స్వాతంత్ర్య సమరయోధులంటే ఇప్పటికీ మనం వేళ్ల మీద లెక్కించుకునేవారినే తల్చుకుంటాం. వారి గురించే మాట్లాడుకుంటాం. ప్రసంగాల్లోనూ వారే ఉంటారు. జాతీయజెండా ముందు ఫోటోల్లోనూ వారే దర్శనమిస్తారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవం వస్తోందంటే చాలు వారి ఫోటోలతో ఉన్న బ్యాడ్జెస్ కు, ఫోటోఫ్రేమ్స్ కు గిరాకీ ఉంటుంది. కానీ, అలాంటి సమరయోధులెందరో. అందులో అన్ సగ్ హీరోసూ తల్చుకోవాల్సినవారింకెందరో. అందులో ఒకరు కేరళకు చెందిన పణిక్కర్. ఎవరాయన… ఏం చేశారు..?

2025, ఆగస్ట్ 15 సందర్భంగా.. విభజన సమయలో వేలాది మందిని కాపాడిన ఆ కేరళ సర్దార్ ను ఓసారి తల్చుకుందాం.
పుతిల్లతు పరమేశ్వరన్ నంబూద్రి, చలైల్ కుంజికుట్టి కుంజమ్మ దంపతులకు ట్రావెన్ కోర్ లో జన్మించిన బహుభాషావేత్త, రచయిత, చరిత్రకారుడు, దౌత్యవేత్త, జర్నలిస్ట్ కవళమ్ మాధవ పణిక్కర్. ముందు మద్రాస్ లో కొనసాగిన ఆయన విద్యాభ్యాసం ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి మారింది. 1925లో హిందుస్థాన్ టైమ్స్ కు సంపాదకుడిగా కూడా పనిచేశారు. అంతకుముందు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంతో పాటు.. కలకత్తా యూనివర్సిటీలోనూ బోధించిన ప్రొఫెసర్. మలబార్ అండ్ పోర్చుగీస్, మలబార్ అండ్ ది డచ్ వంటి పుస్తకాలు రచించారు. జవహర్ లాల్ నెహ్రూ, వీ.కే. కృష్ణమీనన్ వంటివారితో ప్రశంసలు పొందారు.
దేశసేవకుడు, సాహసోపేత రక్షకుడిగా పణిక్కర్ కు పేరు!
స్వాతంత్ర్యం తర్వాత విజయలక్ష్మీ పండిట్ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితికి భారతదేశం నుంచి వెళ్లిన మొదటి ప్రతినిధి బృందంలో ఒకడిగా చేరారు పణిక్కర్. 1952లో చైనాకు భారత మొట్టమొదటి రాయబారి. ఆ తర్వాత ఈజిప్ట్ రాయబారిగా పనిచేశారు. 1956లో, కేరళ సాహిత్య అకాడమికి మొట్టమొదటి అధ్యక్షుడయ్యారు.
1947లో జరిగిన భారత విభజన హింస, ఎక్కడలేని గందరగోళాన్ని సృష్టించిన సమయంలో పణిక్కర్.. బికనీర్ లోని ప్రిన్సెస్ ఛాంబర్ కు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పాకిస్థాన్ నుంచి శరణార్థులు ఓవైపు తరలివస్తున్నారు. అదే సమయంలో బికనీర్ లోని ముస్లిం జనాభా.. సమీపంలో సిక్కువర్గాల నుంచి జరుగుతున్న ప్రతీకారదాడులకు భయపడుతున్నారు. బికనీర్ సరిహద్దుల వద్దే ఆ హింసను ఆపకపోతే.. అది రాజస్థాన్ అంతా వ్యాపించే అవకాశముంటుందని గ్రహించిన పణిక్కర్.. మహారాజా సాధుల్ సింగ్ మద్దతుతో అల్లర్లను తగ్గించేందుకు అవసరమైతే కాల్పులు జరపాలని.. హింసకు ప్రేరేపించినవారిపై జరిమానాలు విధిచాలనీ ఆధేశించారు. అలా మహారాజా సాధుల్ కు సంబంధించిన రాచరిక సైన్యాన్ని హింతో పేట్రేగిపోతున్న గంగానగర్ కు పంపించాడు.
శరణార్థుల తరలింపుకు తోడ్పాటు!
కేంద్రం నుంచి తనిచ్చిన సమాచారానికి సమాధానం లభించకపోవడంతో.. పణిక్కర్ స్వయంగా తానే చర్యలకు సిద్ధమయ్యాడు. ముస్లిం శరణార్థులను రాష్ట్రమంతా సురక్షితంగా తీసుకెళ్లడానికి బందోబస్తుతో కూడిన కాన్వాయులను ఏర్పాటు చేశాడు. కొందరిని బికనీర్ నుంచి రైళ్లలోనూ, మరికొందరిని ప్రత్యేక రైళ్లు కేటాయింపజేసి, మరికొందరిని ఎడారి మీదిగా కాలినడకన ఇలా వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. అలా మొదటి బృందం పాకిస్థాన్ కు సురక్షితంగా చేరుకుంది. మొదటి విజయంతో రెండోసారీ వేలమందిని పాకిస్థాన్ కు తరలించాడు. కేవలం పోలీస్ ఎస్కార్ట్ తో 350 కిలోమీటర్ల ప్రయాణం చేయించి శరణార్థులెవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దేశ సరిహద్దుల దాటించిన మానవత్వం పణిక్కర్.
తెలియని చరిత్ర పణిక్కర్!
ఇండియా – పాక్ విభజన పణిక్కర్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. రెండువైపులా జరిగిన అమానవీయమైన క్రూరత్వమని.. నాగరిక సమాజంలో అనాగరిక చేష్టలంటూ అభివర్ణించారాయన. మైసూర్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్ లర్ గా పనిచేస్తూ.. 1963లో మరణించేవరకూ కూడా ఆయన భారతదేశానికి దౌత్యవేత్తగా సేవ చేస్తూనే ఉన్నారు. ఆయన ధైర్యసాహసాలు నాటి విభజన సమయంలో కనీసం వెయ్యి మంది ప్రాణాల్ని కాపాడాయి. కానీ, ఈయన చరిత్ర మాత్రం మనకెవ్వరికీ పెద్దగా తెలియదు. సాటి మనిషి పట్ల మానవత్వం ప్రదర్శించాలనుకునే ఇలాంటి చరిత్రకారుల చరిత్రలెన్నో ఇంకా సమాజానికి తెలియాల్సి ఉన్నా.. అవి అనుకున్న స్థాయిలో బయటకు రాకపోవడం విషాదం.



