వైద్యో నారాయణో హరి! ఆ దంపతులిద్దర్నీ అనుకోవాల్సిందే మరి!!

గుడి అవసరంలేని దేవుళ్ళు !

వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం!

వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి!

……………………………………………………………………………………………………………..

Ganesh Thota… ✍🏻

వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD , ఆమె MBBS. వ్యాసం చదవడం పూర్తీ అయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా వున్న వీళ్ళ జీవితాన్ని ఇపుడు చదవండి.

1985 లో మహారాష్ట్ర నాసిక్ రైల్వే విభాగంలో పనిచేస్తున్న శ్రీ బావూరావ్ కోళే చాలా సంతోషంగావున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు రవీంద్ర MBBS పూర్తీ చేసి ఇంటికొస్తున్నాడు. ఆయన వంశంలో మొదటి డాక్టరు కాబోతున్నాడు. కానీ ఆయనకు తెలియదు రవీంద్ర పూర్తిగా వేరే జీవితం ఎన్నుకున్నాడని. MBBS చివరిరోజుల్లో ఒక వ్యాసం, ఒక పుస్తకం రవీంద్రను మార్చేసాయి. వ్యాసం వ్రాసింది మహాత్మా గాంధీ. అందులో ఆయన ఇలా అన్నారు.. ” ఈ దేశపు పేద, దళిత కోటి ప్రజల హృదయాల నుండి స్రవించిన రక్తంతో పెంచబడి, విద్యాబుద్ధులు గడించి వారిగురించి తలవనైనా తలవని ప్రతి వ్యక్తీ దేశద్రోహియే ” అని మనకు వివేకానందుడు చెప్పలేదా ? ” వివేకానంద, గాంధీ, వినోబాభావేల జీవితాలు, ఆదర్శాలు , ఆశయాలు రవీంద్రను విపరీతంగా ఆకర్షించాయి, ప్రేరణను ఇచ్చాయి.

ఇంటికొచ్చాడు. తల్లితండ్రులతో ” నేను మారుమూల పల్లెల్లోని పేదలకు డాక్టరుగా సేవ చేసేందుకు వెళతానన్నాడు.’ తండ్రి ఆనందం ఆవిరి అయ్యింది. తల్లి సమాధానం మౌనం అయ్యింది. డా.రవీంద్ర, మహరాష్ట్రలో అత్యంత వెనుకబడిన మేల్ఘాట్ లోని బైరాఘర్ గ్రామాన్ని తన కార్యశాలగా ఎంచుకున్నాడు. అదే ఎందుకు.. ? దానికి కారణం MBBS సమయంలో ఆయన చదివిన ఒక పుస్తకం. దానీ పేరు Where There Is No Doctor. వ్రాసినది David Werner. ఆ పుస్తకం కవర్ పేజీ మీద ఒక రోగిని నలుగురు ఒక నులకమంచం మీద పెట్టుకొని తీసుకెళుతూ వుంటారు. ఆ ఫోటో పక్కన చిన్నగా Hospital 30 kms away అని రాసి వుంటుంది. ఆ దృశ్యం రవీంద్రను కదిలించింది. అలా వైద్య సౌకర్యాలు ఏవీ లేని ఒక నిరుపేదల గ్రామానికి వెళ్ళి వాళ్ళకు సహాయపడాలని ఆనాడే ఆయన సంకల్పించాడు. తరువాత తన ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి అలాంటి చోట ఎలా పనిచేయాలో చెప్పమన్నాడు.

అపుడు ప్రొ. జూజు అనే ఆయన అలాంటి చోట పనిచేయాలంటే నీకు 3 విషయాలు బాగా తెలిసివుండాలన్నాడు. అవేంటంటే..?

1) Sonography or Blood Transfusion లేకుండానే గర్భిణి స్త్రీలకు ప్రసవం చేయగలగడం..

2) X-ray లేకుండా న్యుమోనియాకు వైద్యం చేయడం..

3) డయేరియాకు వైద్యం చేయడం..

6 నెలలు ముంబాయిలో వుండి వాటిని నేర్చుకొన్నాడు రవీంద్ర. వెంటనే బైరాఘర్ కు వచ్చాడు. ఆ పల్లెకు బస్సులు లేవు. మహారాష్ట్రలోని అమరావతి నుండి 40 కిలోమీటర్లు నడచివెళ్ళాలి. అలాగే వచ్చాడు అతను. అక్కడే చిన్న గుడిసె వేసుకుని అక్కడి రోగులకు వైద్యం చేసేవాడు. ఆ పల్లె పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులతో నిండివుంది. ఒక్కడే అంతమందికి సేవ చేయడం కష్టమనిపించింది. తనకు ఒక తోడు వుంటే బాగుంటుందని భావించి దినపత్రికలో పెళ్ళి ప్రకటన ఇచ్చాడు. డాక్టరైన యువతి కావాలని. కానీ ఆయన 4 షరతులు పెట్టాడు. వాటికి ఒప్పుకున్న యువతినే తాను పెళ్ళిచేసుకొంటానని.

అవేంటంటే…?

1) 40 కిలోమీటర్లు నడవగలగాలి.

2) 5 రూపాయల పెళ్ళికి ఒప్పుకోవాలి. ( 1989లో రిజిస్టర్ పెళ్ళికి ఫీజిది.)

3) కేవలం 400 వందల రూపాయలతో నెల పొడుగునా జీవనం చేయగలగాలి. ఎందుకంటే డాక్టర్ రవీంద్ర నెలకు 400 మంది రోగులకు వైద్యం చేస్తాడు. ఒక రోగి నుండి కేవలం ఒక రూపాయి మాత్రమే తీసుకుంటాడు.

4) అవసరమైతే ప్రజలకోసం భిక్షమెత్తడానికైనా సిద్ధంగా వుండాలి.

పై షరతులన్నీ చూశాక… 100 సంబంధాలు వచ్చినా.. 99 మంది వెళ్ళిపోయారు. ఒక యువతి మాత్రం సరేనంది. ఆమె పేరు డాక్టర్ స్మిత (ఫోటో లో వున్న వ్యక్తి).

1991 లో డా. స్మిత ప్రసవ సమయంలో స్వయంగా తానే వైద్యం చేస్తాను అన్నాడు డా. రవీంద్ర. కానీ ఆమెకు తీవ్రమైన సమస్యలు వచ్చాయి. ఆ పల్లె ప్రజలు ఆమెను నగరం తీసుకెళ్ళండని కూడా చెప్పారు. ఆమెను అడిగితే ‘ మీ ఇష్టం ‘ అంది. ఒకవేళ నేను ఈమెను నగరం తీసుకెళితే, ఇక నేను తిరిగిరాను. మీకు లేని సౌకర్యాలు మేము అనుభవించడం మాకు ఇష్టం లేదని పల్లెప్రజలకు చెప్పాడు. డా. స్మిత కూడా మీరే నాకు వైద్యం చేయండి, నగరం వద్దంది. ఆయనే వైద్యం చేసాడు. ప్రసవం జరిగింది. అబ్బాయి జన్మించాడు. ఆ దంపతుల త్యాగం ఆ మట్టిమనుషుల మనసులను కదిలించింది. వాళ్ళ పాలిట ఆ యువ దంపతులు ఆది దంపతులయ్యారు.

నెమ్మదిగా ప్రజలు వీరిద్దరినీ నమ్మడం మొదలుపెట్టారు. ఏడాదిలో ఒక నాలుగు నెలలు మాత్రం పొలం పని ఉంటుంది. మిగిలిన సమయమంతా పని వుండదు. కాబట్టి ఆహారం కొరత, డబ్బు కొరత, దాని కారణంగా రకరకాల వ్యాధులు. ఆ పల్లె వాళ్ళకు ఒంటి మీద సరిగా గుడ్డలు కూడా వుండవు. అందుకే వాళ్ళకు న్యుమోనియా లాంటి జబ్బులు సర్వసాధారణంగా వస్తుండేవి. దంపతులిద్దరూ ఆలోచించి.. ఈ పరిస్థితి మారాలంటే వీళ్ళకు ఆర్థిక వనరులు ఏర్పడాలి. అంటే వీళ్ళకు అవసరమైన తిండిగింజలు వీళ్ళే పండించుకోవాలని భావించారు. అందుకోసమని డాక్టర్ రవీంద్ర నగరంలో వుంటున్న ఒక వ్యవసాయ సైంటిస్ట్ స్నేహితుడితో సలహాలు తీసుకుని.. విత్తనాల మీద అధ్యయనం చేసి తానే స్వయంగా క్రిమీ, కీటకాలను ఎదుర్కొనగలిగే కొత్త, ఆరోగ్యవంతమైన విత్తన రకాన్ని కనుగొన్నాడు. దాన్ని సాగుచేద్దామంటే ప్రజలకు నమ్మకంలేదు. అందుకే తన కొడుకును నీవు నగరంలో పై చదువులు వదులుకొని ఒక రైతు కాలేవా ? అని అడిగితే.. అలాగే, మీరెలా అంటే అలా అన్నాడు కొడుకు రోహిత్.

అపుడు ముగ్గురూ కలిసి తామే స్వయంగా ఒక చోట భూమి దున్ని తాము తయారుచేసుకొన్న విత్తనాలను నాటి, చక్కటి పంట తీసి పల్లెవాసులకు చూపించారు. అది వాళ్ళను విశేషంగా ఆకర్షించింది. అందరూ ఆ విత్తనాలను వాడటం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకొని , వాళ్ళను హెచ్చరిస్తూ పంట నష్టం కాకుండా చేస్తాడు డాక్టర్ రవీంద్ర. ఆ తరువాత పండిన పంటను ప్రజా పంపిణి వ్యవస్థ [ Public Distribution System] ద్వారా అందరి ఇళ్ళలో తిండి గింజలు నిలువ వుండేలాగా చేసారు. ఇపుడు తిండికి లోటుండదు. రెండుపూటలా తిండి కారణంగా.. ఆడవాళ్ళకు ఆరోగ్యం మెరుగయ్యింది. గతంలో పుట్టిన 1000 మంది పిల్లల్లో 200 మంది మరణిస్తుంటే ఇపుడు ఆ సంఖ్య 60 కి తగ్గింది. పల్లెలో వచ్చిన మార్పు వింటే మనం ఆశ్ఛర్యపోతాం. నగరం లో IIT చదివి ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసే యువతీ యువకులు ఏడాదికి సంపాదించే డబ్బుకు సమానంగా.. ఒక్కో రైతు సంపాదిస్తున్నాడు. 300 కుటుంబాలున్న ఆ పల్లె ఇపుడు చుట్టుపక్కల పల్లెలను కూడా పోషించే స్థాయికి ఎదిగింది.

ప్రపంచంతో సంబంధాల్లేకుండా వుండిన ఆ పల్లెలో వస్తున్న కొత్త ప్రపంచపు వెలుగులు చూసాక నాటి మహరాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆ పల్లెకు వచ్చాడు. ఆయన డా. రవీంద్ర, డా. స్మిత, వాళ్ళ కుమారుడు రోహిత్ చేస్తున్న పని చూసి చాలా సంతోషించి.. ‘ మీరున్న ఈ చిన్న గుడిసె మీకు తగిన స్థలం కాదు. నేను మీకు ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టిస్తానన్నాడు. అంటే అందుకు వాళ్ళు అన్న మాటేంటంటే.. మాకు ఇదే చాలు.. కానీ, ఈ పల్లె ఇతర ప్రదేశాలతో కలిసే విధంగాను, పల్లె లోపలానూ రోడ్లు వేయించండి చాలు అన్నారు. మంత్రి సరే అన్నాడు. ఇపుడు ఆ పల్లెకు చక్కటి రోడ్లున్నాయి. ఆ పల్లె ఆధారంగా నడిచే 6 పాఠశాలున్నాయి. 12 వైద్య కేంద్రాలున్నాయి. కానీ సర్జరీలు చేసే డాక్టర్ కావాల్సివచ్చింది. అపుడు డాక్టర్ రవీంద్ర.. తన రెండవ కొడుకు రాంను సర్జన్ అవ్వమని ప్రోత్సహించాడు. అతను అదీ పూర్తి చేసి ఇపుడు ఆ ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్నాడు.

కొందరు దేవుళ్ళకు గుడులు అవసరంలేదు.. పేదల గుండెలే గర్భగుళ్లు!

మన ఇళ్ళలో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఇటువంటి మనుషుల గురించి పిల్లలకు చెప్పం. చెప్పాలి. మామూలుగా కాదు.. హృదయానికి హత్తుకొనేలా చెప్పాలి. అప్పుడే తరాలను నడిపించే వ్యక్తులు తరగతి గదుల్లో తయారౌతారు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles