భారతీయ కరెన్సీపై.. మన దేశ సాంస్కృతిక చిహ్నాలకు సంబంధించిన పలు ఫోటోగ్రాఫ్స్ ఇప్పటికే మీరు గమనించే ఉంటారు. అలాగే, ఒక్కో స్మారక చిహ్నం వెనుకున్న కథా బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే, ఒకసారి కొన్ని మనం నిత్యం ఉపయోగించే నోట్లు.. వాటిపైనుండే చిహ్నాలు.. వాటి వెనుక కథలను పునరవలోకిద్దాం రండి.
మన ప్యాకెట్ లో మనం మార్కెట్ లో కొనాల్సిన డబ్బులుంటే… మడతబెట్టిన ఆ కరెన్సీలో మన భారతదేశ చరిత్ర దాగి ఉంది. ఒక్కో నోటు ఒక్కో డిజైన్ లో అలరిస్తుంటే.. ఆ డిజైన్లలో మన సాంస్కృతిక వారసత్వం ఆ కరెన్సీలకు మరింత విలువ చేకూరుస్తోంది.

మీ దగ్గర 10 రూపాయల నోటుంటే ఓసారి మడత విప్పి చూడండి. మన ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ కోణార్క్ దేవాలయ నిర్మాణ వైభవం కనిపిస్తుంది. కొన అంటే మూల.. ఆర్కా అంటే సూర్యుడు అలాంటి కోణార్క్ గా సుస్థిరమైన ఆ ఆలయంలోని శిల్పకళ మనకు పది రూపాయల నోటుపై కనిపిస్తుంది.
1250 కామన్ ఎరాలో నిర్మించిన ఈ ఆలయం 227 అడుగుల ముఖభాగంతో దేశంలో ఎంత పాప్యులరో అందరికీ తెలిసిందే.
ఇక 20 రూపాయల నోటు గమనించండి. కైలాస మందిరం దర్శనమిస్తుంది. రెండు లక్షల టన్నుల రాతిని తొలగించి.. చుట్టూ కందకాలను నిర్మించి.. ఆ శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో దర్శనమిచ్చే శిల్పాలతో… మంత్రముగ్ధుల్ని చేస్తుంది మహారాష్ట్రలోని ఈ కైలాస ఆలయం.
50 నోటును ఓసారి పరిశీలించండి.. హంపీలోని రాతి రథచక్రం కనిపిస్తుంది. 16వ శతాబ్దంలో పాలించిన విజయనగర సామ్రాజ్య రాజు శ్రీ కృష్ణదేవరాయలు ఒడిశాలో యుద్ధంలో ఉన్నప్పుడు ఆయన దృష్టి కోణార్క్ సూర్య దేవాలయంపై పడిందట. దాంతో అదే ప్రతిరూపాన్ని తిరిగి కర్నాటకలో నిర్మించాలన్న ఆయన సంకల్పంతో రూపుదిద్దుకుంది ఈ హంపీ రాతి రథచక్రం.

ఇలాంటివి మొత్తం మూడు రాతి రథచక్రాలు భారతదేశంలో ఉండగా.. కోణార్క్ తర్వాత హంపీలో.. మరొకటి తమిళనాడు మహాబలిపురంలో చూడొచ్చు. ఈ రథచక్రం ఇక్కడి నుంచి కదిలిన రోజు ప్రపంచమే ఆగిపోతుందనే కొందరి విశ్వాసంగా కూడా చెబుతుంటారు.
ఇక వంద నోటుకు వెళ్దాం. రాణ్ కీ వావ్ అనే మెట్లబావి దర్శనమిస్తుంది. గుజరాత్ లోని సరస్వతీ నది ఒడ్డున ఉన్న ఈ మెట్లబావి గుప్తనిధులతో కప్పబడి ఉందనీ చెబుతుంటారు. రేఖాగణిత నమూనాలు, సుమారు 800 శిల్పాలతో కూడిన స్తంభాలతో కళ్లు జిగేల్ మనిపించే ఈ బావి చూపరులను అబ్బురపర్చేది. ముఖ్యంగా ఈ బావి నిర్మాణశైలి ఓ ఆలయాన్ని తలకిందులుగా చూస్తే ఏ విధంగా ఉంటుందో.. ఆ నమూనాలో నిర్మించారు ఆర్కిటెక్ట్స్.
చాణుక్యచంద్ర వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ్ దేవ్ జ్ఞాపకార్థం ఈ మెట్లబావిని నిర్మించింది. అందుకే దీన్ని రాణ్ కీ వావ్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు కొన్ని స్తంభాలు మాత్రమే దర్శనమిచ్చే ఈ బావిపై 1890ల్లో హెన్రీ కౌసెన్స్, జేమ్స్ బర్గెస్ వెలికితీసేందుకు పరిశోధించారు. 1940ల కాలంలో ఈ బావి రూపురేఖలు మరింత బయటపడ్డాయి. భారత పురావస్తు సర్వే శాఖ 1980ల కాలంలో దీన్ని పునరుద్ధరించింది. 2014లో ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందింది.
ఇక ఓసారి 200 రూపాయల నోటును మడత విప్పి చూడండి. సాంచీ స్థూపం మిమ్మల్ని మిరుమిట్లుగొల్పుతుంది. మధ్యప్రదేశ్ లోని ఈ స్థూపం అర్థగోళాకార గోపురంతో కనిపించే రెయిలింగ్.. నాల్గు ద్వారాలతో అలరిస్తుంది. బౌద్ధంలోని కథలను తెలియజెప్పే శిల్పాలతో కళాత్మకంగా కనిపించే ఆ సాంచీ స్థూపం మన భారతీయ భిన్న, వైవిధ్య సంస్కృతికి ఓ ప్రతీక.

అశోకుడు నిర్మించిన ఈ స్థూపంతో పాటు, భారత జాతీయ చిహ్నమైన అశోక స్తంభం కూడా మనం ఈ ప్రాంతంలో చూడొచ్చు.
ఓసారి మరింత భారీ నోటు 500 దగ్గరకు పోదాం. లాల్ ఖిల్లా మనల్ని అబ్బురపరుస్తుంది. భారతదేశ చారిత్రక వారసత్వంలో గర్వంగా కనిపిస్తూ ప్రతీ గణతంత్ర దినోత్సవంలో యావత్ దేశస్థులందరినీ దేశభక్తివైపు మళ్లించే ఢిల్లీలోని ఎర్రకోట మనం 500 రూపాయల నోటుపై కనిపిస్తుంది. ఎర్రటి ఇసుకరాయి స్తంభాలను కల్గిన హాల్.. పాలరాతితో మెరిచిపోయే పెవిలియన్ తో ప్రత్యక్షంగా ఇప్పటికే చాలామంది చూసిన ఎర్రకోట వైభవం 500 కడక్ నోటు కదర్ ను చెప్పేలా దర్శనమిస్తుంది.
ఇక మనమోసారి మరింత బిగ్ బిగ్ నోట్… 2000 రూపాయలపైకెళ్లొద్దాం. ఇది మన ఇస్రో ఔన్నత్యాన్ని చాటే ప్రతీక. అంగారక గ్రహంపైకి వెళ్లే మంగళయాన్ బొమ్మతో 2000 రూపాయల నోటు దర్శనమిస్తుంది. 2014, సెప్టెబర్ 23వ తేదీన విజయవంతంగా అంగారక గ్రహకక్షలోకి అడుగుపెట్టింది ఈ మంగళయాన్.
మొత్తంగా మన సాంస్కృతిక, చారిత్రక వారసత్వాలతో మన కరెన్సీ నోట్ల రూపకల్పన మన దేశ ఠీవిని పట్టిచూపేది.



