భారతదేశ రాజధాని ఢిల్లీ అని అందరికీ తెలిసిందే. ఢిల్లీ కంటే ముందు కలకత్తా ఉండేదనీ చాలామందికీ తెలిసిందే. కానీ,భారతదేశ చరిత్రంలో కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే రాజధానిగా ఉన్న నగరమేంటో తెలుసా..? అసలలా ఒకే ఒక్క రోజు రాజధానిగా ఓ నగరముందనే విషయం కూడా చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ క్రమంలో దాని కథా కమామీషేంటో తెలుసుకుందాం రండి.
అందుకు మనమోసారి ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ వెళ్లాలి. ప్రస్తుతం దాన్నే ప్రయాగ్ రాజ్ అని కూడా పిలుస్తున్నారు. మొన్న మహా కుంభమేళాతో ఈ నగరం మరింత జనంలో నానింది.
1858లో ఈ నగరం కేవలం 24 గంటలపాటు మాత్రమే భారతదేశ రాజధానిగా నిల్చింది. 1857 తిరుగుబాటు అనంతరం బ్రిటీష్ పాలనలో జరిగిన కీలక పరిణామంతో ఈ అరుదైన అవకాశం ప్రయాగరాజ్ కు దక్కింది.

ఎందుకు అలహాబాద్ ను రాజధానిగా ప్రకటించారు..?
1858, నవంబర్ 1వ తేదీన అలహాబాద్ లోని మింటో పార్క్ వద్ద ఒక భారీ కార్యక్రమం జరిగింది. ఆ సభలో బ్రిటీష్ అధికారులు భారతదేశ పాలన ఇకపై ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో కాకుండా… నేరుగా బ్రిటీష్ కిరీటం కిందకు వస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఆ ప్రకటనతోనే భారత్ లో నేరుగా బ్రిటీష్ పాలనకు బీజం పడింది. దానినే తర్వాత బ్రిటీష్ రాజ్ గా పిల్చారు. నాడు ఆ అధికార బదిలీకి ప్రతీకగా ఆ రోజున అలహాబాద్ ను భారత రాజధానిగా ప్రకటించారు.
మరి ఎందుకు ఒకే ఒక్క రోజు ప్రయాగరాజ్ రాజధానిగా ఉంది..?
అలహాబాద్ ను అధికారికంగా రాజధానిగా ప్రకటించినప్పటికీ.. ఆ హోదా 24 గంటలకే పరిమితమైంది. ఆ సమయంలో కలకత్తా.. బ్రిటీషర్స్ కు ప్రధాన పాలనా కేంద్రంగా ఉండేది. దాంతో బ్రిటీషర్స్ కలకత్తానే అనువైన ప్రదేశమని నిర్ణయించుకుని.. కార్యక్రమం ముగిసిన వెంటనే పాలనా కార్యకలాపాలను తిరిగి కోల్ కొత్తా నుంచి ఆరంభించారు. దాంతో అలహాబాద్ సాంకేతికంగా ఒకే ఒక్క రోజు భారతదేశ రాజధానిగా గుర్తింపు పొందింది.
అలహాబాద్ ఓ వ్యూహాత్మక ప్రదేశం!
ఒక్క రోజు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిలాగా.. ఒక్కరోజు రాజధానిగా గుర్తింపు పొందిన అలహాబాద్ ను బ్రిటీషర్స్ ఎంచుకోవడానికి కారణాలెన్నో ఉన్నాయి. 1858 వరకూ ప్రయాగ్ రాజ్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ ప్రధాన కార్యాలయంగా ఉండేది. అలాగే.. గంగా, యమునా, నదుల సంగమ ప్రాంతం కావడం వల్ల వ్యూహాత్మకంగా అలహాబాద్ రాజధానికి అనువైన ప్రదేశంగా నిల్చింది.
1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత అలహాబాద్ ను బ్రిటీష్ అధికారులు సురక్షితమైన రవాణా, సమాచార సేకరణకు అనుకూలమైన నగరంగా భావించారు. రాజకీయ అస్థిరత సమయంలో సైనిక రవాణా, సమాచార మార్పిడి సులభంగా జరగడం వల్ల కూడా ఈ అలహాబాద్ కు ప్రాధాన్యత దక్కింది.
భారతీయ రాజకీయ చరిత్రతో ముడిపడిన నగరం!
ఒక్కరోజు రాజధానిగా నిలిచిన విశేషానికంటే కూడా అలహాబాద్ ది.. భారత రాజకీయ, సాంస్కృతిక చరిత్రలో కీలక పాత్ర. స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన ముఖ్య సమావేశాలెన్నో ఇక్కడే జరిగాయి. అలాగే మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ప్రముఖ జాతీయ నాయకుల ఆవాసంగా అలహాబాద్ కు పేరుంది.
ఇప్పటికీ ప్రయాగరాజ్ లో జరిగే చారిత్రక పర్యటనలు, వారసత్వ చర్చలు, ఉపాన్యాసాల్లో భారతదేశ ఒక్కరోజు రాజధానిగా నిల్చిన విశేషాన్ని చాలామంది గుర్తు చేసుకుంటూనే ఉంటారు.



