విశీ (వి.సాయివంశీ) ✍️✍️
అనగనగా ఓ జానకి.. ఆత్మీయంగా అబ్దుల్ ఖాదర్ కుటుంబం!
కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా కౌప్ సమీపంలో మల్లర్ అనే ఊరుంది. అక్కడ ఉండేది జానకి పూజారి. ఆమె వయసు 90 ఏళ్లు. పెళ్లి కాక ముందు నుంచి రఫీఖ్ అబ్దుల్ ఖాదర్ కుటుంబంతో ఆమెకు సాన్నిహిత్యం ఉంది. భర్త పోయిన నాటి నుంచి ఆమె వారితోనే కలిసి ఉంటోంది. వారు ముంబయి వెళ్తే ముంబయి వెళ్లింది. అక్కడి నుంచి ఉడిపి వస్తే తనూ వచ్చేసింది. వారినే తన కుటుంబంలా భావించి పెరిగింది. తన ఒక్కగానొక్క కొడుకు శేఖర్ విట్టల్ సైతం ఆ ఇంట్లో వారి మధ్యే పెరిగాడు, పెద్దవాడయ్యాడు.

… బంధువులతో ఆమె కలిసింది లేదు. ఆమె కోసం వారు వచ్చింది లేదు. కొడుక్కి పెళ్లి జరిగింది. అతనెక్కడో దూరంగా ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయినా ఆమెకు దిగులు లేదు. అబ్దుల్ ఖాదర్ కుటుంబంతోనే ఆమె సావాసం. వారికి ఆమే పెద్ద దిక్కు. ఆమెను బంధువనో, బయటి మనిషో అని అనుకోవడం వారికి నచ్చదు. తమ ఇంటి మనిషే అని భావిస్తారు. అన్నింటిలో ఆమెకే ప్రాధాన్యం ఇస్తారు. రఫీఖ్ చుట్టాలు సైతం ఆమెను ఆ ఇంటి మనిషిలాగే భావించి గౌరవిస్తారు.
… గత మంగళవారం జానకి కన్నుమూశారు. ఆమె కోరిక ప్రకారం అన్ని పనులూ అబ్దుల్ రఫీఖ్ కుటుంబసభ్యులే అన్ని పనులూ చేశారు. దూరాన ఉన్న కొడుకును పిలిపించి, అతని చేత హిందూ మత పద్ధతి ప్రకారం కర్మకాండలు జరిపించారు. ముస్లిం కుటుంబం ముందుండి జరిపించిన ఆ కార్యక్రమాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఊరివారితోపాటు కౌప్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. ఆ రెండు కుటుంబాల మైత్రిని వారంతా పొగిడారు. జానకి 13 రోజుల కార్యక్రమాలు సైతం తమ ఇంటిలోనే జరగాలని రఫీఖ్ కుటుంబసభ్యులు అంటున్నారు.
“మతములన్నియు మాసిపోవును..జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” – గురజాడ అప్పారావు
–



