సంజీవ్ కపూర్ ఎంత పెద్ద సెలబ్రిటీ చెఫో జగమెరిగిందే. అలాంటి సంజీవ్ కపూర్ ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఇంతవరకూ బాగానే ఉన్నా… పద్మశ్రీ స్వీకరణ సమయంలో జరిగిన ఒక ఘటన ఆ అవార్డుల సెర్మనీలోనే ఓ ఇంట్రెస్టింగ్ ఘట్టం. అలాంటి విషయాన్నే సంజీవ్ కపూర్ షేర్ చేసుకున్నారు.

2017లో సంజీవ్ కపూర్ ను పద్మశ్రీతో సన్మానించింది భారత ప్రభుత్వం. అధికారిక ప్రోటోకాల్ కు భిన్నంగా తాను చెఫ్ యూనిఫామ్ మీదే ఆ అవార్డ్ అందుకుంటానని మొండికేశాడు సంజీవ్ కపూర్. లేకపోతే ఆ అవార్డే తాను తీసుకోనని భీష్మించారట.
ఈ విషయాన్ని కహానీ ఖజానా అనే తన వీడియో సీరిస్ లో సంజీవ్ కపూర్ వెల్లడించారు. పద్మశ్రీ అందుకోవడం తన కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఓ మైలురాయి. తన వృత్తికి దక్కిన గౌరవం. కళలు, ప్రజావ్యవహారాలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశిష్ఠ సేవలందించినవారికి పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలను అందిస్తారన్నదీ తెలిసిందే.
ఆ క్రమంలోనే తనకు పద్మశ్రీ స్వీకరణ సమయంలో జరిగిన ఘటనను ఆయన పంచుకున్నారు. చెఫ్ యూనిఫామ్ తనకో భావోద్వేగపూరితమైన బంధమన్నారు. తాను హోటల్ లో పనిచేసినన్నాళ్లూ ప్రతీరోజూ పూర్తి యూనిఫామ్ ధరించేవాడినని.. యూనిఫామ్ తనకు గౌరవం, గర్వమన్నారు. వృత్తిని అలా భావించిన చెఫ్సే ఉన్నతస్థాయికి చేరగలరనీ సంజీవ్ కపూర్ పేర్కొన్నారు.
పద్మశ్రీ అవార్డుకు ముందు ఏం జరిగింది..?
రాష్ట్రపతి భవన్ లో జరిగే అవార్డ్ కార్యక్రమానికి ముందు అధికారిక డ్రెస్ కోడ్ గురించి అధికారులు సంజీవ్ కపూర్ కు ఎలా హాజరు కావాలో వివరించారు. సాధారణంగా అవార్డ్ గ్రహీతలెవరైనా జాతీయ స్థాయిలో ఉన్న ప్రోటోకాల్ ప్రకారమే దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సంజీవ్ కపూర్ కు కూడా అలాగే డ్రెస్ కోడ్ పాటించాలన్నది అధికారుల ఆదేశం. కానీ, అందుకు సంజీవ్ కపూర్ మాత్రం ససేమిరా అన్నారు.
తన వృత్తి గౌరవానికి ప్రతీక అయిన యూనిఫామ్ విషయంలో రాజీ పడలేనని కపూర్ స్పష్టం చేశారట అధికారులకు. సంజీవ్ కపూర్ అభ్యర్థనను అధికారులు మొదట్లో తిరస్కరించారు. అధికారులు తిరస్కరిస్తే… యూనిఫామ్ పై వస్తే పద్మశ్రీ ఇవ్వడం కుదరదంటే… పద్మశ్రీనే తనకు అక్కర్లేదని వాదించాడు సంజీవ్ కపూర్.
చివరకు సంజీవ్ కపూర్ కు చెఫ్ యూనిఫామ్ పైనున్న మక్కువ ఉన్నతస్థాయి అధికారులను ఆశ్చర్యపర్చడంతో పాటు, ప్రత్యేక అనుమతితో ఆయన వినతిని ప్రోటోకాల్ అధికారులు మన్నించారు. దాంతో సంజీవ్ కపూర్ పట్టుదల ఫలించింది. అలా రాష్ట్రపతి భవన్ లో తాను ప్రేమించే చెఫ్ యూనిఫామ్ పైనే పద్మశ్రీ అందుకున్నారు సంజీవ్ కపూర్.
చెఫ్ ప్రతిష్ఠ పెంచిన సంజీవ్ కపూర్!
తన టీవీ షోస్, కుక్ బుక్స్ , అనేక వంటకాలతో భారతదేశంలో చెఫ్ ఉద్యోగానికున్న గౌరవాన్ని పెంచడంలో సంజీవ్ కపూర్ ది క్రియాశీల పాత్ర. అందుకే ఆయనకు బెస్ట్ చెెఫ్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ అవార్డులు లభించాయి. ఏకంగా భారతదేశ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ కూడా దక్కింది. తనకు దక్కిన పద్మశ్రీ తన వ్యక్తిగతం మాత్రమే కాదని.. భారతదేశంలో చెఫ్ సమాజానికి లభించిన గౌరవమని పేర్కొన్నాడు ఈ నలభీముడు.
అత్యంత సంపన్నుల ఇళ్లల్లో నలభీమపాకాన్ని వండే ఈ మాస్టర్ చెఫ్ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన చెఫ్ గా కూడా రికార్డులకెక్కాడు. సుమారు 12 వందల కోట్ల ఆస్తిపరుడు ఈ వంటగాడు!



