సృష్టిలో ప్రతీ ప్రాణీ వైవిధ్యమైందే. కానీ, కొన్ని ప్రాణులకున్న విలువ, గుర్తింపు.. మిగిలిన ప్రాణుల పట్ల కనిపించవు. అలా చాలా జంతు జాతులు పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్స్ మూలాన అంతరించిపోతున్న ప్రమాదం ఇప్పటికే మనకు కనిపిస్తోంది. దాంతో జీవవైవిధ్యం లోపిస్తోంది. అందుకే, ఆయన తోడేళ్ల గురించి ఆలోచించాడు. వాటికే ఏకంగా అభయారణ్యాన్ని సృష్టించాడు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ఏస్పీ షాహీ కథ ఇది. ఒక ఐఎఫ్ఎస్ అధికారిగా జస్ట్ పర్యవేక్షిస్తే చాలు మంచి జీతంతో హాయిగా బతుకొచ్చు. కానీ, ఎందుకో షాహీకి చాలామందిలా పులులపైనో, పక్షులపైనో, జింకలపైనో పడకుండా.. తన దృష్టి అంతరించిపోతున్న తోడేళ్ల జాతిపై పడింది. అదిగో అప్పట్నుంచీ చాలా గట్టిగా ఓ గవర్నమెంట్ సర్వెంట్ గా ఉండి కూడా తోడేళ్ల అభయారణాన్ని స్థాపించేందుకు ఒక ఉద్యమపంథాలో పోరాడాడు.

ఇప్పుడు షాహీ చొరవ వల్ల ఏర్పడ్డ తోడేళ్ల పార్క్.. మొత్తం భారతదేశంలో మొట్టమొదటి అభయారణ్యం. 1976లో జార్ఖండ్ లతేహార్ జిల్లాలో ఈ మహువాదన్ అనే పంచాయితీ పరిధిలో ఈ తోడేళ్ల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడిక్కడ ఏకంగా 32 వేలకు పైగా తోడేళ్లున్నాయి.
1942లో బ్రూరోక్రసీలోకి వచ్చిన ఐఎఫ్ఎస్ అధికారి షాహీ మొదట బీహారో అటవీశాఖలో పనిచేశాడు. 1960లో 43 ఏళ్ల చిన్న వయస్సులోనే దేశంలోనే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారిగా పగ్గాలు చేపట్టిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 1976లో పదవీ విరమణ చేశాడు.
మహువాదన్ అభయారణ్యం సాకారం కావడానికి చాలా ఏళ్లే పట్టింది. అందుకోసం ఒక జిల్లా ఫారెస్ ఆఫీసర్ నుంచి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా ఎదిగేవరకూ కూడా షాహీ ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన పోరాటాన్ని కొనసాగించాడు. మొత్తంగా చివరకు పట్టువదలని విక్రమార్కుడై 63. 25 చదరపు కిలోమీటర్ల మేర అటవీప్రాంతాన్ని తోడేళ్ల అభయారణ్యంగా తీర్చిదిద్దిన ఘనత ఐఎఫ్ఎస్ అధికారి షాహీది.
తోడేళ్ల సంరక్షణపై ఎందుకు షాహీకి అంత మక్కువేర్పడిందోగానీ… ఆయన అధికారిగా ఉన్న కాలంలో అభయారణ్యం కోసం ఒత్తిడి తీసుకురావడంతో పాటు.. ఆయన పదవీ విరమణ తర్వాత కూడా ఆ అభయారణ్య అభివృద్ధికి కృషి చేశాడు. మొత్తంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తోడేళ్ల వంటి జాతులనూ కాపాడాలనే ఆయన తపన మిగిలిన కన్జర్వేటర్స్ తో పోలిస్తే ఎంతో భిన్నమైంది. షాహీ 1986లో కన్నుమూశారు.
ఈ మహువాదన్ అభయారణ్యం పలమౌ టైగర్ రిజర్వ్ సర్కిల్ పరిధిలో ఉంది. మేదినీనగర్ అటవీశాఖ పాలనలో ఉండే ఈ తోడేళ్ల అభయారణ్యాన్ని 1976 జూన్ 23వ తేదీన గెజిట్ ద్వారా ప్రకటించారు.
ఈ అభయారణ్యంలో జంతువుల గణన కూడా చేపట్టారు. ఇక్కడి 78 గుహల్లాంటి ప్రదేశాల్లో తోడేళ్లు పెరుగుతున్నట్టుగా గుర్తించారు. అలాగే 27 రకాల క్షీరదాలు, 19 జాతుల పక్షులు, 18 రకాల సరీసృపాలు, 8 జాతుల ఉభయచరాలతో పాటు, మరో 30 రకాల సీతాకోకచిలుకలతో జార్ఖండ్ రాష్ట్రంలో ఒకే ఒక్క తోడేళ్ల అభయారణ్యానికి షాహీ వేసిన పునాది.. ఇక్కడి పచ్చని ప్రకృతికీ, జీవవైవిధ్యానికీ కేరాఫ్ గా మారింది.



