా సెలూన్ వస్తోందంటే ఆ రైలు కూత కేవలం సిగ్నల్ మాత్రమే కాదు.. నవాబు ప్రెజెన్స్ ను ప్రకటించేది. అలా ది సెలూన్ అనే సొంత రైలుతోనూ, ఇంటికే రైల్వేస్టేషన్ రప్పించుకోవడంతోనూ.. రాంపూర్ నవాబ్ హమీద్ అలీ అప్పటి నవాబుల్లోనే అందరికంటే ప్రత్యేకంగా నిల్చారు.



