జాకిర్ హుస్సేన్ తబలా శబ్దం శాశ్వతమో కాదో గాని, తాజ్మహల్ టీ యాడ్లోని ఆయన మాటలు ‘వాహ్ ఉస్తాద్ నహీ వాహ్ తాజ్ బోలియే!’ ఎన్నటికీ గుర్తుంటాయి!
……………………………………………………………………….
Nachariah MERUGUMALA.. ✍️
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ ఆదివారం రాత్రి తాను స్థిరపడిన అమెరికాలో కన్నుమూశాడనే వార్త వినగానే–73 ఏళ్లకే జాకీర్ భాయ్ మరణించాడా! అనే బాధ కలిగింది. తబులా వాద్యంతో పుట్టే ధ్వని సంగీతం ఆస్వాదించే శక్తి నాకు లేకపోవడం వల్లనేమో మరి–జాకిర్ హుస్సేన్ అనగానే ఇండియాలో అందరికీ తెలిసిన తాజ్ మహల్ బ్రాండ్ టీ నాకు గుర్తుకొస్తుంది. కొన్ని దశాబ్దాలుగా రేడియోలో, టీవీలో ఈ తేయాకు బ్రాండ్ వాడకాన్ని ప్రోత్సహించే ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ అడ్వర్టైజ్మెంట్ భారత దేశంలో అత్యధిక జనం విన్నది, చూసినది కావడమే దీనికి కారణం.

టెలివిజన్ చానళ్లలో తాజ్ మహల్ టీని ఎండార్స్ చేస్తూ జాకిర్ భాయ్ చేసిన రెండు యాడ్స్లో–ఒక పక్క తబలా వాయిస్తూ ‘‘వాహ్ తాజ్’’ అన్న మాటలు, ఆగ్రా తాజ్ మహల్ చిత్రం వెనుక కనిపిస్తుండగా ‘‘వాహ్ ఉస్తాద్ నహీ, వాహ్ తాజ్ బోనియే,’’ అనే వాక్యం ఇప్పటికీ మా తరం వారి చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో ‘మీరు తాజ్మహల్ టీ తాగండి’ అని తబలా ఉస్తాద్ చెప్పకపోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అడ్వర్టైజ్మెంట్లలో కళాకారులు కనిపించడం తప్పుకాదుగాని, ఇలా ఉత్పత్తి పేరు నేరుగా ప్రస్తావించకుండా ‘నటించడం’ నిజంగా అద్భుతం. ఇలాంటి గొప్ప లక్షణం మిగిలిన దేశీ కళాకారులకు ఎందుకనో లేదు మరి.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కనిపిస్తే అతను తోటి నటులు అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్తో కలిసి చేసిన ‘విమల్’ ఇలాయిచీ యాడ్ ఇప్పుడు పదే పదే టీవీ చానల్స్లో కనిపిస్తున్నట్టే ఇది వరకు జాకిర్ హుస్సేన్ కనపించే ‘వాహ్ తాజ్’ యాడ్ వీక్షకులకు చిర పరిచయం ఉన్న వ్యాపార ప్రకటన. జాకిర్ భాయ్ తబలా వాయించగా వచ్చిన శబ్దాన్ని భారతీయులు మర్చిపోవచ్చేమోగాని తాజ్మహల్ టీ యాడ్లో ఆయన మాటలను మర్చిపోలేరు. అమర సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసినప్పుడు ఆయన బతికుండగా ‘కళా తపస్వి’ ఫిల్మ్మేకర్ కే విశ్వనాథ్ గారితో కలిసి చేసిన వీడియో యాడ్ ‘సువర్ణభూమి’ (రియలెస్టేట్ కంపెనీ) గుర్తుకొచ్చినట్టే కొన్నేళ్ళ క్రితం విశ్వనాథ్ మరణించినప్పుడు ఈ యాడ్తోపాటు ‘రామరాజ్’ కాటన్ బట్టల బ్రాండ్ యాడ్ తెలుగోళ్ల కళ్ల ముందు కదలాడింది. బతికి ఉండగా కొన్ని వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్గా పనిచేసిన వ్యాపార ప్రకటనలు వారు కన్నుమూసినప్పుడు ప్రజలకు గుర్తుకు రావడంలో తప్పులేదనుకుంటాను.



