ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో దర్బార్లను నిర్వహించేవారు. ఆ దర్బార్లలో రాజు లేదా రాణికి పట్టాభిషేకాన్ని నిర్వహించే ఒక వేడుక జరిపించేవారు. అందుకు ఢిల్లీలో మూడుసార్లు అలాంటి దర్బార్లను నిర్వహించారు. 1877, 1903, 1911 సంవత్సరాల్లో ఢిల్లీ దర్బార్లలో ఆ వేడుకలు జరిగాయి.
ఆ దర్బార్ల నిర్వహణ సమయంలోనే విలాసవంతమైన వస్త్రాలు ధరించి కొలువైన రాజు లేదా రాణి తమ ప్రజల్ని కలుసుకోవడం, ఫిర్యాదులు వినడం, ఎవరైనా గొప్ప పనులు చేసినవాళ్లకు బహుమతులందించడం వంటివి ఉండేవి. అయితే, ఈ దర్బార్ల నిర్వహణలో.. మొఘలుల సంస్కృతిని బ్రిటీషర్స్ ఒంట పట్టించుకున్నారు.

అలా మొట్టమొదటి దర్బార్ 1877 జనవరి 1వ తేదీన ఢిల్లీలోని కొరోనేషన్ పార్క్ లో జరిగింది. ఆ వేడుకలో అప్పటి పాలకురాలు క్వీన్ విక్టోరియా ను కైజర్ ఈ హింద్ అంటే భారత సామ్రాజ్ఞిగా.. ఎంప్రెస్ ఆఫ్ ఇండియా బిరుదుతో సత్కరించారు. దాంతో ఆమెను భారతదేశ పట్టపురాణిగా ప్రకటించారు.
బ్రిటీషర్స్ దర్బార్లపై ఔరంగజేబు ప్రభావం!
ఔరంగజేబు పాలనలో మొఘల్ సామ్రాజ్యం శిఖరస్థాయికి చేరింది. వారి సంపద, వైభోగాలు, వైభవం యూరోపియన్ రాజ్యాలను కూడా ఆకర్షించాయి.మొఘలులు మైత్రితోనూ, కాదంటే యుద్ధాలతోనూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటే.. బ్రిటీషర్స్ వ్యాపారం ద్వారా ప్రవేశించి తమ ప్రభావాన్ని పెంచుకున్నారు. భారత ఉపఖండంలో వారి ప్రభావం పెరుగుతున్నకొద్దీ… మొఘల్ సంస్కృతిలోని అనేక ఆచార, సంప్రదాయాలను వారు స్వీకరించడం మొదలెట్టారు. తమకు తాము మొఘలుల సహజ వారసులున్నట్టుగా భావించారు.
రాజధాని కలకత్తానే అయినప్పటికీ.. దర్బార్లు మాత్రం ఢిల్లీలోనే!
అప్పట్లో రాజధానిగా కలకత్తా ఉన్నప్పటికీ దర్బార్ల నిర్వహణకు మాత్రం ఎప్పుడూ ఢిల్లీనే కేంద్రం. బ్రిటీషర్స్ దృష్టిలో మొఘల్ రాజధానిగా నాడు షాజహానాబాద్ గా పిలువబడ్డ నేటి పాత ఢిల్లీ అంటే… సంపద, శ్రేయస్సుకు ప్రతీక అని అర్థం.

1877 దర్బార్ అత్యంత ఆడంబరంగా నిర్వహించారు. సైనిక శక్తిని ప్రదర్శిస్తూ 15 వేల మంది బ్రిటీషర్స్ తో పాటు, భారతీయ సైనికులు పాల్గొన్నారు. 68 వేల మంది ఆ వేడుకకు హాజరయ్యారు.
14 రోజుల వేడుకగా మొదటి దర్బార్!
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ బ్లాగ్స్ లో దక్షిణాసియా నిపుణురాలైన నుజ్జత్ ఖతోన్ ఏమంటారంటే… భారత వైస్రాయ్ రాబర్ట్ బల్వర్ లిట్టన్, బ్రిటీష్ గవర్నర్లతో పాటు.. 63 మంది భారతీయ మహారాజులు, నవాబులు, ఇతర ప్రముఖులు దర్బార్ కు హాజరై… 14 రోజుల పాటు విందులు, వేడుకల్లో పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో మొదటిసారి భారతీయ రాజవంశీయులు బ్రిటీష్ కిరీటానికి సెల్యూట్ చేశారు.
అయితే, అక్కడికొచ్చిన భారతీయ నవాబులు, మహారాజులకు ఆయుధ వందనంగా గన్ సెల్యూట్ చేసి స్వాగతించారు. వారంతా విలాసవంతమైన దుస్తులు, ఆభరణాలతో తమ సంపదను ప్రదర్శించిన దర్బార్ అది. సుమారు 400 మంది పాలకులు ఆ దర్బార్ కు రాగా.. అందులో 63 మంది యువరాజులు ఆ విందు, విలాసాలకు హాజరైనవారిలో ఉన్నారు.
నాటి దర్బారులో ప్రత్యేక ఆకర్షణగా నిజాం నవాబు!
నిజాం నవాబు చూడ్డానికి చాలా సాదాసీదాగా నలుపు, తెలుపు దుస్తులే ధరించినా.. ఆయన తలకాయపైన వజ్రంతో మెరుస్తున్న పసుపు పాగా మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిల్చిందట. బంగారు వర్ణంలో నూలుతో అల్లిన వస్త్రం కప్పిన నిజాం ఎక్కిన ఏనుగు నవాబును మోసుకొచ్చింది. భారత సామ్రాజ్ఞిగా పట్టాభిషేకం జరిగిన క్వీన్ విక్టోరియా గుర్తింపుగా నిజాం నవాబుతో పాటే వచ్చిన ప్రతీ పాలకుడికీ బంగారు జెండా, ఓ పతకాన్ని అందజేశారు. కానీ, అదంతా బ్రిటీష్ పాలకులకు లోబడ్డవారికి మాత్రమేనన్న విషయమూ గుర్తించాలి.
అంత పెద్ద దర్బార్ కు హాజరుకాని విక్టోరియా!
14 రోజుల పాట నిర్వహించిన దర్బార్ వేడుకలకు భారత దేశంలో పాలకులు, బ్రిటీష్ వైస్రాయ్, గవర్నర్లు అంతా హాజరైనా కూడా.. అసలు పట్టాభిషేకం చేసి భారత సామ్రాజ్ఞిగా ప్రకటించిన క్వీన్ విక్టోరియా మాత్రం రాలేదు. విక్టోరియాకు బదులు భారత వైస్రాయ్ ఫస్ట్ ఎర్ల్ ఆఫ్ లిట్టన్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత 1911లో జరిగిన ఢిల్లీ దర్బార్ లో మాత్రమే నాల్గో కింగ్ జార్జ్, క్వీన్ మేరీ ఇద్దరూ ప్రత్యక్షంగా హాజరయ్యారు.
వరల్డ్ హిస్టరీ ఎన్ సైక్లోపీడియాలో దర్బార్ల నిర్వహణ గురించి!
వైస్రాయ్ వేదికపైన భారీ తెర సెట్టింగ్ కనిపించేది. దాని స్తంభాలపైన బ్రిటన్ చిహ్నాలు, సెయింట్ జార్జ్ క్రాస్, యూనియన్ జాక్ జెండాలుండేవి. వైస్రాయ్ కూర్చునే స్థానంపై దగ్గర క్వీన్ విక్టోరియా స్వహస్తాక్షారలతో రాసినట్టుగా భారీ బంగారు ఫ్రేమ్ ఒకటి చిత్రంలా వేలాడుతుందట.
ఆ వేలాడే క్వీన్ విక్టోరియా ప్రకటనలను ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో చదివేవారు. ఆ ప్రకటనలో చాలా హామీలుండేవి.
భారతీయులు స్వేచ్ఛ, సమానత్వం, సహజ న్యాయసూత్రాల ఆధారంగా పాలించబడతారు.
మత స్వేచ్ఛ కల్పిస్తాం
విద్యా. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం
ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అవకాశాలిస్తాం
తమ పాలనలో పౌరులంతా సమానులే.
కానీ ఇవేవీ నాటి బ్రిటీషర్స్ పాలనలో కనిపించకపోవడంతోనే స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. వలస పాలకుల కఠినత్వానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి బీజం పడటం ఇక మనకు కాస్తో కూస్తో తెలిసిన చరిత్రే.



