డిసెంబర్ 22 వచ్చిదంటే చాలు గణితమంటే అభిమానించేవారికి.. రామానుజన్ గుర్తుకువస్తాడు. ఎందుకంటే వందేళ్లు దాటుతున్నా రామానుజన్ సృష్టించిన పై ఆధునిక భౌతిక శాస్త్రంలో తన ప్రాధాన్యతేంటో బల్లగుద్ది చెబుతోంది.
1914లో పుట్టిన ఒక నిశ్శబ్ద ఆలోచన ఇంకా నేటి శాస్త్రాన్నీ తీర్చిదిద్దుతోంది. యువకుడిగా ఉన్నప్పుడు శ్రీనివాస రామానుజన్ పై వంటి సమీకరణాలను ప్రపంచానికి అందించాడు. నేడు ఆ సమీకరణాలే ఆధునిక భౌతిక శాస్త్ర పరిశోధకులకు దారిదీపమయ్యాయి. కాలాలు, రంగాలతో సంబంధం లేకుండా తన మేథస్సుతో ప్రపంచాన్నే ప్రభావితం చేసి ఇప్పటికీ తన వెలుగులు ప్రసరిస్తున్న ఓ శక్తి రామానుజన్.

రామానుజన్ పై సూత్రాలు – వాటి ఆధునిక సంధానం!
రామానుజన్ సూత్రాలు శతాబ్ద కాలం దాటినా ఇంకా ప్రాధాన్యతనెందుకు నిలబెట్టుకున్నాయి..? పైని క్యాలిగ్యులేట్ చేయడానికి ఆయన అందించిన 17 ఎక్స్ప్రెషన్స్ గణిత లోకానికి వేగాన్ని అందించాయి. తక్కువ సమయంలో పొడవైన అంకెల శ్రేణులను గుణించగల్గాయి. అందుకే గణిత సమాజం ఇంకా రామానుజన్ సమీకరణలపై విశ్వాసాన్ని ఉంచుతూ వాటిని తమ మార్గదర్శకంగా చూస్తోంది. ఇవాళ ట్రిలియన్లలో లెక్కలను కూడా సులభంగా, వేగవంతంగా లెక్కించేందుకు రామానుజన్ పై సూత్రం ఉపయోగపడుతోంది. ఇటీవలే 200 ట్రిలియన్ అంకెలను గణిత శాస్త్రజ్ఞులు లెక్కించగల్గారంటే.. అందుకు మూలం, రామానుజన్ పై సిద్ధాంతం. అమెరికన్ గణిత శాస్త్రవేత్తలైన చూడ్నోవస్కీ బ్రదర్స్ కనుగొన్న చూడ్నోవస్కీ అల్గారిథమ్స్ కూడా రామానుజన్ పై సూత్రం ఆధారంగానే నడుస్తున్నాయంటే.. ఆధునిక గణిత సమాజంపై ఆయన ప్రభావమెంతో చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని స్వయానా బెంగళూరులోని ఐఐఎస్సీనే ప్రకటించింది.
ఐఐఎస్సీకి చెందిన ప్రొఫెసర్ అనింద సిన్హా.. ఫైజాన్ భట్ తో పాటు, తన కొలీగ్స్ కు గైడ్ చేసే క్రమంలో రామానుజన్ పై థియరీ ఏవిధంగా ఆధునిక భౌతిక శాస్త్రంపైనా పనిచేసిందో శోధించగల్గారు. పరిమాణం మారినా ఆకారం మాత్రం నిల్చే వ్యవస్థలను వివరించే థియరీలను ఏ భౌతిక సిద్ధాంతాలు రామానుజన్ గణిత సూత్రాలంత బలంగా వివరించలేకపోయాయన్న రూఢీకొచ్చారు. ఉదాహరణకు ఒక క్రిటికల్ పాయింట్ వద్ద నీరు, ఆవిరి రెండూ ఒకే తీరుగా ఉంటాయనేది చెప్పుకొచ్చారు. లాగరిథమ్ క్వాంటమ్ థియరీలను లోతుగా అధ్యయనం చేసిన ఆ బృందం.. రామానుజన్ వివరణలు తనకు తెలియకుండానే ఇవాళ విశ్వాన్నే అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతున్నట్టు వెల్లడించారు.
రామానుజన్ పై సిద్ధాంతం ఆధునిక భౌతిక పరిశోధనలకు ఏం చేయగల్గింది మరి..?
వేగంగా లెక్కించగల్గడం, క్లిష్టమైన వాటిని లెక్కించే షార్ట్ కట్స్ కు ఉపయోగపడటం, వాటి మూలాలను శోధిస్తే ఆధునిక భౌతిక శాస్త్ర శోధనల్లో లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగడపడటం వంటివెన్నో రామానుజన్ పై సూత్రాల ఆధారంగానే సులభమైతున్నాయనేది శాస్త్రవేత్తలు చెప్పే మాట. మొత్తంగా రామానుజన్ సమీకరణాలు నేటి ఆధునిక భౌతిక శాస్త్రంలో బ్లాక్ హోల్స్ నుంచి టర్బ్యులెన్స్, పెర్క్యులేషన్ వంటి రంగాలనూ తాకడాన్ని ఆ శాస్త్రవేత్తల బృందం గర్వంగా చెప్పింది.
ఎందుకు రామానుజన్ ఎఫెక్ట్స్ సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తున్నాయి..?
అయితే రామానుజన్ సూత్రీకరణలు కేవలం లెక్కింపులకే పరిమితం కాలేదు. లోతైన ఉపయోగకరంగా మారాయి. టర్బ్యులెంట్ ప్రవాహం, బ్లాక్ హోల్స్ పరిశోధనలను సులభతరం చేశాయి. హై ఎనర్జీ ఫిజిక్స్ టాస్కులకు రామానుజన్ సూత్రీకరణలు స్పష్టమైన సమాధానాలకు అవకాశం కల్పిస్తున్నాయి. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విశాల విశ్వమంతటా జరిగే పరిణామాలు గణితీయంగానే సంభవిస్తాయంటారు లైబినిడ్జ్ అనే గణిత శాస్త్రజ్ఞుడు. అలాంటి పరిణామాల శోధనలో రామానుజన్ సూత్రీకరణలు శాస్త్రవేత్తలకు ఊతమవుతున్నాయి. 20వ శాతబ్దపు ఆరంభంలో ఒంటరిగా కేవలం ఓ మేథమెటీషియన్ గా మాత్రమే తన పరిశోధనలు చేసిన రామానుజన్ ప్రభావం తనకు తెలియకుండానే నేటి ఆధునిక భౌతిక శాస్త్రంపై అమితంగా పడటంతో.. విశ్వం ఉనికిపై పరిశోధనలు చేస్తున్న ఎందరో శాస్త్రవేత్తలకు ఆయనో ప్రేరణగా మారాడు.
ఇవాళ డిసెంబర్ 22, ఆ గణిత మేధావి పుట్టినరోజు. పుట్టిన్నాట్నుంచి, గిట్టే వరకూ గణితం మానవ జన్మతో ముడిపడి ఉంది. ఆడుకునే బాలుడి నుంచి అంతరిక్ష యాత్రీకుడి వరకూ గణితం లేకుండా ఉనికే లేదు. 11 ఏటనే గణితంపై మక్కువ పెంచుకున్న రామానుజన్ మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, వర్గమూలాలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్ వంటివాటిపై ఎన్నో పరిశోధనలు చేశారు. త్రికోణమితి మీద అధ్యయం చేసి 13 ఏళ్లకే వాటిని అర్థం చేసుకుని సొంతంగా సిద్ధాంతాలను తయారుచేయగల్గిన మేథ ఆయనది. ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాలపై బడా ప్రొఫెసర్లకే అర్థం కాని విషయాల్ని అలవోకగా అర్థం చేసుకుని అబ్బురపర్చిన ప్రజ్ఞావంతుడు. 1729కి ఏకంగా రామానుజన్ అనే సంఖ్య అనే పేరు సంపాదించుకున్నాడు. రామానుజన్ వేసిన ప్రతీ అడుగూ గణిత శాస్త్రాన్ని ప్రకాశవంతం చేయడంతో పాటు, నేటి ఆధునిక భౌతిక శాస్త్రానికీ వన్నెలు తెచ్చింది. అయితే, ఆయన కేవలం గణిత శాస్త్రంలో మాత్రమే శాస్త్రజ్ఞుడనుకోవడానికి వీల్లేకుండా.. మానవ మేథ ఎంత చేయగల్గుతుందో అంత తాను జీవించి ఉన్న కాలంలో చేసి వెళ్లిపోయిన మహానుభావుడు రామానుజన్.
1918లో ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన తొలి భారతీయుడు రామానుజన్ కు నివాళులతో…



