సమాజం నుంచి విశ్వాసం చూరగొన్న వ్యక్తి ఏదైనా తప్పు చేస్తేనే ఇట్టే వైరలైపోతాడు. అలాంటిది ఓ ఇనిస్టిట్యూషనే తప్పు చేస్తే… అదింకా వైరలే. ఐఐటీ రూర్కీ నిర్వాకం ఇప్పుడు అలాగే సోషల్ మీడియాలో వైరలై చక్కర్లు కొడుతోంది. రకరకాల భిన్నాభిప్రాయాలు కామెంట్స్ రూపంలో వ్యక్తమవుతుండగా.. ఇంకొంచెం ముందుకెళ్లి దక్షిణాదిపై ఉత్తరాదివారి చులకన భావమనే వ్యాఖ్యలు కూడా నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ఆర్గనైజేషన్ ఒక మెయిల్ పంపేటప్పుడు తరచి చూసుకోవాల్సిన బాధ్యత, అవసరం లేదా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంకొందరు ఐఐటీ రూర్కీ పనిని ఓ వినోదంగా భావిస్తూ కౌంటర్ కామెడీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది..?

ప్రియమైన ఇడ్లీ చట్నీ.. నో సాంబార్ అంటూ గేట్ అభ్యర్థుల కోసం ఐఐటీ రూర్కీ పంపిన ఈమెయిల్ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ముచ్చట.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్… అదేనండి గేట్ (GATE)ను ఈసారి 2025లో ఐఐటీ రూర్కీ నిర్వహించబోతోంది. అందుకోసం అడ్మినిస్ట్రేషన్ పంపిన మెయిల్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఎగ్జామ్ రాసేందుకు అడ్మిషన్ పొందినవారికి పంపే ఈమెయిల్ లో భాగంగా పంపిన గ్రీటింగ్స్ ఇప్పుడు వివాదానికి తెరలేపాయి. కొందరికి పంపిన మెయిల్ లో Dear IDLY CHUTNEY NO SAMBHAR అనే మెస్సేజ్ వెళ్లడం చర్చను లేవనెత్తింది.
ఈ విషయం కాస్తా ఓ రెడిట్ యూజర్ కనిపెట్టాడు. ఆ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దాంతో గేట్ అడ్మినిస్ట్రేషన్ పంపిన ఆ ఈమెయిల్ ఉద్ధేశపూర్వకంగా చేసిందా.. లేక, తెలియక జరిగిందా… బాధ్యతాయుతమైన ఓ ఆర్గనైజేషన్ తన మెయిల్ పంపేటప్పుడు ఏం రాస్తున్నామని చూసుకోవాల్సిన బాధ్యత లేదా.. లేక, దక్షిణాదివారిని కించపర్చేవిధంగా కావాలనే ఇలా తమ వంటకాలతో ముడిపెట్టి చులకన చేస్తున్నారా అనే పలు వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాకెక్కుతున్నాయి.
గేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ పోర్టల్ లో అడ్మిషన్ కార్డ్స్ లౌడ్ చేసుకోవాలనే మెస్సేజ్ పంపే క్రమంలో ఈ విధంగా Dear IDLY CHUTNEY NO SAMBHAR అని చేసిన మెస్సేజ్ ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణమైంది. అసలెలాంటి సందర్భం కూడా ఏదీ లేకుండా ఇడ్లీ చట్నీ నో సాంబార్ అంటూ గ్రీట్ చేయడమేంటి.. అసలు సోయిలో ఉన్నారా అంటూ గేట్స్ అడ్మినిస్ట్రేషన్ ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.
కొందరైతే ఇదో జోకా అంటూ వెటకారాన్ని దట్టిస్తుంటే.. సాంబార్ లేకుండా ఓన్లీ చట్నీతోనేనా అంటూ కొందరు మెస్సేజ్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఇలాంటి ఈ మెయిల్ పంపిన ఆ ఐటీ సెల్ ఉద్యోగికి తక్షణమే జీతం పెంచాలంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఇంకాస్త ముందుకెళ్లినవారు ఆ అడ్మిషన్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఓసారి చూడండి.. మీ పేరు ఇడ్నీ చట్నేనా కాదా తెలుస్తుందంటారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడంతో గేట్ అడ్మినిస్ట్రేషన్ స్పందించక తప్పని పరిస్థితేర్పడింది. దాంతో బల్క్ మెయిలింగ్ లో సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందంటూ ఓ వివరణ ఇచ్చింది. వెంటనే దాన్ని పరిష్కరిస్తున్నాం. జరిగిన తప్పుకు చింతిస్తున్నాం. అసౌకర్యానికి క్షమాపణ కోరుతున్నామంటూ ఐఐటీ రూర్కీ మీడియా సెల్ ఇంఛార్జ్ సోనికా శ్రీవాస్తవ ప్రకటన విడుదల చేశాడు.
అయితే, ఈ వ్యవహారం కూడా ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలకు, వివాదాలకు తావిచ్చేలా మారింది. దక్షిణాది రాష్ట్రాలపై ఉన్న వివక్షతోనే.. అక్కడి ఆహారపలవాట్లు, ఆచార, సంప్రదాయాలను కించపర్చే విధంగా వెటకారంగా, దురుద్ధేశపూర్వకంగా ఈ మెయిల్ ను తయారు చేసి ఉంటారన్న అనుమానాలే ఎక్కువ వ్యక్తమవుతున్నాయి.



