ఏ మేరే వతన్ కే లోగో స్వరాన్ని విన్నదీ.. కుర్బానీకి అర్థం తెలియకున్నా కళ్లు చెమర్చుకున్నది.. ఆ పాటతోనే!

లగ్ జా గలే…..

…………………………………………………………………………………….

నరేష్కుమార్ సూఫీ… ✍️✍️

ఏదో ఒక సాయంత్రాన అట్లా నిల్చుంటాను వొకింత మనసుబాగాలేని తనంతోనో, కాస్త వొంటరితనాన్ని కోరుకునో కానీ… లతా తోడులేని వొంటరితనమేమిటీ? ఒక మెత్తని స్వరం అట్లా గుండెని కోస్తూ లోలోపలికి దిగబడకుంటే ఆనాటి సాయంత్రమో, నిశ్శబ్దంగా ఉన్న అర్థరాత్రో ఏం సాధించటానికి గడిచినట్టు?


“సావన్ కా మహీనా పవన్ కరె సోర్… ముఖేష్ చెబుతాడు “పవన్ కరే షోర్” లతా పాడుతుంది. ముఖేష్ విసుక్కుంటూ “షోర్ కాదు సోర్..సోర్” అంటాడు లతా సరిచేసుకుంటుంది అయితే…. నాకైతే సోర్ అన్నా షోర్ అన్నా తేడా ఏముందీ!? లతా స్వరాన్నుంచి జారిపడే ఒక్క అక్షరం చాలదూ రాగమైపోవటానికి, ఒక్క నిట్టూర్పు చాలదూ ఒక్కసారి గుండే మేల్కున్నట్టు లేచి మరీ పాటకోసం ఎదురు చూడటానికి……

లతా భారతీయ సినిమాకి ఒక యాడెడ్ ఎట్రాక్షన్. “ఆజా సనం మథుర్ చాందినీమే హమ్ తుమ్ మిలే” అంటూ ఒక్కసారి ఆ స్వరం వినపడితే చాలదూ… మనిషిగా పుట్టినందుకూ, వినటానికంటూ రెండు చెవులున్నందుకూ ఆనందించటానికీ. లతా..లతా..లతా… మూడోక్లాసులో కదా నీ స్వరాన్ని విన్నదీ “ఏ మేరే వతన్ కే లోగో…” అంటూ ఆమె స్వరాన్ని విన్నదీ, అట్లా భాషతెలియకున్నా కుర్బానీ అన్న పదానికి అర్థం తెలియకున్నా కళ్ళు చెమర్చుకుని స్వతంత్రదిన చాక్లెట్ ని కూడా అట్లా చేతిలోనే ఉంచుకుని కూచుండి పోయానూ…

అయిదుగురు చెల్లెళ్ళ బాధ్యత పదమూడేళ్ళ పసి భుజాలమీద పడితే పాడటం తప్ప మరో విషయం తెలియని లతా, పాటంటే నేనే అనుకున్న చిన్నారి లతా… ఎన్ని కన్నీళ్ళని తుడుచుకుందో, మరెన్ని కలలని ఆ కనురెప్పలు దాటకుండా దాచుకుందో ఎవరికి తెలుసు? లతాకి తప్ప…. “అక్బర్ పాదుషా కళ్ళలో విస్మయాన్ని చూసిన అనార్ఖలీ ధిక్కారపు పదును “ప్యార్ కియా కోయి చోరి నహీ కీ” అన్న లతా స్వరమే లేకపోతే ఇప్పటికీ అనార్ఖలీ ఎందరికి గుర్తుండేది? మొఘల్ ఏ అజమ్ సినిమాలో మధుబాల కనిపిస్తే…. అంతకన్నా ఎక్కువగానే లతా వినిపించింది. నౌషాద్ సంగీతానికి కొన్ని సందర్భాలలో లతా ప్రాణంలా పనిచేసింది.

  • సినిమా అంటే ప్రపంచమంతా ఒక రకం అయితే ఇండియన్ సినిమా మరో రకం. ఇక్కడ సినిమా అంటే పాట కూడా సినిమా పాట అంటే లతా కూడా*

1947 దేశంతోపాటు బాలీవుడ్ కూడా రెండు భాగాలయ్యింది. అప్పటికే హిందీ చిత్ర పరిశ్రమని ఏలుతున్న ఖుర్షీద్, నూర్జహాన్ లాంటి సమ్మోహ స్వరాలు పాకిస్థాన్ వెళ్లిపోవడంతో లతా “అవసరం” కలిగింది. అప్పటికే మరాఠీలో కొత్తగా పాడుతున్న లతా గొంతు ఆ సంవత్సరం వచ్చిన “మజ్బూర్”తో దేశమంతా “దేక్ సక్తా హూ…” అంటూ హిందీలో కొత్తగా పలికిన స్వరాన్ని విన్నది. ఇక రెండేళ్ల తర్వాత వచ్చిన “మహల్” తో మరింత పాపులర్ అయ్యింది. దేశమంతా “సుర్ కి మాయా”లో పడిపోయింది. అలా మొదలైన లతా…. ఒక దశలో బాలీవుడ్ సంగీతాన్ని వేళ్ళ మీద ఆడించింది. ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీల దగ్గరినుంచీ ఈనాటి రెహమాన్ వరకు లత గొంతుని తోడు తీసుకున్నవాళ్లే.
వరుస ఆఫర్లు, డబ్బు, పేరుతో పాటు కొత్తవాళ్ళని రానివ్వదు, ఆఖరికి సొంత చెల్లెలు ఆషాకి కూడా ఆఫర్లు రాకుండా అడ్డుకుంటోంది అనే అపకీర్తినీ తెచ్చుకుంది. ఇంత ఎదిగినా లతా, లతా స్వరం ఎందుకో గానీ ఒపీ నయ్యర్ కి మాత్రం నచ్చలేదు… ఆశాని లతా ఎదురు నిలబెట్టాడు. అక్కచెల్లెళ్ల ఇద్దరిమధ్యా ఉన్నాయని అనుకుంటున్న విభేదాలు బహిరంగమయ్యేదాకా వచ్చాయ్. అయినా విమర్శలు చేసినవాళ్లే నోళ్లు మూసుకొని,చెవులు రిక్కించి మరీ విన్నారు “దీదీ” పాటని. అయినా విమర్శలదేముంది వస్తూనే ఉంటాయి ఈ మధ్య వెలుగులోకి వచ్చిన గాయని “రానూ మండల్” విషయంలోనూ లతా అక్కసు చూపిస్తోంది అంటూ ప్రచారం జరిగింది….

“మధుమతి” సలీల్ చౌదరీ పాడించిన “ఆజారే పరదేశీ” పాటకు ఫిలింఫేర్ అవార్డ్ దాసోహం అయ్యింది. ఇప్పుడంటే రకరకాల సౌండ్స్ తో భయపెడుతున్నారు గానీ అప్పట్లో “బీస్ సాల్ బాద్” జనాన్ని బాగానే బయపెట్టింది. ఇక అందులో “కహీ దీప్ జలే” పాట #ఆనందభయం అనే కొత్త అనుభూతిని పరిచయం చేసింది. ఆ అద్భుత స్వరం ఆనందం, సినిమాలో ఆ పాట సన్నివేశం భయం. (ఈ ట్యూన్ ని కొంత కాపీ చేసి అప్పట్లో ఈటీవీ లో వచ్చిన #అన్వేషిత సీరియల్ పాటకు వాడుకున్నారు).
ఇక “సత్యం శివమ్ సుందరం” ఇప్పటికీ వెంటాడే ఆ గొంతు జీనత్ అమన్ సౌందర్యాన్ని మించి పాపులర్ అయ్యింది. లతా…లతా… లతా.. ఏళ్ళు గడిచినా అదే గాత్రం, సమ్మోహపు రాగం. ఇద్దరం కలిసి పాడుతున్నప్పుడు నీకెందుకు ఎక్కువ నాకెందుకు తక్కువ? ఈ ప్రశ్న ఏకంగా #మొహమ్మద్_రఫీ కె!!? బాలీవుడ్ విస్తుపోయింది. రెమ్యునరేషన్ విషయంలో లతా సవాల్ అప్పటికి ఒక సాహసం. ఫలితం రఫీ ఆమెతో కలిసి పాడను అంటూ అలిగాడు. కానీ ఎలా? లతా లేకుండా పాటా… కుదరలేదు మెట్టు దిగాల్సిందే రఫీ అయినా ఇంకెవరైనా అంతే… మళ్లీ లతాతో గొంతు కలపక తప్పలేదు.

బర్మన్ ల కాలంనుంచీ రెహమాన్ శకం దాకా సంగీత దర్శకులు, రఫీ, ముఖేష్ ల నుంచీ సోనూనిగం వరకూ గాయకులు, మధుబాల నుంచీ ఐశ్వర్యా రాయ్ లాంటి హీరోయిన్లవరకూ లతా ఎవర్ గ్రీన్ గానే ఉంది, అదే ఉత్సాహంతో పాడుతూనే వచ్చింది. ఫిలిమ్ ఫేర్ నుంచీ పద్మ అవార్డులు దాటుకుని “భారత రత్న” వరకూ చేరుకుంది..

62 ప్రాంతంలో ఒకసారి మృత్యువు ఒడిదాకా వెళ్లి బయటపడింది. విషప్రయోగం జరిగిందని చెప్పారు డాక్టర్లు. ఆమె వంటవాడే ఆ కుట్రలో భాగస్వామి అని కూడా వార్తలు వచ్చాయి. కొన్ని నెలల పాటు ఇల్లు కదలలేదు, గొంతు విప్పలేదు ఇక పాడలేనేమో అని భయపడ్డ లత అది మరణం కన్నా భయంకరం అనుకుంది. కానీ ఆ గొంతులో అమృతం ఉంది అది లతని బతికించింది. లతతో పాటు సినిమా పాటని, ఆమె అభిమానులని కూడా…

అయితే అప్పుడు మళ్లీ ఇంకోసారి… లత అనారోగ్యం పాలైంది, హాస్పిటల్లో చేరింది, అమృతం ఉందికదా తిరిగొస్తుంది లే అనుకున్నాను… పాడకుండా లతా, ఆమె పాట వినకుండా నేనూ ఎలా ఉండగలం?? అనుకున్నాను. కానీ……..
పాట… నేనూ…. అక్కడ ఆ అర్థరాత్రి మరి లతా!!??? “మేరే నైనా సావన్ బాందో ఫిర్ బి మెరా మన్ ప్యాసా….. అంటూ పిలుచుకుంటూ చూస్తున్నా…. కానీ దీదీ ఇక రాలేదు, ఇక పాడదు…

లగ్ జా గలే…. అన్నప్పుడు ఆ తర్వాత వచ్చే “ఫిర్ యే హసీన్ రాత్ హో న హో….” అన్న దగ్గర చివరి #హో….. దగ్గర ఉంటుంది లతా..

“హమ్ కో హామీసే చురాలో” పాటలో “పాస్ ఆవో…” కీ… “గలే సే లాగాలో…” కీ మధ్యలో వచ్చే చిన్న గ్యాప్ లో ఉంటుంది లతా…

“జియా జలే జాన్ జలే….. చివర నిలబడి ఉంటుంది లతా..

“దేఖ ఏక్ ఖ్వాబ్ పాటలో… ప్యార్ కి హాజార్ దీప్ హై ముందు ఉండే నిశ్శబ్దంలో కనిపిస్తుంది లతా….

కానీ…. ఇలా ఎంత ఓదార్చుకున్నా, ఎంత మోసం చేసుకున్నా నిజం నిజమే కదా….
లతా ఇకలేదు అని, ఇక పాడదూ అన్న నిజాన్ని అంగీకరించాల్సిందే కదా…
లతా కి అల్విదా ….. పాటకి అల్విదా…..

పాత పోస్ట్: లతా మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకాల్లో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles