రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా జీవితం ఎంత కష్టంగా మారిందో తనకు, ప్రియాంకకు మాత్రమే తెలుసంటూ భావోద్వేగంతో రాహూల్ గాంధీ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చగా మారింది.
రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా.. రాహూల్ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. తన తల్లి జీవితంలో వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అనుభవాలను ఆత్మకథ రూపంలో ఓ పుస్తకంగా తీసుకురాబోతున్న క్రమంలో… తల్లి జీవితం వెనుక ఉన్న కష్టాల కడలిని గురించి రాహూల్ పంచుకున్నాడు.
మామా అని సంబోధిస్తూ తన ఎమోషనల్ మెస్సేజును X ఖాతాలో పోస్ట్ చేశారు. మూడు దశాబ్దాల క్రితం తన అమ్మానాన్నలిద్దరూ కలిసి ఉన్న క్షణాల్ని గుర్తు చేసుకున్నాడు.
పాపా మనల్ని విడిపోయిన రోజు నుంచి.. జీవితం, నీపై విసిరిన ప్రతీ కష్టాన్నీ అంతులేని ధైర్యం, గౌరవంతో ఎదుర్కోవడాన్ని నేను చూస్తూనే ఉన్నాను. పాపా అనంతరం నువ్వేం అనుభవించావో… నీ జీవితం ఎంత కష్టంగా మారిందో నాకు, ప్రియాంకాకు తెలుసన్నది ఆ పోస్ట్ సారాంశం.
సోనియాగాంధీ జీవిత కథను.. ఆమెను అభిమానించే, మద్దతిచ్చే కోట్లాది మందితో త్వరలో పంచుకోబోతుండటం తనకు గర్వంగా ఉందన్నారు రాహూల్.

బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరిట సోనియాగాంధీ ఆత్మకథ నవంబర్ పదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే, భారత్ లో ఆ పుస్తకం విడుదలెప్పుడన్నది మాత్రం ఇంకా ముద్రణా సంస్థైన పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ప్రకటించలేదు.
వ్యక్తిగత విషయాలను గోప్యతగా ఉంచే నీకు.. నీ అందమైన జీవితకథ వెనుక ఉన్న బాధలనూ ప్రపంచంతో పంచుకోవడమెంత కష్టమో కూడా నాకు తెలుసంటూ రాహూల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తన తండ్రి తన పుట్టినరోజున.. తన తల్లిని చూసి గర్వంగా చిర్నవ్వుతో ఉండటాన్ని తానూహించుకుంటున్నాని రాహూల్ పేర్కొన్నాడు.
మరి సోనియా ఆత్మకథలో ఏముండబోతోంది..?
బాల్యం నుంచి భారత రాజకీయాల్లో ఆమె పాత్ర వరకు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఇటలీలో ఆమె బాల్యం నుంచి భారత్ కు ఆమె ప్రయాణం.. రాజీవ్ తో ప్రేమ, వివాహం వంటి విషయాలను ప్రస్తావించనున్నారు. అలాగే, ఆమె జీవితంలోని తీవ్రంగా ప్రభావితం చేసిన విషాదాలు.. సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరణాల గురించీ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ ప్రస్తావించనుంది. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాల్లో ప్రథమ స్థానంలో ఉండే నెహ్రూ – గాంధీ కుటుంబంతో ముడిపడ్డ సోనియా జీవితం.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి ప్రవేశించిన తీరు ఇవన్నీ ఆ పుస్తకంలో ఉండనున్నాయి.
ముఖ్యంగా 2004 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం తర్వాత.. ఆమె ప్రధాని పదవినే నిరాకరించిన నిర్ణయం వెనుక కారణాలవంటివి మరింత లోతుగా తెలిసే అవకాశముంది.
తన వ్యక్తిగత అనుభవాలను పుస్తక రూపంలో రాయడం అంత సులభమేం కాదని గతంలోనే సోనియా గాంధీ పేర్కొన్నారు. కానీ, ఇప్పుడా సమయం వచ్చింది. తన జీవితం గురించి ప్రపంచంతో పంచుకోవాల్సి వచ్చిందని ప్రచురణ కర్తలు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.
స్వరాజ్ అంటే కేవలం స్వాతంత్ర్యం మాత్రమే కాదని… స్వయం పాలన అని రాహూల్ పేర్కొన్నాడు. హారా భరా స్వరాజ్: ఏ ట్రిబ్యూట్ టూ రాజీవ్ గాంధీస్ విజన్ పేరిట జరిగిన కార్యక్రమంలోనూ రాహూల్ తన భావాలను వెలిబుచ్చాడు. బయటవాళ్ల నియంత్రణ నుంచి విముక్తి పొందడం మాత్రమే స్వాతంత్ర్యం కాదన్నది రాహూల్ అభిప్రాయం.
భారతీయుల మధ్య సామరస్యం.. ప్రతీ హృదయంలో కరుణ.. ప్రతీ పౌరుడికీ న్యాయం… ప్రజాస్వామ్యంలో సమాన హక్కులుండాలని కోరాడు రాహూల్. పాపా నీ బోధనే నా బలం.. నీ జ్ఞాపకాలే నా ధైర్యం.. నువ్వు కలలు కన్న భారతాన్ని నిర్మించాలనే సంకల్పమే ఎప్పటికీ నాకు మార్గదర్శకమంటూ రాహూల్ భావోద్వేగం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరలేపింది. ఎందరినో ఆకట్టుకుంది.



