A sculptor who shaped modern India’s monumental art
శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అనే పాట వింటూ.. ఆయన చెక్కిన విగ్రహాలను చూస్తే… ఈ పాట ఈయనలాంటి వారి గురించే రాశారా అనిపిస్తుంది. ఎందుకంటే, ఆయన భారతీయ స్మారక శిల్పకళకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చన శిల్పకారుడు. సరిగ్గా వందేళ్ల వయస్సులో సెంచరీ కొట్టి కన్నుమూసిన.. ఆ ఆధునిక భారత మహత్తర శిల్పి గురించి కాస్త చెప్పుకుందాం.

డా. రామ్ వంజి సుతార్… గుజరాత్ నర్మదా తీరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి జీవకళ ఉట్టిపడే ఎన్నో శిల్పాలతో సుపరిచిత కళాకారుడు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన తన కళా ప్రయాణంలో.. వాస్తవికతకు, చారిత్రక లోతును మేళవిస్తూ ప్రతీకాత్మక విగ్రహాలు, స్మారకాలను తయారుచేసిన శిల్పి. స్టాచ్యూ ఆఫ్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన రామ్ సుతార్… కంచు, పంచలోహ విగ్రహాలతో పాటు.. రాతి శిల్పాలను అచ్చూ మనిషే మళ్లీ మన ముందుకొచ్చాడా అన్నట్టు తీర్చిదిద్దడంలో దిట్ట.
1925, ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని ధూలే జిల్లా గోందూరులో జన్మించాడు. రామ్ సుతార్ ది సాధారణ నేపథ్యం. కానీ, శిల్పకళలో ఆయన ఎదిగిన తీరు అనన్య సామాన్యం. ముంబైలోని సర్ జే.జే. స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి గోల్డ్ మెడలిస్ట్ రామ్ సుతార్. ఆ కళాశాలలో చదువుతున్న సమయంలోనే తన శిల్పకళా నైపుణ్యంతో ఎందరి దృష్టినో ఆకర్షించాడు.
నోయిడాలో స్టూడియో!
సుతార్ నోయిడాలోనే నివశిస్తూ అక్కడే సెటిలయ్యారు. తన స్టూడియో కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. గుజరాత్ లోని కేవడియాలో నిర్మించిన 182 మీటర్ల ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ప్రధాన శిల్పిగా వ్యవహరించడంతో రామ్ సుతార్ పేరు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందిన ఆ ప్రాజెక్టుతో… భారీ పరిమాణంలోని శిల్పకళలో ఆయన పేరును సుస్థిరం చేసింది.
ఆయన కన్నుమూసినా.. తన శిల్పకళతో ఎప్పుడూ తాను గుర్తుండేలా.. సజీవమైన శిల్పాలను మల్చారు రామ్ సుతార్. పార్లమెంట్ భవనం ముందు ధ్యానముద్రలో కూర్చుకున్న మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ వంటివారితో పాటు.. ఇటు దేశంలోనూ, అంటు అంతర్జాతీయంగానూ అనేకమంది చారిత్రక వ్యక్తుల విగ్రహాలు తయారుచేసిన ఓ పెద్ద శిల్ప కార్ఖానా రామ్ సుతార్.
ఎంత పెద్ద శిల్పం చెక్కామన్నది కాదు.. ఆ శిల్పంలో ఫినిషింగ్ టచెస్ ఎలా ఉన్నాయి.. ఒకరి విగ్రహం తయారుచేసినప్పుడు వారే వచ్చి నిజంగా నిల్చున్నారా అన్నట్టుగా జీవం ఉట్టిపడేలా తయారు చేయడమే మిగిలిన దేశంలోని ఎందరో శిల్పకళాకారులతో పోలిస్తే రామ్ సుతార్ ను ప్రత్యేకంగా నిలిపింది. అందుకే, శిల్పకళలో రామ్ సుతార్ కు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులతో పాటు.. మహారాష్ట్రలోని అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్ వంటి బిరుదులు లభించాయి.
అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన రామ్ వి సుతార్ వినయం, నిరాడంబరత, తన కళపై తను కనబర్చే అంకితభావం ఆయనకు మరింత గౌరవాన్ని తెచ్చాయి. జీవితాంతం తన వృత్తిలో క్రియాశీలకంగా పని చేసిన రామ్ సుతార్.. యువ శిల్పులెందరికో మార్గ నిర్దేశం చేశారు. ఆ తర్వాత ఆయనలాగే వారూ విజయవంతమైన శిల్పకారులుగా పేరు తెచ్చుకున్నారు.
అయితే, రామ్. వి. సుతార్ శిల్పకళా ప్రయాణాన్ని ఆయన వారసుడు అనిల్ సుతార్ ఇప్పుడు స్వీకరించి తండ్రి బాటలో నడుస్తున్నాడు. కొడుకు అనిల్ సుతార్ తో కలిసి మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహంతో సహా.. పలు ముఖ్యమైన ప్రాజెక్టుల్లోనూ కలిసి పనిచేశారు రామ్ సుతార్.



