గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ కు చేదు అనుభవమెదురైంది. ఆయన ప్రసంగం ప్రారంభించారో, లేదో… సుమారు వందమంది విద్యార్థులు నిరసనగా లేచివెళ్లిపోయారు. ఇందుకు స్టాన్ ఫర్ట్ కళాశాల వేదికైంది
ఎందుకు..?
ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్ చేసుకున్న ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణం. ప్రాజెక్ట్ నింబస్ ఇందుకు ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలో మౌన నిరసనతో విద్యార్థులంతా ఆయన ప్రసంగం ఆరంభమైన ఐదు నిమిషాల్లోపే వాకౌట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏంటీ ఈ ప్రాజెక్ట్ నింబస్..?
ఇజ్రాయెల్ ప్రభుత్వానికి కృత్రిమమేధ, క్లౌడ్ కంప్యూటింగ్ లో సేవలందించేందుకు అమెజాన్ తో కలిసి సంయుక్తంగా గూగుల్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
మరి ఎందుకు వివాదాస్పదమైంది..?
ఈ ప్రాజెక్ట్ నింబస్ వల్ల ఇజ్రాయెల్ భద్రతా వర్గాలకు, సైనిక కార్యకలాపాలకు ఉపయోగమనే భావనతో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాజా వార్ నేపథ్యంలో ఇప్పటికే మానవ హక్కుల ఉల్లంఘనపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ నింబస్ తో గూగుల్ ఇజ్రాయెల్ కు మరింత మద్దతిస్తోందనేది స్టాన్ ఫర్డ్ విద్యార్థుల భావన.

పిచ్చాయ్ తన ప్రసంగంలో ఏఐ గురించి ఏమీ మాట్లాడలేదు కూడా. అయినా ఆయనకు నిరసన సెగ తప్పలేదు. ఈ మధ్య కాలంలో పలువురు టెక్ లీడర్స్ ఏఐ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు, నిరసనలు ఎదుర్కొన్నారు. కానీ, గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో మాత్రం అలాంటి వ్యాఖ్యలేవీ చేయకుండా జాగ్రత్త పడ్డా నిరసన మాత్రం తప్పలేదు. అంటే పశ్చిమ దేశాల్లో కూడా.. పశ్చిమాసియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, మారణకాండపై ఏ స్థాయిలో విద్యార్థినీ, విద్యార్థులు ఆలోచిస్తున్నారో చెప్పే ఘటన ఇది.
సుమారు వంద మంది విద్యార్థులు తాము కూర్చున్న స్థానాల నుంచి ఏకకాలం లేచి మౌనంగా బయటకు వెళ్లిపోయి.. ఆ తర్వాత ఫ్రీ ఫ్రీ పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు.
ప్రాజెక్ట్ నింబస్ ఇజ్రాయెల్ కు సాంకేతికంగా ఉపయోగడపడటం వల్ల పాలస్తీనా వంటి దేశాలకు మరింత అన్యాయం జరుగుతుందనే భావన విద్యార్థులది. ఈ క్రమంలో స్టాన్ ఫర్డ్ స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా అనే విద్యార్థి సంఘం వారాల ముందే ఈ వాక్ ఔట్ ను ప్రకటించింది.
మరి అలాంటి నిరసన సభలో పిచ్చాయ్ ఏం మాట్లాడారు..?
ఏఐ గురించే మాట్లాడని సుందర్ పిచ్చాయ్.. ఆప్టిమిజం గురించి చర్చించారు. విద్యార్థులు ఆశావాద దృక్పథంతో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో వార్తలు చూస్తున్నప్పుడు ప్రతీదీ సవాల్ లాగానే అనిపిస్తుందని.. వాటిని ఎదుర్కొనే సమర్థతను సంపాదించాలన్నారు. ప్రతీ తరం వాళ్ల కాలాల్లో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటూనే ఉంటుందని.. వాటిని చూసే దృక్కోణం మాత్రం మనదేనన్నారు. స్టాన్ ఫర్డ్ లోనే మాస్టర్స్ పూర్తి చేసిన పిచ్చాయ్ తాను అకాడమిక్ రంగాన్ని వదిలి.. కార్పోరేట్ రంగం వైపు రావడంపైనా మాట్లాడారు. కానీ, ఆ తర్వాత మీడియా ప్రయత్నించినా.. విద్యార్థుల నిరసనలపై మాత్రం ఆయన పెదవి విప్పలేదు. ఆ ప్రశ్నను పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోయారు.
విద్యార్థుల సమూహం వందమందే కావచ్చుగానీ… వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ నుంచి.. ప్రపంచంలోనే ఒక టాప్ మోస్ట్ కార్పోరేట్ సంస్థ సీఈవో ప్రసంగం సమయంలో మౌనంగా లేచి వెళ్లిపోవడంతో ఇజ్రాయెల్ తో ఒప్పందాలపై నిరసననూ, పాలస్తీనాను కాపాడాలనే మద్దతును ఏకకాలంలో ప్రదర్శించి ఆ వంద మంది విద్యార్థులు విప్లవగీతమై నినదించారు.



