ఎంత తిరిగినా.. ఎన్ని పర్యటించినా… చాలామంది తిరిగి చేరుకోవాలనుకునేది.. తమ అలసట తీరడానికి ఇష్టపడేది ఇల్లు మాత్రమే. అందుకే, గృహమే కదా స్వర్గసీమ అంటుంటారు. నిశ్చలమైన ఆ ఇంటికే చలనం వచ్చి కదులుతూ ఉంటే… ఓసారి ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఊహించుకొండి. అందులోనూ, రాజప్రసాదాలను తలపించేలా గత కాలపు చారిత్రక వారసత్వానికి అద్దం పట్టే ఆర్కిటెక్చర్ తో ఒక మూవింగ్ హోంలో మీరు ప్రయాణిస్తున్నారనుకోండి… మాటలకందని వర్ణన కదా అది! అలాంటి గోల్డెన్ చారియట్ గురించి ఓసారి తెలుసుకుందాం పదండి!

అలాంటి ఒక అద్భుతమైన రైలును భారతీయ రైల్వే ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. అది అలాంటిలాంటి రైలు కాదు.. ఏకంగా సెవెన్ స్టార్ సౌకర్యాలొకవైపు… కళాత్మకమైన సంప్రదాయ ఇంటీరియన్ డిజైనింగ్ మరొకవైపు ఒక కొత్త అనుభూతినిచ్చేవిధంగా ఈ ట్రైన్ ను రూపొందిచారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ కర్నాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సహకారంతో ప్రస్తుతం ఈ ఏడు నక్షత్రాల ఈ మూవింగ్ హోటల్ పర్యాటకులకు ఓ కొత్త అనుభవాన్నిస్తోంది. ఈ లగ్జరీ టూరిస్ట్ ట్రైయిన్ కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు, పాండేచ్చేరి వంటి రాష్ట్రాల్లో పర్యాటక ప్రదేశాల్ని చూసేలా చుట్టొస్తుంది.
హంపీలోని విఠల ఆలయంలోని రాతిరథం ఈ ట్రెయిన్ రూపకల్పనకు ప్రేరణ. దక్షిణభారత దేశంలో చారిత్రక కట్టడాల నిర్మాణశైలితో.. సకల సౌకర్యాలనూ మిళితం చేస్తూ ఈ ఆతిథ్య సేవలను నిర్వహిస్తోంది ది మాపుల్ గ్రాప్. హోసళులు, చాళుక్యుల వంటి రాజవంశాల అలంకరణలను గుర్తు చేసేలా ఈ రైల్లో అంతర్గతంగా ఉండే డిజైన్స్ కనిపిస్తాయి.
అంతేకాదు, పెద్ద పెద్ద టెలివిజన్ సెట్స్, వైఫై కనెక్టివిటీ, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, వేడినీటి సరఫరా, పెద్ద పెద్ద లాంజులు, స్పా, జిమ్, వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్స్, అత్యాధునికమైన సూట్స్ తో అసలు మనం ట్రెయిన్ లో ఉన్నామా, సెవెన్ స్టార్ హోటల్లో ఉన్నామా అనే ఒక విభ్రమకు గురయ్యేలా డిజైన్ చేశారు ఈ రైలుని.
44 క్యాబిన్స్ తో డిజైన్ చేసిన ఈ రైలుకు ఒక్కో క్యాబిన్ కు ఒక్కో పేరును పెట్టగా.. దక్షిణభారత దేశ రాజవంశాలవారి పేర్లతో ఈ క్యాబిన్స్ అన్నీ కనిపిస్తాయి. మైసూర్ వాళ్ల శైలి ఈ క్యాబిన్ ఇంటీరియర్స్ లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. లగ్జరీకి లగ్జరీ.. వారసత్వాన్ని ప్రతిబింబించే శైలితో ఈ మూవింగ్ హోటల్ ఆకట్టుకుంటోంది. కదులుతున్నందుకు మాత్రమే అదో ట్రెయిన్ అనుకోవడం తప్పితే… మిగిలినదంతా ఓ సెవెన్ స్టార్ హోటల్ లో దిగినట్టే ఏర్పాట్లు చేశారు.

భోజనశాల పేరుతో సహా… భోజనాలకు కూడా మహాభారతం పౌరాణిక కథల ఫ్లేవర్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. నలభీమపాకం పేరుతో అత్యంత రుచి, శుచికరంగా ఈ రైలులో శాఖాహార భోజనం లభిస్తుంది. హంపీ, హలిబేడ్ వంటి చారిత్రక ప్రాంతాల్లోని శిలల నుంచి ప్రేరణ పొందిన కళానైపుణ్యం చూడ్డానికి రెండు కళ్లూ చాలవన్నట్టుగా తీర్చిదిద్దారు.
రసహృదయులకు మంచి బార్ తో పాటు, ప్రత్యేకంగా ఈ రైలులో కళాకారులతో ఇప్పించే కళా ప్రదర్శనలతో.. అచ్చంగా ఓ మైసూర్ ప్యాలెసే కదులుతుందా అన్న ఒక విభ్రమలోనే ఈ రైలులో పర్యాటకులు ఆద్యంతం ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.
వీకెండ్ లో ఏర్పాటు చేసిన ఈ గోల్డెన్ చారియట్ ట్రెయిన్ పర్యాటకాన్ని మరో మెట్టుకు పెంచడమే కాకుండా… దాంతోపాటే అలసట, బడలిక వంటివేవీ లేని ఒక కొత్త అనుభూతినందించేలా తీర్చిదిద్దడంతో ఈ ట్రెయిన్ ప్రయాణానికి నెళ్లాల్ల ముందునుంచే టిక్కెట్లు బుక్ అయిపోయి అమితమైన డిమాండ్ కనిపిస్తోందంటున్నారు ఈ రాయల్ రైలెక్కిన ప్రయాణీకులు.



