చీనాబ్ నుంచి పంబన్ వరకూ కొన్ని వంతెనలు ఇంజనీరింగ్ మార్వ్లెస్. భారతీయ రైల్వే కనెక్టివిటీలో రికార్డులు సృష్టించిన నాల్గు మెగా వంతెనల గురించి ఓసారి సూక్ష్మంగా పరిచయం చేసుకుందాం రండి.
చీనాబ్ రైల్వే బ్రిడ్జ్!
మానవ మాత్రులు చేయగలరా అని ఆశ్చర్యపోయే స్థాయిలో.. 2025లో చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ వంటి ఒక అద్భుతాన్ని భారత్ సాధించింది. ఈ బ్రిడ్జ్ ఖ్యాతి ఇప్పుడు కేవలం భారతదేశానికే పరిమితమైంది కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ లో అద్భుతాలను ఆవిష్కరించింది.

పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఒక మైలురాయి చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఈ వంతెన నిర్మాణంతో ఇప్పుడు జమ్ము కశ్మీర్ పర్యాటకంలో వాణిజ్యం, ఉపాధి అకాశాలకూ కొత్త దారులు తెరించిది. ఒక్క మాటలో చెప్పాలంటే జాతీయ ఆర్థికవ్యవస్థకే ఊతమిచ్చే ఓ నిర్మాణమిది.
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ చీనాబ్ వంతెన. జమ్ము కశ్మీర్ లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ఇది ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల ఎత్తులో ఉండటంతో ఈ బ్రిడ్జ్ ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది. భూకంపాలు, అధిక తీవ్రతో వీచే గాలులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ డిజైన్ చేయడం మరో విశేషం. అందుకే, ఇదొక అసాధారణ ఇంజనీరింగ్ వండర్ గా చెప్పుకుంటున్నారు.
అంజీ వంతెన!
అంజీ వంతెన భారతదేశంలోనే తొలి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్. ఇది కూడా చీనాబ్ లోయలోని కఠినమైన భూభాగంలో నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంతో ఈ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటినీ మరింత బలోపేతం చేసింది ప్రభుత్వం. ఒకవైపు లోతైన లోయలు.. ఇంకోవైపు ఎత్తైన పర్వతాల మధ్య నిర్మించిన ఈ వంతెన నిర్మాణం ఓ సంక్లిష్ఠ రూపకల్పన. ఆధునిక ఇంజనీరింగ్ సాధిస్తున్న పురోగతిని ఈ వంతెన మనకు కళ్లకు కడుతుంది.

పంబన్ బ్రిడ్జ్!
దక్షిణ భారతదేశంలో గతంలో నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ ని మించి… ఆధునిక ఇంజనీరింగ్ కు అద్భుతమైన ఉదాహరణగా నూతన పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. భారతదేశంలో సముద్రంపైన.. ఇది మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ గా పేరు తెచ్చుకుంది. తమిళనాడు రామేశ్వరం దీవిని ప్రధాన భూభాగంతో కలిపే కీలక వంతెన ఇది. సుమారు 2.8 కిలోమీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. బలమైన గాలులు వీచినా… కఠనమైన సముద్ర పరిస్థితులను తట్టుకునేలా.. ఎత్తైన అలలు వచ్చి బ్రిడ్జ్ ను కొట్టినా దృఢంగా నిలబడేలా నిర్మించారు ఈ పంబన్ వంతెనను. 50 ఏళ్ల వరకూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండే ముందుచూపుతో.. ఎలాంటి వాతావరణ ఒత్తిడులనైనా తట్టుకునే అడ్వాన్స్డ్ యాంటీ – కరోషన్ సాంకేతికతను వినియోగించి చేపట్టారు.

బైరబి – సైరంగ్!
ఈశాన్య భారతంలో ఓ వండర్ ఫుల్ ఇంజనీరింగ్ కు ప్రతీక ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్. బైరాబి – సైరాంగ్ రైలు మార్గంలో… 51 కిలోమీటర్ల లైన్ లో మొత్తం 45 సొరంగాలు, 142 వంతెనలున్నాయి. ఈ వంతెనల్లో 114 మీటర్ల ఎత్తులో ఉండే బ్రిడ్జ్ నంబర్ 144 అత్యంత ఎత్తైనది. కుతుబ్ మినార్ కంటే.. 42 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ ప్రాజెక్టుతోనే మిజోరాం రాజధాని ఐజ్వాల్ తొలిసారి రైల్వే నెట్వర్క్ తో కనెక్టైంది.
అత్యంత నాణ్యతతో కూడిన భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యం ఇప్పుడు దేశ, విదేశాలను అబ్బురపరుస్తోంది.



