ఉత్సాహం, ఆసక్తి ఉంటే వయసుతో పనేముంది. రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చుండే వయస్సులోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు ఓ డాక్టర్ సాబ్. 72 ఏళ్ల వయస్సులో ఐఐటీ కోర్సులో ప్రావీణ్యం సంపాదించి.. అదే ఐఐటీ కోసం కష్టపడుతున్న యువత దృష్టినీ ఆకర్షించాడు. వారికిప్పుడాయనో మార్గదర్శి.

డాక్టర్ కర్రి రామారెడ్డి. రాజమండ్రికి చెందిన ఈ సైక్రియాటిస్ట్.. నేర్చుకోవడానికి వయస్సు అసలు అడ్డంకే కాదని నిరూపిస్తున్నాడు. ఇప్పటికే మన ఈ తెలుగు డాక్టర్ 61 డిగ్రీలను సంపాదించారు. మూడు పీహెచ్డీలు పూర్తి చేశాడు. ఐఐటీ ముంబై, ఐఐటీ ఖరగ్ పూర్ వంటి ఉన్నత విద్యాసంస్థలు అందించే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హ్యాన్స్డ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) ద్వారా 11 సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేశారు డాక్టర్ కర్రి రామారెడ్డి.
ఐఐటీలందించే ఈ ఎన్పీటీఈఎల్ కోర్సుల్లో సాధారణంగా వేల మంది అభ్యాసకులుంటారు. అయితే, కర్రి రామారెడ్డి 11 కోర్సులు చేస్తే.. అందులో ఏకంగా 8 కోర్సుల్లో అగ్రస్థానంలో నిల్చి ఆశ్చర్యపర్చాడు. ఎనిమిది సర్టిఫికెట్ కోర్సుల్లోనూ రామారెడ్డి ఎలైట్ ప్లస్ సిల్వర్ లేదా ఎలైట్ ప్లస్ గోల్డ్ గ్రేడ్స్ ను సాధించి చదువుల్లో నిత్యవిద్యార్థిగా దూసుకుపోతున్నాడు.
1954, ఆగస్ట్ 1న జన్మించిన కర్రి రామారెడ్డి రాజమహేంద్రవరంలో జన్మించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అనే చిన్న ఊళ్లో పెరిగాడు. తన ప్రాథమిక విద్యను అనపర్తిలోని జిల్లా పరిషత్ స్కూల్ లో అభ్యసించిన రామారెడ్డి.. కాకినాడ పీఆర్ కళాశాలలో పీయూసీ పూర్తి చేశారు. 1970 సమయంలో రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ఆ తర్వాత బెంగళూర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ లో చేరి, అక్కడి సైక్రియాట్రీలో ఎండీ పూర్తి చేశారు.
రామారెడ్డికి రాష్ట్రపతి అవార్డ్ తో పాటు, బీసీ రాయ్ అవార్డ్ వంటి ప్రతిష్ఠాత్మక గుర్తింపులతో గౌరవం లభించింది. ఆయన చేసిన 61 డిగ్రీల్లో ఐదు ఎల్ఎంఎల్ డిగ్రీలున్నాయి. ఆయన చేసిన మూడు లా డాక్టోరల్ డిగ్రీస్ లో విశాఖపట్నం దామోదరం సంజీవయయ్య నేషనల్ లా యూనివర్సిటీ నుంచి ఒకటి లాలో పూర్తి చేయగా.. పూణేలోని శ్రీ బాలాజీ విద్యాపీఠం నుంచి యోగాలో మరొకటి.. అలాగే, భారతీయార్ యూనివర్సిటీ నుంచి మరో డాక్టరేట్ సంపాదించారు. నేర్చుకోవడానికి వయోపరిమితితో సంబంధం లేదన్నదే రామారెడ్డి బలమైన మోటో. తాను ఫిట్ గా ఉన్నంత కాలం, అభ్యాసంపై అనురక్తి ఉన్నంత వరకు.. తన ఉత్సాహానికి వయస్సు ఎప్పుడూ అడ్డుకాదంటారు రామారెడ్డి.
ఇవాల్టి రోజుల్లో మోబైల్ ఫోన్స్ వచ్చిన ఈ డిజిటల్ ఎరాలో లైబ్రరీల ఉనికే ప్రశ్నార్థకమైందిగానీ.. రామారెడ్డి లాంటివారెందరికో విద్యాతృష్ణ ఏర్పడటానికి ఆనాటి గ్రంథాలయాలే ప్రధాన కారణం. తన తల్లిదండ్రులు కర్రి పెదకాపు మంగాయమ్మ, వెంకట్ రెడ్డి ప్రభావంతో.. వారిమాట వింటూ చిన్నప్పుడు ఎప్పుడూ లైబ్రరీల్లోనే ఎక్కువ పెరిగారు రామారెడ్డి. విస్తృత అధ్యయనం తనను చదువు వైపు అడుగులేయించింది.
నేర్చుకోవడానికి ఇష్టపడితే జీవితమే ఓ తరగతి గది అన్నది రామారెడ్డి చెప్పే మాట. చివరి శ్వాస వరగకూ నిత్యవిద్యార్థిత్వమే తనకు ఇష్టమనే రామారెడ్డి.. ప్రతీరోజూ ఐదు గంటలు కచ్చితంగా తాను ఇప్పటికీ చదువు కోసం కేటాయిస్తానంటున్నారు. మొత్తంగా ఏజ్ ఒక నంబర్ మాత్రమే.. క్యూరియాసిటీ ఉంటే ఏ అడ్డంకులు, ఆటంకాలు మనిషినేమీ చేయలేవని నిరూపిస్తున్నారు. బీస్ విద్య, తీస్ లక్ష్మి అంటూ జనరలైజ్డ్ స్టీరియోటైప్ స్టేట్ మెంట్స్ బ్రేక్ చేసి.. తన డిగ్రీలతో వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న కర్రి రామారెడ్డి మరిన్ని ఉన్నత చదువులతో తన జీవన సాఫల్యాన్ని పొందాలని ఆశిద్దాం.



