టీ20ల పేరిట ధనాధన్ క్రికెట్ కు అలవాటయ్యారు. 50 ఓవర్ల వన్డేనే ఎప్పుడైపోతుందానన్న టెస్టునెదుర్కొంటున్నారు. ఇక టెస్టుల్లో ఓపికగా ఆడాలంటే కష్టమేనేమో! భారతగడ్డ మీద ఇండియాను మూడు టెస్టుల సీరీస్ లో మట్టి కరిపించి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. సీరీస్ మొత్తం కోల్పోయి భారత్ ఇప్పుడు విమర్శలకు సమాధానం చెప్పాల్సిన స్థితిలో బేలగా చూస్తోంది.
వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్ ను ముంచెత్తిన పొగడ్తలో… లేక, ప్రత్యర్థిపై చిన్నచూపుతో తయారైన అతివిశ్వాసమోగానీ.. 1934 తర్వాత భారత్ తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ పై 3-0 సీరీస్ ఓటమితో ఇప్పుడు పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిలో నిల్చుంది. .

అదే సమయంలో భారత్ ను భారత్ లోనే క్లీన్ స్వీప్ చేస్తూ సీరీస్ సాధించిన మొట్టమొదటి టీంగా కూడా న్యూజిలాండ్ పేరు నిల్చిపోయింది.
ఆఖరి టెస్టులో 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక రోహిత్ సేన వెల్లకిలపడిపోయింది. కేవలం 121 పరుగులు మాత్రమే సాధించి కుప్పకూలింది.
ఒక్క రిషబ్ పంత్ 64 పరుగులతో వివాదాస్పద ఔట్ మినహా.. రెండెంకల స్కోర్ ఎవరైనా ఉన్నారా అంటే.. ఉన్నారు అదీ కెప్టెన్ రోహిత్ 11 పరుగులు అని ఘనంగా చూపేంత బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది. ఎందుకంటే ఎనిమిది మంది బ్యాట్స్ మెన్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం ఇక్కడ మరో విషాదం.
బెంగళూర్ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై.. పూణే టెస్టులో 113 పరుగుల తేడాతో చేతులెత్తేసిన భారత్… సీరీస్ లో చివరి టెస్టును కూడా కోల్పోయి.. ప్రస్తుత భారత టెస్ట్ క్రికెట్ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది.
స్వాతంత్రానికి పూర్వం 1933-34లో భారత్ లో ఇంగ్లాండ్ తో జరిగిన 3 టెస్టుల సీరీస్ లో 2-0తో భారత్ సీరీస్ ను జారవిడుచుకుంది.
భారత్ పై టెస్టు సీరీస్ ను వైట్ వాష్ చేసిన జట్టుగా ఇప్పుడు న్యూజిలాండ్ ది ఐదోస్థానం. ఇప్పటికే ఆస్ట్రేలియా 3 సార్లు ఈ ఫీట్ సాధించగా, ఇంగ్లాండ్ నాల్గుసార్లు, వెస్ట్ ఇండీస్ ఒకసారి సాధించాయి. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేయగా.. ఆ తర్వాత, ఇప్పుడు న్యూజిలాండ్ ఒక సీరీస్ లో ఏకంగా 3 టెస్టులను గెలవడం కూడా తమ స్వదేశంలోనైనా, విదేశంలోనైనా ఇదే మొట్టమొదటిసారి కావడం గమనార్హం.
న్యూజిలాండ్ పై సీరీస్ లో కనీసం చివరి టెస్టైనా గెల్చి భారత్ పరువు నిలుపుకుంటుందని యావత్ దేశమంతా ఎదురుచూసింది. టెస్ట్ సీరీస్ గెలుపు కోసం నిరీక్షణ కాస్తా.. పరువు నిలుపుకుంటుందా అనే స్థాయికి పడిపోగా.. అది కూడా సాధ్యపడలేదు సరికదా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లు చూపించిన స్పిరిట్ బ్యాట్స్ మెన్ కనబర్చకపోవడం ఈసారి శాపంగా మారింది.
గత 36 ఏళ్లుగా భారత జట్టుపై టెస్టు సీరీసులు కోల్పోతూ వస్తున్న న్యూజిలాండ్… భారతగడ్డపైనే టీంఇండియాను వైట్ వాష్ చేసి తన కసి తీర్చుకుంది.
హిట్ మ్యాన్ కాస్తా ఫట్టయ్యాడు. రన్ మిషన్ కాస్తా పరుగాపేసింది. గిల్ వెల్లకిల్లా పడిపోయాడు. యశస్వీ తుస్సన్నాడు. సర్పరాజ్ కాస్తా ఏక్ మ్యాచ్ కా రాజ్ అయ్యాడు. మొత్తంగా అంతా కలిసి చేతులెత్తేసి.. ప్రస్తుత భారత్.. టెస్టుల్లో ఏ పరిస్థితుల్లో ఉందో తెలియజెప్పారు.
ఆట అన్నాక గెలుపోటములు సర్వసాధారణం. భారత్ టీ20 ప్రపంచకప్ సాధించినప్పుడు వేనోళ్ల పొగిడిన నోళ్లే ఇప్పుడు తిట్టిపోస్తాయి. అందులో సందేహం లేదు. అయితే, ప్రత్యర్థిని కనీసం ఢీకొట్టే విషయంలో కూడా కనీస పోరాటపటిమ కనబర్చకుండా భారత బ్యాటింగ్ లైనప్ చేతులెత్తేయడం ఏదైతే ఉందో… రెండు టెస్టుల్లో ఓటమి పాలయ్యాక కూడా పొరపాట్లను పునరావృతం చేయకుండా చూపించాల్సిన అనుభవం ఏదైతే ఉందో.. అవే, ఇప్పుడు భారత్ పై విమర్శలకు తావిచ్చే అంశాలు. ఎనీ వే.. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా ఫర్ ఫ్యూచర్ ఎండీవర్స్!



