కొంచెం ప్రగతిశీలక ఆలోచనాసరళి ఉన్నవారెవరైనా.. మన్మోహన్ సింగ్ ను అభిమానించడం సహజం. కీలుబొమ్మ, తోలుబొమ్మ అని అభివర్ణించేవారికి ఆయన డెప్త్ తెలిసి ఉండకపోవచ్చు. ఆయనెంత దూరదృష్టి కల్గినవాడో.. అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లలా ఎలా భావించాడో, సమ సమాజ స్థాపన విషయంలో ఆయన దృక్పథమేవిధంగా ఉండేదో అమర్త్యసేన్ మాటల్లో ఓసారి విందాం. కేవలం తన స్నేహితుడవ్వడం వల్ల తాను ఈ మాటలు చెప్పడంలేదన్న అమర్త్యసేన్ మన్మోహన్ సహనానికి ఫిదా అయ్యేవాడినంటాడు.

ఒక యూనిటీని సాధించాలనుకునే వ్యక్తి… ఒక అద్భుతమైన ప్రోగ్రెసివ్ సొసైటీని తీర్చిదిద్దాలనుకున్న వ్యక్తి.. అందుకోసమే నిరంతరం పరితపించిన సహనశీలి, ఆర్థికవేత్త మన్మోహన్.
కేంబ్రిడ్జ్ లో ఉన్నప్పట్నుంచి సుమారు ఏడు దశాబ్దాలుగా నాకు మన్మోహన్ సన్నిహిత మిత్రుడు. గౌతమబుద్ధుడి సందేశమైన వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్రం సారాంశాన్ని సమాజానికి అందించాలనుకునేవాడు. విభిన్న విశ్వాసాలు కల్గిన వారందరి అస్తిత్వాన్నీ గుర్తించి, పరస్పర గౌరవాన్ని కల్గి ఉండే సమాజ స్థాపన కోసం పరితపించేవాడు.
పశ్చిమ బెంగాల్ లో పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ అమర్త్యసేన్ మన్మోహన్ గురించి చెప్పుకొచ్చాడు.
భారతగడ్డపై పాకిస్థాన్ ఉగ్ర జాడలు బట్టబయలైన ప్రతీసారీ మన్మోహన్ విధానపరంగా ఏంచేయాలో ఆలోచించేవాడే తప్ప.. వాటిపై నోరుందికదా అని స్పందించేవాడు కాదు. ఏదైనా ఒక మత విశ్వాసాన్ని ఆరాధించడం వారి వ్యక్తిగత, ఆయా సమాజాల స్వేచ్ఛకు సంబంధించిన విషయం. కానీ, ఇతర మతాలపై ద్వేషాన్ని రగిలించడం, కించపర్చేలా మాట్లాడటం, వారిపై ఇంకో వర్గాన్ని ఉసిగొల్పడం వంటివి హృదయాలను గాయపరుస్తాయని.. వాటివల్ల మరింత ప్రమాదానికీ, క్షోభకు గురి చేస్తాయన్నది మన్మోహన్ ఆలోచన. ఇంకా అందులోనూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఏవి కూడదో వాటినే చేయడం వల్ల తమల్ని చూసి అనుసరించాలనుకునేవారికి తప్పుడు సందేశాన్నిచ్చినట్టేనన్నదీ సింగ్ సాబ్ అభిప్రాయమంటారు అమర్త్యసేన్.
వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్రం లేదా వజ్రసూత్రం అనేది బౌద్ధంలోని రెండు ప్రాథమిక శాఖల్లో ఒకటైన మహాయానంలోనిది. తూర్పు ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహాయాన సూత్రాల్లో ఒకటి. అక్కడి చాన్ సంప్రదాయంలో ప్రముఖంగా చెప్పుకునే సూత్రమిది.
బుద్ధుడు సూభూతికి చేసిన ప్రసంగం ఏం చెబుతోంది..?
ఈ వజ్రసూత్రాన్నే గౌతమబుద్ధుడు మరో ప్రముఖ సన్యాసైన సుభూతికి వివరించాడట. బుద్ధుడు తక్కిన సన్యాసులతో కలిసి భిక్షాటన ముగించుకుని, విశ్రాంతిగా కూర్చున్న సమయంలో.. సన్యాసుల్లో పెద్దవాడైన సుభూతి ముందుకు వచ్చి బుద్ధుణ్ని వజ్రసూత్రం గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు జ్ఞానస్వభావం గురించిన సంభాషణ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఉన్నతబోధన అనుకున్నవి ఉన్నతబోధనలు కాకపోవచ్చని సుభూతి భ్రమలను పటాపంచలు చేస్తాడు బుద్ధుడు. వాస్తవమేదో జ్ఞానంతో తెలుసుకుని అపరిపక్వ భావనల నుంచి విముక్తి కావడమే మొత్తంగా వజ్రసూత్రమని సుభూతికి ఉపదేశిస్తాడు బుద్ధుడు. భౌతికమైన విషయాలన్నీ స్వప్నాలు, భ్రమలు, బుడగలు, నీడల్లా తేలిపోయేటివేనని బుద్ధుడు చెప్పిన ఆ వజ్రసూత్రం పఠించడానికి పట్టే సమయం కేవలం 40 నుంచి 50 నిమిషాలు మాత్రమే. అందుకే, ఈ వజ్రసూత్రాన్ని కంఠతా భట్టీ పట్టి బౌద్ధమఠాల్లో వల్లె వేస్తుంటారు బౌద్ధభిక్షువులు.
మహాయాన బౌద్ధానికి చెందిన ప్రజ్ఞాపారమిత సూత్రాల వర్గ రచనల్లోని వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్రానికి ఉన్న సంక్షిప్తనామమే వజ్రసూత్రం. బ్రిటీషు గ్రంథాలయం ఉద్దేశ్యం ప్రకారం అత్యంత ప్రాచీన సాహిత్యంగా కూడా ఈ మహాయాన బౌద్ధానికి చెందిన ప్రజ్ఞాపారమిత సూత్రాలను పేర్కొంటారు. చైనీస్ వజ్రసూత్రాలకు సంబంధించి దున్హువాంగ్ ప్రచురణలు 20వ శతాబ్దంలో లభ్యమయ్యాక వీటికి మరింత ఆదరణ పెరిగింది.
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాజీ ప్రధాని సహోద్యోగైన సేన్… సింగ్ తో తాను గడిపిన రోజుల్లో ఆయన విధానాలు, ఆలోచనలు, ప్రసంగాలు, వివిధ మత విశ్వాసాల పట్ల గౌరవం వంటివి ఎలా ఉండేవో చెబుతూ మన్మోహన్ ను ప్రశంసించారు అమర్త్యసేన్.
తానో సిక్కు మతస్థుడైనప్పటికీ.. అన్ని మతాలు, కులాల పట్ల తనది సౌభాతృత్వ ధోరణి. అందుకే తాను మన్మోహన్ ను అమితంగా ఇష్టపడేవాడినని.. ఆయన బుద్ధుడి వజ్రసూత్రాన్నే నమ్మేవాడంటారు అమర్త్యసేన్.



